Charlapalli Terminal: చర్లపల్లి టెర్మినల్ వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని, మచిలీపట్నం పోర్టు కనెక్టివిటీ కోరిన రేవంత్‌-cherlapalli terminal ready prime minister virtually inaugurated 4th passenger terminal in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Charlapalli Terminal: చర్లపల్లి టెర్మినల్ వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని, మచిలీపట్నం పోర్టు కనెక్టివిటీ కోరిన రేవంత్‌

Charlapalli Terminal: చర్లపల్లి టెర్మినల్ వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని, మచిలీపట్నం పోర్టు కనెక్టివిటీ కోరిన రేవంత్‌

Bolleddu Sarath Chandra HT Telugu
Jan 06, 2025 01:15 PM IST

Charlapalli Terminal: హైాదరబాద్‌ మహానగరంలో మరో రైల్వే ప్యాసింజర్‌ టెర్మినల్‌ ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. చర్లపల్లి ప్యాసింజర్‌ టెర్మినల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. హైదరాబాద్‌లో గవర్నర్ జిష్ణుదేవ్‌ వర్మ, కేంద్రమంత్రులు కిషన్‌ రెడ్డి, సోమన్న తదితరులు పాల్గొన్నారు.

చర్లపల్లి టెర్మినల్‌ ప్రారంభోత్సవంలో గవర్నర్‌ విష్ణుదేవ్‌ వర్మ, కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ తదితరులు
చర్లపల్లి టెర్మినల్‌ ప్రారంభోత్సవంలో గవర్నర్‌ విష్ణుదేవ్‌ వర్మ, కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ తదితరులు

Charlapalli Terminal: తెలంగాణలో ట్రలియన్‌ డాలర్‌ ఎకానమీ సాధించడానికి హైదరాబాద్‌ నుంచి మచిలీపట్నం పోర్టుకు డెడికేటెడ్‌ రైల్ కారిడార్‌ ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.  హైదరాబాద్‌లో అత్యాధునిక హంగులతో నిర్మించిన ప్యాసింజర్‌ టెర్మినల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. చర్లపల్లి టెర్మినల్‌ ప్రారంభోత్సవంతో పాటు రాయగడ డివిజన్‌లో పలు అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. చర్లపల్లి టెర్మినల్‌ నిర్మాణంతో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లపై ఒత్తిడి తగ్గుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.

yearly horoscope entry point

మచిలీపట్నంకు కొత్త లైన్‌ ఇవ్వండి…

సముద్ర తీరం లేని తెలంగాణ రాష్ట్రం నుంచి ఎగుమతుల్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా రైల్వే లైన్‌ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి మోదీకి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోందని, ఆటోమొబైల్‌, ఇతర పరిశ్రమల ఉత్పత్తుల్ని ఎగుమతి చేయడానికి వీలుగా డెడికేటెడ్‌ రైల్ కారిడార్‌ను హైదరాబాద్‌ మచిలీపట్నం మధ్య ఏర్పాటు చేయాలని కోరారు. రైల్ కారిడార్‌ నిర్మిస్తే తెలంగాణ ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ సాధిస్తుందని,  రాష్ట్రానికి తిరుగు ఉండదని వివరించారు. హైదరాబాద్‌ మెట్రో రెండోదశకు సాయం చేయాలని కోరారు. 

అంతర్జాతీయ స‌్థాయి అభివృద్ధి….

శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ను తలదన్నేలా సికింద్రాబాద్ టెర్మినల్‌ను తీర్చిదిద్దుతున్నట్టు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చెప్పారు.  చెప్పారు. దానికి అప్రోచ్‌ రోడ్డు నిర్మాణం అవసరముందన్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్‌ కు కూడా అప్రోచ్‌ రోడ్డు సమస్య ఉందని, రాష్ట్ర ప్రభుత్వం భూమిని ఇవ్వలేదన్నారు. కేసీఆర్‌ ఉన్నపుడు పది లేఖలు రాసినా ఒక్క దానికిి కూడా స్పందించలేదన్నారు. రేవంత్‌ రెడ్డికి కూడా లేఖరాయగానే సమావేశం ఏర్పాటు చేశారని చెప్పారు. చర్లపల్లికి స్టేషన్‌కు వేగంగా అప్రోచ్‌ రోడ్డును నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

తెలంగాణలో మోదీ ప్రభుత్వం వచ్చాక 346 కిలోమీటర్ల రైల్వే లైన్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఎంఎంటిఎస్‌ రైళ్ల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా, రెండో దశను పూర్తిగా కేంద్రం నిధులతోనే నడుపుతున్నట్టు చెప్పారు. యాదగిరి గుట్ట వరకు ఎంఎంటిఎస్‌ వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. గత ప్రభుత్వం రైల్వే ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని, తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంఎంటిఎస్‌ యాదగిరి గుట్ట వరకు పొడిగించడానికి సహకరించాలన్నారు. గుట్టకు వెళ్లే భక్తుల కోసం రైల్వే లైన్ నిర్మాణానికి మోదీ అంగీకరించారని చెప్పారు. తెలంగాణలో రైల్వేల అభివృద్ధి, ఆధునీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.

కొమరవెల్లి ఆలయ నిర్మాణానికి కేంద్రం నిర్ణయించిందని, వచ్చే ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. కొమరవెల్లిలో అద్భుతమైన స్టేషన్‌ నిర్మిస్తామని చెప్పారు. రైల్వేల అభివృద్ధి కోసం వేగవంతంగా పనిచేస్తున్నామని చెప్పారు.

ఆరున్నరేళ్ల వ్యవధిలో దాదాపు రూ.428 కోట్లతో నిర్మించిన టెర్మినల్‌తో శివారు ప్రాంతాల్లో నివసించే ప్రయాణికులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందని వివరించారు. ప్రయాణికుల కోసం అంతర్జాతీయ స్థాయి సదుపాయాలను కల్పించినట్టు చెప్పారు. దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో కొత్త టెర్మినల్‌ మైలు రాయిగా నిలిచిపోతుందని చెప్పారు.

కేంద్ర మంత్రులు మంత్రి జి.కిషన్ రెడ్డి, వి.సోమన్న, బండి సంజయ్, తెలంగాణ గవర్నర్ విష్ణుదేవ్ వర్మ, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తదితరులు హాజరయ్యారు.

రేపటి నుంచి రైళ్ల రాకపోకలు…

చర్లపల్లి టెర్మినల్‌ నుంచి జనవరి 7 నుంచి సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్- సికింద్రాబాద్ (12757-12758), గుంటూరు- సికింద్రాబాద్- గుంటూర్ ఎక్స్‌ప్రెస్‌ (17201-17202), సికింద్రాబాద్- సిర్పూర్ కాగజ్‌ నగర్- సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ (17233-17234) రైళ్లకు చర్లపల్లిలో అదనపు స్టాప్‌ ఏర్పాటు చేశారు,.

హైదరాబాద్ స్టేషన్ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్లి వచ్చే రైళ్లు (12603-12604) మార్చి 7 నుంచి, గోరఖ్ పూర్- సికింద్రాబాద్ వెళ్లి వచ్చే రైళ్లు (12589-12590) మార్చి 12 నుంచి చర్లపల్లి టెర్మినల్ నుంచే రాకపోకలు సాగిస్తాయని అధికారులు చెప్పారు.

పలు ప్రాజెక్టులకు ప్రారంభం, శంకుస్థాపన

ప్రధాని మోదీ సోమవారం ఢిల్లీ నుంచి వర్చువల్గా పలు రైల్వే ప్రాజె క్టులకు ప్రారంభం, శంకుస్థాపన చేశారు. దేశంలో కొత్తగా జమ్మూ రైల్వే డివి జన్‌ను ప్రధాని ప్రారంభిస్తారు. అనంతరం ఈస్ట్ కోస్ట్ రైల్వేలో రాయగడ రైల్వే డివిజన్ భవనానికి శంకుస్థాపన చేస్తారు.

పఠాన్ కోట్ - జమ్మూ - ఉధంపూర్ - శ్రీనగర్ - బారాముల్లా, భోగ్ పూర్ సిర్వాల్ - పఠాన్ కోట్, బటాలా - పఠాన్ కోట్ మరియు పఠాన్ కోట్ నుండి జోగిందర్ నగర్ సెక్షన్లతో కూడిన 742.1 కిలోమీటర్ల జమ్మూ రైల్వే డివిజన్ ఏర్పాటు జమ్మూ కాశ్మీర్ మరియు పరిసర ప్రాంతాలకు గణనీయంగా ప్రయోజనం కలుగనుంది.

తెలంగాణలోని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని చర్లపల్లి న్యూ టెర్మినల్ స్టేషన్ ను కొత్త కోచింగ్ టెర్మినల్ గా అభివృద్ధి చేయడంతో పాటు సుమారు రూ.413 కోట్లతో సెకండ్ ఎంట్రీ ఏర్పాటు చేశారు. మంచి ప్రయాణీకుల సౌకర్యాలతో కూడిన ఈ పర్యావరణ స్నేహపూర్వక టెర్మినల్ నగరంలో ప్రస్తుతం ఉన్న సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ వంటి కోచింగ్ టెర్మినల్స్ లో రద్దీని తగ్గిస్తుంది.

ఈస్ట్ కోస్ట్ రైల్వే రాయగడ రైల్వే డివిజన్ భవనానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. ఇది ఒడిశా, ఆంధ్రప్రదేశ్ మరియు సమీప ప్రాంతాలలో కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని, ఈ ప్రాంతం యొక్క మొత్తం సామాజిక-ఆర్థిక అభివృద్ధికి దారితీస్తుందని అంచనా వేస్తున్నారు.

Whats_app_banner