Telangana Education : విద్యతోపాటు సాంకేతిక నైపుణ్యాన్ని అందించాల్సిన అవసరం ఉంది : సీఎం-chief minister revanth reddy speech at mogiligidda government school ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Education : విద్యతోపాటు సాంకేతిక నైపుణ్యాన్ని అందించాల్సిన అవసరం ఉంది : సీఎం

Telangana Education : విద్యతోపాటు సాంకేతిక నైపుణ్యాన్ని అందించాల్సిన అవసరం ఉంది : సీఎం

Basani Shiva Kumar HT Telugu
Jan 31, 2025 06:41 PM IST

Telangana Education : విద్యతోపాటు సాంకేతిక నైపుణ్యాన్ని విద్యార్థులకు అందించాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాలలో మాట్లాడిన ముఖ్యమంత్రి.. కీలక వ్యాఖ్యలు చేశారు. విద్య కోసం అవసరమైన నిధులను సమకూర్చుతున్నామని వివరించారు.

సీఎం రేవంత్
సీఎం రేవంత్

మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల ఎంతోమంది మేధావులను అందించిందని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ గ్రామాన్ని, పాఠశాలను అభివృద్ధి చేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ విజ్ఞప్తి చేశారన్న సీఎం.. 150 సంవత్సరాల ఈ పాఠశాల గొప్పతనాన్ని వివరించారని చెప్పారు. హైదరాబాద్ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు లాంటి వారిని ఈ పాఠశాల అందించిందని వివరించారు.

yearly horoscope entry point

భావితరాలకు అందిస్తాం..

'తెలంగాణలో ఈ గ్రామాన్ని, పాఠశాలను అభివృద్ధి చేసి.. భావితరాలకు ఒక చరిత్రగా అందించాల్సిన అవసరం ఉంది. అందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని విద్యార్థులకు అందించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ గ్రామానికి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌ను మంజూరు చేశాం. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే.. 11 వేల మంది ఉపాధ్యాయులను నియమించి పాఠశాలలను బలోపేతం చేశాం' అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఎలాంటి వివాదాలు లేకుండా..

'31 వేల మంది ఉపాధ్యాయుల ప్రమోషన్లు ఎలాంటి వివాదం లేకుండా పూర్తి చేశాం. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్‌లో డైట్, కాస్మోటిక్స్ ఛార్జీలను పెంచాం. పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే ఉక్కు సంకల్పంతో.. ప్రభుత్వం ముందుకు వెళుతోంది. వైస్ ఛాన్స్‌లర్స్‌ను నియమించి.. యూనివర్సిటీలను బలోపేతం చేసుకున్నాం. ప్రొఫెసర్ల అనుభవాన్ని ఉపయోగించుకునేందుకు.. వారి రిటైర్మెంట్ వయసును 65కు పెంచాం' అని సీఎం వివరించారు.

7 శాతం నుంచి 15 వరకు..

'బడ్జెట్‌లో 7 శాతం విద్య కోసం కేటాయించాం. ప్రభుత్వ పాఠశాలల్ని, కళాశాలలను, యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తే.. అది ప్రజలకు ద్రోహం చేయడమే. అందుకే విద్య కోసం బడ్జెట్‌ని 7 శాతం నుంచి దశలవారీగా 15 శాతం వరకు పెంచుకుంటూ వెళ్తాం. సాంకేతిక నైపుణ్యం పెంచి నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నాం. మట్టిలో మాణిక్యాలని వెలికి తీసేందుకు.. త్వరలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించికోబోతున్నాం' అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

స్పోర్ట్స్ హబ్‌గా హైదరాబాద్..

'హైదరాబాద్‌ను స్పోర్ట్స్ హబ్‌గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించి.. ప్రతిష్ట పెంచాలి. లోపాలను సవరించుకుని విద్యా ప్రమాణాలు పెంచుకుందాం. విద్య కోసం అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేస్తాం. విద్యార్థులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం' అని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.

Whats_app_banner