KTR in chennai : భవిష్యత్తు తరాలు మన మౌనాన్ని తప్పకుండా ప్రశ్నిస్తాయి.. చెన్నై సదస్సులో కేటీఆర్
KTR in chennai : కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత డీలిమిటేషన్ వల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయని.. కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ వివక్షపూరిత విధానాల వల్ల దక్షిణాదికి నష్టాలు జరిగాయని స్పష్టం చేశారు. చెన్నైలో జరిగిన డీలిమిటేషన్ సదస్సులో ప్రసంగించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
కేసీఆర్ ఆధ్వర్యంలో 14 సంవత్సరాలపాటు తెలంగాణ ఉద్యమం నడిపించారు.. మెజార్టీ నియంతృత్వం, మందబలం ఉన్నప్పుడు జరిగే నష్టాలు తెలంగాణ ప్రజలకు తెలుసు.. అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఢిల్లీలో ఉన్న మంద బలంతోపాటు, సమైక్య రాష్ట్రంలోని మెజార్టీ నాయకత్వంపైన పోరాటం చేసి.. 14 సంవత్సరాల అనంతరం తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చుకున్నామని వివరించారు. తమిళనాడు ప్రజల నుంచి అనేక అంశాలను స్ఫూర్తిగా తీసుకుంటామన్న కేటీఆర్.. అస్తిత్వం కోసం, హక్కుల కోసం కొట్లాడడంలో తమిళనాడు స్ఫూర్తినిచ్చిందని చెప్పారు. ద్రవిడ ఉద్యమం తమ హక్కులు సాధించుకోవడానికి రాష్ట్రాలకు ఒక దిక్సూచి లెక్క పనిచేస్తుందన్నారు.
నియంతత్వం రావద్దు..
'దేశ అభివృద్ధి కోసం పని చేసినందువలన ఈరోజు నష్టం జరుగుతుంది. మనమంతా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. ప్రజాస్వామ్యం మందబలం ఆధారంగా నడవరాదు. మందబలం ఉన్నందువలన నియంతత్వం రావద్దు. దేశ అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్న రాష్ట్రాలకు నష్టం కలిగిస్తూ.. దేశాన్ని వెనక్కి నడుస్తున్న రాష్ట్రాలకి ఈ డీలిమిటేషన్ విధానం లాభం చేకూరుస్తుంది. పరిపాలన, ఆర్థిక అభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయి. కానీ దానివల్లనే తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
నిధుల్లోనూ నష్టం..
'దేశానికి 36 శాతం జీడీపీలో భాగస్వామ్యం ఉన్న దక్షిణాది రాష్ట్రాలు శిక్షింపబడుతున్నాయి. డీలిమిటేషన్ అంశం కేవలం పార్లమెంట్ ప్రాతినిధ్యం తగ్గడానికి పరిమితం కాదు. ఆర్థికపరమైన నిధుల కేటాయింపుల్లో కూడా తీవ్రమైన నష్టం జరగబోతుంది. వీటి కేటాయింపుల్లో కూడా అధికారం పూర్తిగా కేంద్రీకృతమై.. నియంతృత్వం వైపు దారితీసే అవకాశం ఉన్నది. ఆర్థిక వనరుల కేంద్రీకృతం జరగడం వలన.. భవిష్యత్తులోనూ ప్రస్తుతం ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నిధుల కేటాయింపులు అన్యాయం మరింతగా పెరుగుతుంది' అని కేటీఆర్ వివరించారు.
వివక్ష కొత్త కాదు..
'దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ వివక్ష కొత్త కాదు. కానీ ఈ మధ్యకాలంలో అన్యాయం మరింత పెరిగింది. ప్రస్తుతం బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దీన్ని మరింత పెంచేలా డీలిమిటేషన్ అంశాన్ని ముందుకు తీసుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన బుల్లెట్ రైలు వంటి ప్రాజెక్టులన్ని ఉత్తరాదికే పరిమితం అవ్వడం ఇందుకు ఒక ఉదాహరణ. కేంద్రం ఈ విధంగా దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపైన పుండు మీద కారం చల్లినట్లు వ్యవహరిస్తున్నది. దేశంలో ఒక ప్రాంతం ఇంకో ప్రాంతంపైన ఆధిపత్యం చలాయించే విధంగా ఉండరాదన్నది ప్రజాస్వామ్య స్ఫూర్తి' అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
సమాఖ్య స్ఫూర్తికి విఘాతం..
'ఇది కేవలం ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల వ్యవహారం కాదు.. అభివృద్ధి చెందిన రాష్ట్రాలు, ప్రాంతాలకు నష్టం జరుగుతున్న అంశం. కేవలం జనాభా ఆధారంగా సీట్ల పెరుగుదల జరిగితే.. దేశ సమాఖ్య స్ఫూర్తికి తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉన్నది. మనమంతరం భారతీయులం.. మనందరికీ ఆయా ప్రాంతాల అస్తిత్వం ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దు. విభిన్న భాషలు, సాంస్కృతిక అస్తిత్వాలతో కూడిన ఒక సమైక్య దేశం అన్న విషయాన్ని మర్చిపోకూడదు. వెనుకబడిన రాష్ట్రాలకు నిధులు ఇచ్చే అంశాన్ని మేము ఏమి వ్యతిరేకించడం లేదు. కానీ.. నిధుల కేటాయింపుల వివక్షను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం' అని కేటీఆర్ స్పష్టం చేశారు.
చరిత్ర క్షమించదు..
'1971 తర్వాత ఉన్న పార్లమెంటు సీట్లు కేటాయింపు, ఆ తర్వాత జరిగిన జనాభా నియంత్రణ వలన ఈరోజు దక్షిణాదికి నష్టం జరగడం అన్యాయం. జనాభా నియంత్రణను దేశ అభివృద్ధి కోసం దక్షిణాది రాష్ట్రాలు పాటించాయి. ఉత్తరాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో విఫలమయ్యాయి. వారికి ఈరోజు డీలిమిటేషన్లో లబ్ధి జరగడం ఏ విధంగా కూడా సరైంది కాదు. ఇది దేశాన్ని వెనుక వేసిన వాళ్లకి రివార్డు ఇవ్వడం లాంటిది. ఈ అంశంలో జరుగుతున్న నష్టంపైన మాట్లాడకుంటే చరిత్ర మనల్ని క్షమించదు. భవిష్యత్తు తరాలు మన మౌనాన్ని తప్పకుండా ప్రశ్నిస్తాయి' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
సంబంధిత కథనం