Central Govt On HCU Lands Row : కంచ గచ్చిబౌలి భూములపై వివాదం వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ భూములపై వెంటనే నిజ నిర్ధారణ నివేదిక పంపాలని అటవీ శాఖ అధికారులను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఆదేశించింది. ఇప్పటికే ఉన్న కోర్టు తీర్పులను పరిగణంలోకి తీసుకోని ముందుకు వెళ్లాలని సూచించింది. అటవీ చట్టానికి లోబడి వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపింది. వాస్తవాధార నివేదికతో పాటు సంబంధిత శాఖ తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని సూచించింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జి.నగేశ్, రఘునందన్ రావు మంగళవారం దిల్లీలో కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ ను కలిశారు. హెచ్సీయూ భూముల విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్రమంత్రికి వినతిపత్రం అందజేశారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలు పర్యావరణ, హెరిటేజ్ భూములని తెలిపారు. హైదరాబాద్ పర్యావరణ పరిరక్షణ సమతుల్యతకు ఈ భూములు ఎంతో ప్రయోజనకరం కాబట్టి అనేక రకాల ఔషధ మొక్కలు, వివిధ పక్షి జాతులతో ఆ ప్రాంతమంతా అలరారుతున్నదని చెప్పారు.
ఇంతటి విలువైన భూములను రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ గా మార్చి వేల కోట్లు దండుకోవాలని చూస్తుందని బీజేపీ ఎంపీల బృందం ఆరోపించింది.హెచ్సీయూ విద్యార్థులతో పాటు హైదరాబాద్ ప్రజలంతా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్కు తెలిపారు. వెంటనే కంచ గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకుని, ఆ భూములను పరిరక్షించాలని కోరారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. వర్సిటీకి చెందిన 400 ఎకరాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ 400 ఎకరాలు ప్రభుత్వానిదేనని, ఇంచు భూమి కూడా హెచ్సీయూది లేదని మంత్రులు చెబుతున్నారు. కోర్టు కేసుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించిందని చెబుతున్నారు. ఈ భూములను అభివృద్ధి చేస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ అనుబంధ విద్యాసంఘాలతో ఆందోళన చేయిస్తున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంది. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ప్రభుత్వ భూమిని కాపాడి, అభివృద్ధి చేస్తుంటే రాజకీయ దురుద్దేశంతో అడ్డుకుంటున్నారని మండిపడుతోంది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ భూముల వ్యవహారాన్ని నిరసిస్తూ విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. 400 ఎకరాల భూవేలాన్ని తక్షణమే నిలిపివేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే తరగతులను బహిష్కరించిన విద్యార్థులు… బుధవారం విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ ఆడిటోరియం నుంచి ఈస్ట్ క్యాంపస్ వరకు ర్యాలీ చేపట్టారు. ఓవైపు విద్యార్థుల భారీ ర్యాలీ ఉండగా… మరోవైపు పోలీసులు భారీ స్థాయిలో మోహరించారు. ఈ క్రమంలో క్యాంపస్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో పరిస్థితి గందరగోళంగా మారింది.
సంబంధిత కథనం