Bye Bye Modi Posters in Hyd : నగరంలో బై బై మోదీ పోస్టర్లు, ఫ్లెక్సీలు - ఆ నేతల ఫొటోలతో సెటైర్లు!
Bye Bye Modi Posters in Hyderabad: హైదరాబాద్ నగరంలో బై బై మోదీ పోస్టర్లు దర్శనమిచ్చాయి. బీజేపీలో చేరకముందు.. చేరిన తర్వాత అంటూ పలువురి ఫొటోలను కూడా ఇందులో చేర్చారు.
Bye Bye Modi Posters Hyd City: లిక్కర్ స్కామ్ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. ఢిల్లీ వేదికగా ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించనుంది. ఇదే విషయంలో బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తోంది బీఆర్ఎస్. ప్రతిపక్షాలను దర్యాప్తు సంస్థలతో వేధిస్తోందని మండిపడుతోంది. ఓవైపు ఇదిలా ఉండగా... హైదరాబాద్ నగరంలో మోదీ వ్యతిరేక పోస్టర్లు దర్శనమిచ్చాయి. బైబై మోదీ అంటూ పలువురి నేతల ఫొటోలను కూడా ప్రచురించారు.
ట్రెండింగ్ వార్తలు
బీజేపీలో చేరకముందు.. చేరిన తర్వాత అంటూ సెటైరికల్ గా పోస్టర్లు రూపొందించారు. ఇందులో అస్సోం, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ లోని నేతల ఫొటోలు ఉంచారు. వాషింగ్ పౌడర్ నిర్మా అంటూ వచ్చే యాడ్ మాదిరిగా... 'రైడ్' అనే పేరును ప్రస్తావించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు దర్యాప్తు సంస్థల రైడ్స్ అనంతరం.. కాషాయ రంగు అద్దుకుని బీజేపీలో చేరానని సెటైరికల్గా సెట్ చేశారు.
కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా, అస్సొం సీఎం హిమంత బిశ్వశర్మ, ఏపీకి చెందిన సుజనా చౌదరి, బెంగాల్ కు చెందిన నేత సువేంధు అధికారి ఫొటోలు ఇందులో ఉన్నాయి. ఎమ్మెల్సీ కవితకు మాత్రం రైడ్కు ముందు తర్వాత ఎలాంటి మరక అంటకుండా ఉన్నారంటూ అర్థం వచ్చేలా ఫ్లెక్సీలు, పోస్టర్లు, హోర్డింగ్ లు రూపొందించారు. ఈ పోస్టర్లకు బై బై మోదీ.. అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టారు. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే వీటిని ఎవరూ ఏర్పాటు చేశారనేది మాత్రం ఇందులో పేర్కొనలేదు. వీటిని బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలే ఏర్పాటు చేశారంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇవాళ ఉదయం కవిత ఈడీ విచారణకు హాజరుకానున్నారు. మరోవైపు ఢిల్లీలోని కవిత నివాసానికి ముఖ్య నేతలతో పాటు కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు సంస్థల విచారణ ఎదుర్కొన్నారు కవిత. అయితే ఈసారి ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న చర్చ జోరుగా జరుగుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఈ కేసులో అరెస్ట్ అయి నిందితుడిగా ఉన్న హైదరాబాద్ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై విచారణలో స్టేట్ మెంట్ ఇచ్చారు. తాను కవితకు బినామీని అనీ, అంతా ఆమె చెప్పిన ప్రకారమే చేశానని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఇవాళ జరిగే విచారణలో పలు అంశాలపై లోతుగా ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న వారితో కలిపి కవితను ప్రశ్నిస్తారని సమాచారం. అయితే కవితను ఎంతసేపు విచారిస్తారు..? విచారణ సందర్భంగా అరెస్ట్ చేస్తారా..? లేక గతంలో మాదిరిగానే విచారించి పంపిస్తారా..? అన్నది ఆసక్తికరంగా మారింది.
సంబంధిత కథనం