కశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన మృతులకు నివాళులర్పిస్తూ హైదరాబాద్ లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్ చౌరస్తా వరకు నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టితో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
భారత్ సమ్మిట్ కు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులు కూడా ఈ కొవ్వొత్తుల ర్యాలీలో భాగస్వామ్యం అయ్యారు. ఉగ్రమూకల దాడులను ఖండించారుయ మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ నివాళులర్పించారు.
ఈ ర్యాలీ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఉగ్రవాదుల పాశవిక దాడులను ఖండిస్తున్నామని చెప్పారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు. రాజకీయాలకు అతీతంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
“ఉగ్రవాదంపై భారత ప్రభుత్వం చేపట్టే ప్రతీ చర్యకు మద్దతు పలికేందుకు అందరం సిద్ధంగా ఉన్నాం. అందరం ఏకమై తీవ్రవాదాన్ని అంతమొందించి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. ఉగ్రవాద దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం సానుభూతి తెలుపుతోంది. ఆ కుటుంబాలకు అందరం అండగా నిలబడి మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
“ఈ భావోద్వేగ సమయంలో 140 కోట్ల మంది భారత ప్రజలంతా ఒక్కటిగా నిలబడాలి. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి. ఇది రాజకీయాలకు అతీతంగా ఐకమత్యం చాటుకోవాల్సిన సందర్భం. దాడికి బాధ్యులైన వారిని ఉపేక్షించకూడదు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో భారత ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము” అని సీఎం రేవంత్ తెలిపారు.
“1967, 1971 లో ఇలాంటి దాడులు జరిగినపుడు ఇందిరాగాంధీ గట్టి జవాబు ఇచ్చారు. ఒక్క దెబ్బతో పాకిస్తాన్ ను పాకిస్తాన్, బంగ్లాదేశ్ అని రెండు ముక్కలు చేశారు. ఆ సందర్భంలో ఇందిరాగాంధీని వాజ్ పేయ్ దుర్గామాతతో పోల్చారు. ప్రధాని మోడీ గారు మీరు దుర్గామాత భక్తులుగా ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకోండి. ఉగ్రమూకలకు గట్టి జవాబు ఇవ్వాలి. కోట్లాది భారతీయులంతా మీకు మద్దతుగా ఉంటారు… ఒక్క దెబ్బతో పాకిస్థాన్ ను రెండు ముక్కలు చేయండి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో కలపండి” అంటూ సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.
సంబంధిత కథనం