TSPSC OMR Swallowing : టీఎస్పీఎస్సీ పరీక్షలో ఓఎంఆర్ షీట్ మింగేసిన అభ్యర్థి.. కారణం ఇదే ?-candidate swallows omr sheet in tspsc divisional accounts officer exam in nizamabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Omr Swallowing : టీఎస్పీఎస్సీ పరీక్షలో ఓఎంఆర్ షీట్ మింగేసిన అభ్యర్థి.. కారణం ఇదే ?

TSPSC OMR Swallowing : టీఎస్పీఎస్సీ పరీక్షలో ఓఎంఆర్ షీట్ మింగేసిన అభ్యర్థి.. కారణం ఇదే ?

HT Telugu Desk HT Telugu

TSPSC OMR Swallowing : టీఎస్పీఎస్సీ నిర్వహించిన డీఏవో పరీక్షలో.. అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్ లోని ఓ పరీక్ష కేంద్రంలో అభ్యర్థి ఓఎంఆర్ షీట్ ని మింగేశాడు. పరీక్షకు హాజరుకాని అభ్యర్థి ఆన్సర్ షీట్ తీసుకొని ఎగ్జామ్ పూర్తి చేశాడు. సీసీ కెమెరాల ద్వారా ఈ విషయాన్ని గుర్తించారు. అభ్యర్థిపై చీటింగ్ కేసు నమోదు చేశారు.

ఓఎంఆర్ షీట్ మింగేసిన అభ్యర్థి

TSPSC OMR Swallowing : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఆదివారం (ఫిబ్రవరి 26న) నిర్వహించిన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (Divisional Accounts Officer) పరీక్షలో.. ఎవరూ ఊహించని అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఎగ్జామ్ కు హాజరైన ఓ అభ్యర్థి పొరపాటున అందులో వివరాలు తప్పుగా నమోదు చేశాడు. ఆ తర్వాత తప్పుని గుర్తించిన అతడు.... తప్పు డీటెయిల్స్ ఎంటర్ చేసిన ఓఎంఆర్ షీట్ ని మింగేశాడు. పక్కనే మరో టేబుల్ పై .. పరీక్షకు హాజరుకాని అభ్యర్థి ఓఎంఆర్ షీట్ తీసుకొని.. ఎగ్జామ్ పూర్తి చేశాడు. పరీక్ష సమయం ముగిసిన తర్వాత... అందరి ఆన్సర్ షీట్లు సేకరించిన ఇన్విజిలేటర్... ఓఎంఆర్ షీట్లను లెక్కించగా.. ఒకటి తక్కువైంది. దీనిపై అభ్యర్థులను ఆరా తీసినా.. విషయం తేలలేదు. దీంతో.. పరీక్ష కేంద్రం సిబ్బంది సీసీ కెమెరాలను పరిశీలించగా... ఓ అభ్యర్థి ఓఎంఆర్ షీట్ ను మింగేసినట్టుగా గుర్తించారు. దీంతో... ఆ అభ్యర్థిపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.

చించి నమిలేశాడు..

ఎగ్జామ్ సెంటర్ నిర్వాహకులు, పోలీసులు, టీఎస్పీఎస్సీ సిబ్బందినే అవాక్కయ్యేలా చేసిన ఈ ఘటన... నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... సహకార శాఖలో క్లర్క్ గా పనిచేస్తున్న అబ్దుల్ ముఖీద్.. టీఎస్పీఎస్సీ ఆదివారం నిర్వహించిన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్షకు హాజరయ్యాడు. బోర్గాం జడ్పీ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో ఎగ్జామ్ రాసేందుకు వచ్చాడు. తనకు కేటాయించిన ఓఎంఆర్ షీట్ లో వివరాలు నమోదు చేశాడు. అయితే అందులో తప్పులుదొర్లడంతో.. ఆ విషయాన్ని గుర్తించిన ముఖీద్.. దానిని చించి నమిలేశాడు. అక్కడే గైర్హాజరైన మరో అభ్యర్థికి సంబంధించిన ఓఎంఆర్ షీట్ ఉండటాన్ని గమనించి... దానిని తీసుకొని జవాబులు రాసేశాడు. పరీక్ష పూర్తి చేసి ఏమీ తెలియనట్లు కూర్చున్నాడు. సమయం ముగిశాక... అందరి ఆన్సర్ షీట్లు సేకరించిన ఇన్విజిలేటర్... ఓఎంఆర్ షీట్లను లెక్కించగా.. ఒకటి తక్కువైంది. దీంతో... తరగతి గదిలోని సీసీ కెమెరాలను పరిశీలించిన సిబ్బంది.. అబ్దుల్ ముఖీద్ తన ఓఎంఆర్ షీట్ ను మింగేసినట్టు గుర్తించారు. పోలీసులకి సమాచారం అందించారు. పోలీసులు... ముఖీద్ పై మాల్ ప్రాక్టీస్, చీటింగ్ కేసులు నమోదు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 241 కేంద్రాల్లో పరీక్ష

53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆదివారం (ఫిబ్రవరి 26న) రాష్ట్రవ్యాప్తంగా 7 జిల్లాల పరిధిలో 241 కేంద్రాల్లో రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించింది. 1,06253 మంది ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోగా... 98,854 మంది అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. ఉదయం నిర్వహించిన పేపర్ 1 పరీక్షకి 67,830 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన పేపర్ 2 పరీక్షకు.. 66,903 హాజరయ్యారు. ఇద్దరు అభ్యర్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు బుక్ చేశారు. ఇందులో హైదరాబాద్ పరిధిలో సెల్ ఫోన్ తో ఎగ్జామ్ హాల్ లోకి వచ్చిన వారు ఒకరు కాగా... రెండో వ్యక్తి... నిజామాబాద్ లో పట్టుబడ్డ అబ్దుల్ ముఖీద్.