Opinion: తెలంగాణలో బీజేపీకి అధికారం సాధ్యమా? ఆ పార్టీ పనితీరు ఎలా ఉంది?-can bjp come to power in telangana know the performance of that party and its leaders ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Can Bjp Come To Power In Telangana Know The Performance Of That Party And Its Leaders

Opinion: తెలంగాణలో బీజేపీకి అధికారం సాధ్యమా? ఆ పార్టీ పనితీరు ఎలా ఉంది?

HT Telugu Desk HT Telugu
Jan 30, 2023 02:41 PM IST

‘భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేస్తున్నామని పగటి కలలుకంటూ క్షేత్రస్థాయిలో వాస్తవికతను పట్టించుకోవడంలేదనిపిస్తోంది..’ - పీపుల్స్ పల్స్ పొలిటికల్ అనలిస్ట్ ఐవీ మురళీ కృష్ణ శర్మ విశ్లేషణ.

ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర సభలో జేపీ నడ్డా, బండి సంజయ్, ఈటల రాజేందర్
ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర సభలో జేపీ నడ్డా, బండి సంజయ్, ఈటల రాజేందర్ (PTI)

బీజేపీ అధిష్ఠానం రాష్ట్రంలో విడతలవారీగా అంతర్గత సర్వేలు నిర్వహిస్తూ రాష్ట్ర నాయకులను అప్రమత్తం చేస్తూన్నా ఇక్కడి లీడర్లు మాత్రం పగటి కలలతో ఊహాలోకంలో ఉంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన పార్టీ ముఖ్య నేత బి.ఎల్‌.సంతోష్‌ 30 సీట్లు సరిపోవని అధికారం లక్ష్యంగా పనిచేయాలని పిలుపునివ్వడం వారికి అందిన నివేదికల సారాంశమే. ఇండియా టుడే - సీ ఓటర్‌ తాజాగా నిర్వహించిన ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ సర్వేలో కూడా ఇదే విషయం తేటతెల్లమయ్యింది. ఈ సంస్థ ఆరు నెలల క్రితం నిర్వహించిన సర్వేలో కూడా రాష్ట్రంలో బీజేపీకి ఆరు ఎంపీ సీట్లు వస్తాయని ప్రకటించగా తాజాగా కూడా ఆరు స్థానాలే వస్తాయని తెలపడం ఆ పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అనే చందంగా ఉందని చెప్పవచ్చు. వీటినన్నింటినీ పరిగణలోకి తీసుకొనే ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన పార్టీ కీలక నేత బన్సల్‌ రాజకీయ పార్టీ ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం కాదని, మనమూ కాలానుగుణంగా రాజకీయాలు చేయాలని సుతిమెత్తంగా రాష్ట్ర నేతలను హెచ్చరించారు. ముస్లింలు పార్టీకి చేరువయ్యేలా చర్యలు చేపట్టాలని, సినిమాలు వంటి సున్నితమైన వాటికి దూరంగా ఉండాలని స్వయాన ప్రధాని మోదీ పిలుపినిచ్చినా రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం ఇవేమి మాకు పట్టవన్నట్టు తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు చేస్తూండడంతో రాష్ట్రంలో పార్టీ అన్ని వర్గాలకు చేరువవడం లేదు.

ట్రెండింగ్ వార్తలు

రాష్ట్రంలోని 119 అసెంబీ నియోజకవర్గాల్లో దాదాపు సగానికి పైగా సెగ్మంట్లలో బీజేపీకి అభ్యర్థులే లేరనే విషయం బహిరంగ రహస్యమే. రాష్ట్రంలో అభ్యర్థుల కొరతను గుర్తించిన ఢిల్లీ నేతలు ప్రత్యేకంగా ఒక చేరికల కమిటీని ఏర్పాటు చేయడం రాష్ట్రంలో ఆ పార్టీ దుస్థితిని తెలియజేస్తుంది. బీజేపీ సుమారు 30 స్థానాల్లో పోటీ ఇవ్వగలిగే స్థితిలో ఉన్నా ఆ స్థానాల్లో వర్గపోరుతో నష్టం చేకూర్చుకుంటున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడం సంగతి దేవుడెరుగు పార్టీలో మాత్రం కాబోయే సీఎం అంటూ అగ్రనేతల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు చూస్తుంటే చిన్నపిల్లల మ్యూజిక్‌ చైర్స్‌ ఆట గుర్తుకొస్తుంది. జాతీయ పార్టీ అయిన బీజేపీలో ఢిల్లీ పెద్దల కనుసన్నుల్లోనే నాయకత్వం ఎంపిక ఉంటుంది. అన్నీ తెలిసి కూడా స్థానిక అగ్ర నాయకులు ఎవరికి వారే సొంత సోషల్‌ మీడియాలో ప్రచారం చేసుకుంటూ రాష్ట్రంలో వర్గ పోరును తారాస్థాయికి తీసుకెళ్తున్నారు. అధికారం రాకముందే రాష్ట్ర బీజేపీలో కాంగ్రెస్‌ సంస్కృతి వచ్చింది.

దక్షిణ భారతంపై ప్రత్యేక దృష్టి

ఉత్తర భారతదేశంలో బీజేపీ సాచ్యురేషన్‌కు చేరింది. అందుకే, ఇప్పుడు దక్షిణభారత దేశం వైపు ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా గతేడాది జూలైలో జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించారు. రాష్ట్ర బీజేపీ ‘సాలు దొర సెలవు దొర’ అంటూ కౌంట్‌ డౌన్‌ నినాదం కూడా మొదలుపెట్టింది. ఇది రెండక్షరాల మాటే కానీ తెలంగాణ చరిత్రలో ఒక ఫ్యూడల్‌ వారసత్వాన్ని, కుల ఆధిపత్యాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రజలకు దూరంగా పాలకుడిని నిలబెట్టే వ్యూహం కూడా ఇందులో ఉంది. కానీ, ఈ వ్యూహాన్ని అర్థం చేసుకోకుండా, ఆ స్ఫూర్తిని కొనసాగించడంలో బీజేపీ విఫలమయ్యింది.

అగ్రనేతలు నరేంద్రమోదీతో, అమిత్‌ షాతో, జేపీ నడ్డాతో బహిరంగ సభలు పెడుతున్నామని షెడ్యూళ్లు ప్రకటించి హడావుడి చేయడం రాష్ట్ర బీజేపీ నాయకులకు ఒక అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు 15 రోజులకు ఒకసారి విస్తృత కార్యక్రమం, 11 వేల కార్నర్‌ సమావేశాలు, ప్రధాని పర్యటనలు అంటూ నిత్యం ప్రచారం చేస్తున్నారు. తర్వాత అవి కారణాలు లేకుండానే వాయిదాలు పడుతున్నాయి. లక్షలాది మందితో సభలు సమావేశాలు నిర్వహిస్తున్నట్టు బీజేపీ చెబుతున్నా వారి లెక్కలకు వాస్తవికత లెక్కలు సరితూగడం లేదు.మోదీ వచ్చినా, అమిత్‌ షా వచ్చినా ఇంకోవరో దిగినా... కేసీఆర్‌ కుటుంబ పాలన గురించి మాట్టాడడం తప్పా తెలంగాణకు వారు ఏం చేద్దామనుకుంటున్నారో ఎప్పుడూ చెప్పడం లేదు. బీఆర్‌ఎస్‌లో మంత్రులు మొదలుకొని కార్యకర్తల వరకు పత్రికల్లో, సోషల్‌ మీడియాలో కేంద్రం రాష్ట్రంపై వివక్ష చూపుతుందని లెక్కలతో సహా విమర్శలు చేస్తున్నా అదే స్థాయిలో ఆ సవాళ్లను తిప్పికొట్టడంలో రాష్ట్ర బీజేపీ విఫలమవుతోంది.

ఎవరు ఖర్చు చేసినా అది ప్రజా సొమ్మే. ఏయే రంగంలో ఎంత ఖర్చు చేశారు..? భవిష్యత్తులో వేటికి ఎంత ఖర్చు పెట్టబోతున్నారు..? ప్రత్యేకంగా తెలంగాణ కోసం పార్టీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది వంటి సందేహాలను నివృత్తి చేయలేపోతున్నారు. క్షేత్ర స్థాయి పరిస్థితులు ఏంటో రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వానికి చెప్పకుండా... ఇక్కడ పవర్‌లోకి వచ్చేస్తున్నామని పవర్‌ పాయింట్‌ ప్రజేంటేషన్స్‌ ఇచ్చేస్తున్నట్టున్నారు! రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఢిల్లీ పెద్దలు పార్టీ జాతీయ స్థాయిలో, కేంద్ర మంత్రి వర్గంలో రాష్ట్ర నాయకత్వానికి ప్రాధాన్యత ఇస్తున్నా వారు ఆశించిన మేరకు కృషి చేయకుండా ఎవరికి వారు తమకు అనుకూలంగా మీడియాలో లీకులిచ్చుకుంటున్నారు. బీజేపీలో చేరిన రాజగోపాల్‌ రెడ్డి తన గెలుపును పార్టీకి గిఫ్ట్‌ గా ఇస్తానని ప్రకటించారు. కానీ, బీజేపీ నాయకులు కలిసి కట్టుగా పనిచేయకపోవడం, అతి విశ్వాసం వల్ల ఓటమిని మూటగట్టుకున్నారు. తెలంగాణలో మొదటి నుండి సంస్థాగతంగా బలంగా లేని బీజేపీ పశ్చిమబెంగాల్‌, అస్సాం, త్రిపుల రాష్ట్రాల్లో చేసిన ప్రయోగాలను ఇక్కడ కూడా చేయాలని చూస్తున్నా ఇక్కడ వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ప్రత్యేక సంస్కృతి కలిగిన తెలంగాణను ఇతర రాష్ట్రాలతో పోల్చి చూడవద్దని అర్థం చేసుకోకుండా, గుణపాఠాలు నేర్చుకోకుండా ఫెయిల్‌ అయిన వ్యూహాల్నే ఆ పార్టీ మళ్లీ మళ్లీ అమలు చేస్తుండటం హాస్యాస్పదం!

2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున గోషామహల్‌లో రాజాసింగ్‌ ఒక్కరే గెలిచారు. 103 సీట్లలో డిపాజిట్‌ కోల్పోయింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నాలుగు స్థానాల్లో గెలవడంతో ఆ పార్టీకి రాష్ట్రంపై ఆశలు కలిగాయి. తెలంగాణపై ప్రత్యేక దృష్టిపెడితే అధికారంలోకి రావచ్చనే విశ్వాసం పార్టీ జాతీయ నాయకులకు కలిగింది. తదనుగుణంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఊహించని విధంగా స్థానాలు సాధించడంతో పాటు దుబ్బాక, హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో గెలుపు ఆ పార్టీలో విశ్వాసాన్ని రెట్టింపు చేసింది. అయితే రెండు ఉప ఎన్నికల విజయంలో అభ్యర్థుల వ్యక్తిగత ప్రభావం కూడా ఉండడం, అదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ వర్గపోరుతో బలహీనపడిన విషయాన్ని మరిచిన బీజేపీ ఆ విజయాలను పార్టీ ఖాతాలో వేసుకొని రాష్ట్రంలో పార్టీ బలపడిందనే భావనలో ఉండి, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడాన్ని అటకెక్కించారు. ఇక్కడే బీజేపీ వాపును చూసి బలుపు అనుకుంటుంది. వరుసగా రెండు సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను, అసంతృప్తిని అనుకూలంగా మల్చుకోవడంలో బీజేపీ విఫలమవుతోంది.

ఉమ్మడి నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో ఫలానా అభ్యర్థి గ్యారెంటీగా గెలుస్తాడని బల్లగుద్ది నమ్మకంగా చెప్పే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ రిజర్డ్వ్‌ స్థానాలు 31 ఉండగా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ రెండు కమిటీలను వేసింది. అయితే ఆచరణలో మాత్రం ఆ కమిటీలు ఇప్పటివరకు సమావేశాలు కానీ, నిర్ణయాలు కానీ తీసుకోలేదు. రిజర్డ్వ్‌ స్థానాలలో పట్టుసాధించని పార్టీ అధికారంలోకి ఎలా వస్తుందని భావిస్తున్నారు.

కమలం గ్రూపుల మయం

రాష్ట్రంలో బీజేపీకి ప్రస్తుతం నలుగురు ఎంపీలు ఉన్నారు. ఆ నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల పరధిలో 28 శాసనసభా నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో కనీసం 20 సీట్లు అయినా బీజేపీ గెలవగలదా అనేది సందేహాస్పదమే. ప్రస్తుతమున్న ముగ్గురు బీజేపీకి ఎమ్మెల్యేలు కలిసికట్టుగా ఒక పత్రికా సమావేశం పెట్టింది లేదు, ప్రజా సమస్యలపై పోరాడింది లేదు. బీజేపీ ఎంతోకొంత బలంగా ఉన్న జీహెచ్‌ఎంసీలో ఆ పార్టీకి ఫ్లోర్‌ లీడరే లేరు. వీటన్నింటినీ ఒక్క మాటలో చెప్పాలంటే, బీజేపీ గుర్తు అయిన కమలం పువ్వుకు ఎన్ని రేకులు ఉన్నాయో, ఆ పార్టీలోనూ అన్ని గ్రూపులు ఉన్నాయి.

భారతీయ జనతా పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారు పేరని ఆ పార్టీవారు చెప్పుకుంటారు. ఇప్పుడది ఒకప్పటి మాటగా మిగిలిపోయింది. పార్టీ అగ్రనాయకులను ఎవరైనా కలిసి వారి బాధలు చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా జరిగే చర్చల గురించి మీడియాకు లీక్‌ చేయడం ఎంతవరకు సమంజసమో వారే ఆలోచించుకోవాలి. పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వం ఇప్పటివరకు ఎంతమంది జిల్లా అధ్యక్షులతో ఏకాంతంగా సమావేశమై ఆ జిల్లాల్లో పరిస్థితిపై సమీక్షించారు? కొంతమంది పార్టీలో చేరుతారని వార్తలొస్తున్నా వారు వెనకడుగు వేయడానికి కారణమేంటి..? పార్టీలో చేరిన వారు తిరిగి వెళ్లిపోవడానికి కారణాలేంటి అని ఎప్పుడైనా సమీక్షించారా? ఒకవేళ వీటిపై సమీక్షలు చేసుంటే ఇప్పటికే ఫలితాలుండేవి. పార్టీలో కోవర్టులున్నారని ఇటీవల ఒక కీలక నేత ప్రకటించడం ఆ పార్టీలో క్రమశిక్షణ ఏ స్థాయిలో ఉందనేది తెలస్తుంది.

అంతకుమించి…

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చాటింపు వేసుకుంటున్న సంక్షేమ పథకాలను మించిన పథకాలు దక్షిణాది రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో అమలులో ఉన్నాయి. బీజేపీ తీసుకొచ్చిన ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ఉత్తరాదిన కొత్తేమోగానీ, దానికి మూలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌.రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఆరోగ్య శ్రీ. అది ఎప్పటి నుంచో ఇక్కడ ఆధరణ పొందింది. మోదీ ఇస్తున్న కిసాన్‌ సమ్మాన్‌ నిధికి మూలం కూడా కేసీఆర్‌ అమలు చేస్తున్న రైతు బంధు. చదువుకునే పిల్లలకు, విద్యార్థులకు, ఆడపిల్లలకు అమలు చేస్తున్న పథకాలు, రైతులకు ఉచిత విద్యుత్‌ లాంటివన్నీ తెలంగాణాలో ఎప్పటి నుంచో ఉన్నాయి. వీటిని మించి తెలంగాణలో కులాల వారీగా అనేక పథకాలు అమల్లో ఉన్నాయి. ఇన్ని పథకాలు ఏదో ఒక రూపంలో అమలవుతున్న చోట బీఆర్‌ఎస్‌ ను ఓడించడం బీజేపీకి అంత సులభం కాదు. ఇప్పటికీ బీఆర్‌ఎస్‌ బలమైన పునాది మీద ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ దగ్గర ఇప్పటివరకూ బీఆర్‌ఎస్‌ని ఢీ కొట్టగలిగే ప్రత్యేకమైన నూతన హామీ ఒక్కటి కూడా లేదు.

బీఆర్‌ఎస్‌ హామీ ఇచ్చి పూర్తి స్థాయిలో నెరవేర్చలేకపోయిన డబుల్‌ బెడ్రూం ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి, బీసీ లోన్లు, రైతులకు రుణమాఫీ వంటి హామీలను తాము నెరవేరుస్తామనే భరోసాని బీజేపీ ఇవ్వలేపోతోంది. రైతుబంధు, కళ్యాణలక్ష్మీ, ఆసరా, దళితబంధు వంటి అనేక పథకాలకు ప్రత్యామ్నాయంగా తామేం ఇవ్వగలమో కూడా చెప్పలేకపోతోంది. ప్రజాసంగ్రామ యాత్ర పేరిట విడతల వారిగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్‌ బీజేపీని గెలిపిస్తే ప్రజలకు ఏం చేస్తామనే కచ్చితమైన సందేశం మాత్రం ఇవ్వలేకపోయారు. మొదటి విడత పాదయాత్ర ముగింపు సభలో ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామన్నారు. కానీ, ఆ హామీని ఎలా అమలు చేస్తారో మాత్రం చెప్పలేదు. ఒక పథకం, ప్రణాళికా లేకుండా ఎంతసేపూ అధికార పక్షంపై దూషణలతో బీజేపీ నాయకులు కాలం గడుపుతున్నారు. ప్రాంతీయపార్టీ నుండి జాతీయపార్టీగా ప్రకటించుకున్న బీఆర్‌ఎస్‌ ఏమీవ్వగలనో చెప్తున్నప్పుడు, జాతీయ పార్టీ బీజేపీ ఏమీ చెప్పలేకపోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారు.

సిద్ధాంతాలు, నీతులు చెప్తే తెలంగాణలో రాజకీయాలు చేయలేరు. పార్టీ అభ్యర్థులకు మంచిపేరు, పలుకుబడితో పాటు ఆర్థికంగా కూడా బలం ఉండాలి. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ఇక్కడ వామపక్ష భావజాలం తాలుకూ ప్రభావం అధికంగా ఉండటం వల్ల, ఉత్తరాదిలో పని చేసినట్లు ఇక్కడ మతం పని చేయదని బీజేపీ గ్రహించాలి. రాష్ట్రంలో 10% మించి ముస్లిం ఓటర్లు ఉన్న నియోజకవర్గాలు 59 ఉన్నాయి. 20% మించిన నియోజకవర్గాలు 16, సుమారు 30% ఉన్న నియోజకవర్గాలు ఐదున్నాయి. 50% కంటే అధికంగా ఉన్న ముస్లిం ఓటర్లు ఉన్న నియోజకవర్గాలు ఏడున్నాయి. ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గాల్లో తెలంగాణ బీజేపీకి ఏ వ్యూహం లేదు. ముస్లింలు ఏకపక్షంగా ఒక పార్టీకి మొగ్గు చూపినట్లు హిందువులు బీజేపీవైపు మొగ్గు చూపరు. బెంగాల్‌లో ఇది నిరూపితమయ్యింది. బెంగాల్‌లో బీజేపీ హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్లడంతో అక్కడి ముస్లింలంతా ఏకపక్షంగా టీఎంసీకి మద్దతిచ్చారు. టీఎంసీ బలానికి ముస్లింలు తోడవడంతో ఆ పార్టీ అధికారం చేపట్టింది. బండి సంజయ్‌ కూడా ఎప్పుడూ హిందుత్వ కామెంట్స్‌ చేస్తూ, బెంగాల్‌ పరిస్థితులనే ఇక్కడా కల్పించే ప్రయత్నం చేస్తుండంతో ఇక్కడ కూడా బీఆర్‌ఎస్‌కు అలాంటి ప్రయోజనమే కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ప్రస్తుతం తెలంగాణలో ఉన్న బూత్‌ కమిటీలతో ఎలాంటి ప్రయోజనాలు ఉండడం లేదు. ఇటీవల జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన బూత్‌ కమిటీ సమావేశాలు అట్టర్‌ ప్లాప్‌ అయ్యాయి. ప్రతి నియోజకవర్గంలో 3,000 సభ్యులు పాల్గొనాల్సిన ఈ సమావేశాల్లో 300కు మించి పాల్గొనలేదు. కొన్ని టీవీల్లో చూపించినట్టు, పేపర్లలో రాసినట్టేం క్షేత్రస్థాయిల్లో జరగలేదు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటివరకూ బలమైన నాయకులు లేరు. ఎవరూ పోటీ చేస్తారని అడిగితే, కార్యకర్తలు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొన్నది. అధికారమే లక్ష్యంగా అని పెద్ద పెద్ద మాటలతో పేరుకు ప్రతి నియోజకవర్గానికి పాలక్‌, ప్రభారీలను నియమించారు. పాలక్‌లు నెలలో మూడు నాలుగు రోజులు వారికి కేటాయించిన నియోజకవర్గంలో ఉండి పని చేయాలి. ప్రభారీలు పది రోజులు పని చేయాలని అధిష్టానం ఆదేశించింది. కానీ వీరెవరూ పనిచేయడం లేదు. ఆయా నియోజకవర్గాలకు వెళ్లడం ఫొటోలు తీసుకొని వాట్సాప్‌ గ్రూపుల్లో ఫార్వర్డ్‌ చేసుకొని, ఓహో మస్తు చేశామంటూ డబ్బా కొట్టుకుంటున్నారు. బీజేపీ అనుబంధ సంఘాల్లో యువ మోర్చ తప్ప ఏ సంఘం పనితీరు బాగలేదు. 85 శాతం జిల్లా పార్టీ కమిటీలు, మోర్చాల పనితీరు దారుణంగా ఉంది. పాలక్‌ లు, ప్రభారీలు, సంఘాలు, కమిటీలు అన్ని పేపర్‌ కే పరిమితమయ్యాయి.

తెలంగాణలో కాంగ్రెస్‌ బలపడితే బీజేపీకి ఇబ్బంది. కాబట్టి, మొదటి నుంచి తెలంగాణలో బీఆర్‌ఎస్‌ విషయంలో బీజేపీ జాతీయ నాయకత్వం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తూ వస్తోంది. ఎన్నికల్లో ఏదైనా తేడా వస్తే, తర్వాతైనా బీఆర్‌ఎస్‌ తమకే మద్దతు ఇస్తుందన్న నమ్మకంతో బీజేపీ ఉంది. అందుకే బీఆర్‌ఎస్‌ని చాలెంజ్‌ చేసే స్థాయిలో బీజేపీ రాజకీయం చేయడం లేదన్న అనుమానం తెలంగాణ ప్రజల మనసులో ఉంది. ఆ అనుమానాన్ని తుంచేయడంలో రాష్ట్ర బీజేపీ దారుణంగా చతికిలపడింది. మితిమీరిన ఆత్మ విశ్వాసం వల్లే మునుగోడు, నాగార్జునసాగర్‌, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. వ్యూహాలు లేవు, లక్ష్యం లేదు, అగ్రనాయకుల మధ్య సఖ్యత లేదు, అనుబంధ సంఘాల మధ్య సమన్వయం లేదు, కమిటీలు లేవు, అభ్యర్థులు లేరు. అయినా సరే, బీజేపీ తెలంగాణ శాఖ కళ్లకు కట్టుకున్న గంతలు తీసేయకుండా, వాస్తవాలను అర్థం చేసుకుకోకుండా గుడ్డెద్దు చేనులో పడినట్లు వ్యవహరిస్తే, వచ్చే ఎన్నికల్లో వారి అధికార స్వప్నం చెదరడం ఖాయం!

- ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,

పొలిటికల్ అనలిస్ట్, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ

(ఒపినియన్ కాలమ్‌లో వెలిబుచ్చే అభిప్రాయాలు వ్యాసకర్తలు, ఆయా సంస్థలవే. హిందుస్తాన్ టైమ్స్‌వి కావు..)

పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ ప్రతినిధి ఐవీ మురళీకృష్ణ శర్మ
పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ ప్రతినిధి ఐవీ మురళీకృష్ణ శర్మ
IPL_Entry_Point