మేం ఇప్పుడే పని మొదలు పెట్టాం.. ఇంకా చేయాల్సింది చాలా ఉంది : సీఎం రేవంత్ రెడ్డి-chief minister revanth reddy speech at the bharat summit 2025 program ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  మేం ఇప్పుడే పని మొదలు పెట్టాం.. ఇంకా చేయాల్సింది చాలా ఉంది : సీఎం రేవంత్ రెడ్డి

మేం ఇప్పుడే పని మొదలు పెట్టాం.. ఇంకా చేయాల్సింది చాలా ఉంది : సీఎం రేవంత్ రెడ్డి

భారత్ సమ్మిట్‌లో ప్రసంగించడం గర్వంగా భావిస్తున్నానని.. సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. ఇప్పుడే పని మొదలు పెట్టాం.. ఇంకా చేయాల్సింది చాలా ఉందని చెప్పారు. ప్రజావాణి ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నామన్న ముఖ్యమంత్రి.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా గత పదేళ్లుగా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు.

సమ్మిట్‌లో మాట్లాడుతున్న రేవంత్

తెలంగాణకు ఎంతో గొప్ప చరిత్రతో పాటు ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా ఉన్న తెలంగాణ.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం ఎన్నో దశాబ్దాలపాటు పోరాడిందని వివరించారు. విద్యార్థులు, కార్మిక సంఘాలు, రైతులు, మహిళలు ఉద్యమానికి నాయకత్వం వహించారన్న రేవంత్.. వారి పోరాటం వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని స్పష్టం చేశారు.

ఆకాంక్షల సాధన కోసం..

'ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా గత పదేళ్లుగా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. తమ ఆకాంక్షల సాధన కోసం ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారు. సమాజంలోని అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడమే మా ప్రభుత్వ లక్ష్యం. ముఖ్యంగా విద్యార్థులు, యువత, రైతులు, మహిళలు, అణగారిన కులాల ఆకాంక్షలు నెరవేర్చడం మా కర్తవ్యం. భారతదేశ చరిత్రలోనే అతి పెద్ద సంక్షేమ పథకాలను మేం ప్రారంభించాం. 15 ఆగస్టు 2024 న రూ.20,617 కోట్లు చెల్లించి 25లక్షల 50 వేల మంది రైతులను పూర్తిగా రుణ విముక్తులను చేశాం' అని రేవంత్ వివరించారు.

అన్నదాతకు దన్నుగా..

'మా రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రైతుభరోసా పేరుతో ఎకరాకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తున్నాం. భూమిలేని రైతుకూలీలకు ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.12,000 సాయం అందిస్తున్నాం. వ్యవసాయ రంగంలో భూమిలేని, భూమి కలిగిన రైతులకు కలిపి ఏటా రూ.20,000 కోట్లకు పైగా నిధులు ఇస్తున్నాం. రైతుల పండించిన ధాన్యానికి మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్నాం. రైతుబీమా, పంటల బీమాలతో రైతులకు లబ్ధి చేకూరుస్తున్నాం' రేవంత్ వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ వల్లే ఇది సాధ్యమైంది..

'యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీని ప్రారంభించాం. మేం అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే 60 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయగలిగాం. 5 లక్షల మంది యువతకు ప్రయోజనం కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించుకున్నాం. ప్రజోపయోగ విధానాలను రూపొందించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నీటిపారుదల, విద్యపై దృష్టి సారించారు. ఇందిరాగాంధీ రోటీ, కపడా ఔర్ మకాన్ అనే నినాదంతో పేదరిక నిర్మూలనకు కృషి చేశారు. ఆ తర్వాత వచ్చిన ముగ్గురు కాంగ్రెస్ ప్రధానులు రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, డాక్టర్ మన్మోహన్ సింగ్.. ఆధునికీకరణ, అభివృద్ధి, టెలికాం, సాఫ్ట్ వేర్ వంటి ప్రపంచ సాంకేతిక విప్లవాలపై దృష్టి సారించారు. వారి కృషి వల్లే భారత్ ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది' అని సీఎం స్పష్టం చేశారు.

యువతకు ఉద్యోగాలు..

'విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలకు మా ప్రభుత్వంలో తొలి ప్రాధాన్యం ఇస్తోంది. దావోస్, అమెరికా, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్ లలో జరిగిన పెట్టుబడుల సదస్సులకు మేం హాజరయ్యాం. ప్రైవేటు రంగంలో యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు రూ.2.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. మా ప్రభుత్వానికి మహిళలు, రైతులు, యువతే ప్రధాన భాగస్వాములు. మా రాష్ట్రంలో అద్భుతమైన మహిళా పారిశ్రామికవేత్తలు ఉన్నారు. కొంత మంది మహిళలు కలిసి స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్రంలో 67 లక్షల మంది స్వయం సహాయక సభ్యులున్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చూడాలన్నదే మా లక్ష్యం' అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

ఇంకా చేయాల్సింది ఉంది..

'ప్రజావాణి ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నాం. భారతదేశంలో కుల సర్వే నిర్వహించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవడం గర్వంగా ఉంది. దేశంలో ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేపట్టిన మొదటి రాష్ట్రం తెలంగాణ. మేం ఇప్పుడే పని మొదలు పెట్టాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ప్రజల జీవితాలను మార్చేందుకు మేం చేపట్టిన మిషన్ లో చేరాలని మీ అందరినీ ఆహ్వానిస్తున్నా. మీ అనుభవం, పరిజ్ఞానం, నైపుణ్యాలను మాతో పంచుకోండి. మీరే “తెలంగాణ రైజింగ్” బ్రాండ్ అంబాసిడర్లుగా మారి.. తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటండి' అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

సంబంధిత కథనం