TS SI Constable Final Exams: SI, కానిస్టేబుల్ రాత పరీక్షల తేదీల్లో మార్పులు.. కొత్త డేట్స్ ఇవే
Telangana SI, Constable Final Exam Dates 2023:పోలీసు ఉద్యోగ అభ్యర్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు. ఎస్ఐ, కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షల తేదీల్లో పలు మార్పులు చేసింది. ఈ మేరకు బోర్డు ప్రకటన విడుదల చేసింది.
Changes in Telangana SI, Constable Final Exam Dates: పోలీసు ఉద్యోగ అభ్యర్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు. ఎస్ఐ, కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షల తేదీల్లో మార్పులు చేసింది. ఎస్సై (ఐటీ), ఏఎస్సై (ఫింగర్ ఫ్రింట్స్), కానిస్టేబుల్, కానిస్టేబుల్ (ఐటీ) పరీక్షల తేదీల్లో మార్పులు జరిగినట్లు రిక్రూట్ మెంట్ బోర్డు వెల్లడించింది మొత్తం నాలుగు పరీక్ష తేదీల్లో మార్పులు చేసినట్లు ప్రకటించింది.
ట్రెండింగ్ వార్తలు
కొత్త డేట్స్ ఇవే…
ఏప్రిల్ 23వ తేదీన జరగాల్సిన కానిస్టేబుల్ రాత పరీక్షను 30వ తేదీకి, కానిస్టేబుల్ (ఐటీ విభాగం) పరీక్ష ఏప్రిల్ 23వ తేదీ నుంచి 30వ తేదీకి, ఎస్సై(ఐటీ) పరీక్ష మార్చి 12వ తేదీ నుంచి 11వ తేదీకి, ఏఎస్సై( ఫింగర్ ప్రింట్స్) పరీక్ష మార్చి 12వ తేదీ నుంచి 11వ తేదీకి మార్పు చేసింది. ఆయా తేదీల్లో ఇతర పరీక్షలు ఉన్నాయని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసిన విజ్ఞప్తి మేరకు తేదీల్లో మార్పులు చేసినట్లు పోలీసు నియామక బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.
రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి గతేడాది ఆగస్టు 7న ప్రాథమిక పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో క్వాలిఫై అయిన వారికి...గత నెలలో ఈవెంట్స్ పరీక్షలను నిర్వహించింది. డిసెంబర్ 8న మొదలైన ఎస్సై, కానిస్టేబుల్ ఫిజికల్ ఈవెంట్స్ ప్రక్రియ జనవరి 5వ తేదీన ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12 సెంటర్లలో ఈవెంట్స్ నిర్వహించగా.. 2,07,106 మంది అభ్యర్ధులు పాల్గొన్నారు. ఇందులో 1,11,209 మంది (53.7 శాతం) అభ్యర్ధులు క్వాలిఫై అయ్యారని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వెల్లడించింది. 2018 – 19 లో వచ్చిన నోటిఫికేషన్ లో 48.5 శాతం మంది అభ్యర్థులు ఫిజికల్ ఈవెంట్స్ లో క్వాలిఫై అవ్వగా, ఈసారి ఆ సంఖ్య 53.7 శాతానికి పెరిగిందని రిక్రూట్ మెంట్ బోర్డు తెలిపింది.
APSLLPRB Hall Tickets: మరోవైపు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో చేపట్టిన కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షకు హాల్ టిక్కెట్లు జారీ చేస్తున్నారు. ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ నియామకాలలో భాగంగా ప్రాథమిక రాత పరీక్షల నిర్వహణకు పోలీసు శాఖ ఏర్పాట్లు చేస్తోంది. 3580 సివిల్ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులతో పాటు 2520 ఏపీఎస్పీ కానిస్టేబుళ్ల నియామకాల కోసం గత ఏడాది నవంబర్ 28న నోటీఫికేషన్ విడుదలైంది. మొత్తం 6100 కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఈ ఏడాది జనవరి 7వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తుల్ని స్వీకరించారు. కానిస్టేబుల్ నియామకాల్లో భాగంగా ప్రాథమిక రాత పరీక్షను జనవరి 22వ తేదీన ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. ఉద్యోగ నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జనవరి 12 నుంచి 20వ తేదీ వరకు హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టిక్కెట్లను https://slprb.ap.gov.in/నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.