నేడు బీఆర్ఎస్ రజతోత్సవ సభ - కేసీఆర్ స్పీచ్ పై సర్వత్రా ఆసక్తి..!-brs silver jubilee public meting will be held at elkathurthy in warangal today ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  నేడు బీఆర్ఎస్ రజతోత్సవ సభ - కేసీఆర్ స్పీచ్ పై సర్వత్రా ఆసక్తి..!

నేడు బీఆర్ఎస్ రజతోత్సవ సభ - కేసీఆర్ స్పీచ్ పై సర్వత్రా ఆసక్తి..!

నేడు వరంగల్ వేదికగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగనుంది. ఇందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. లక్షలాది మందిని తరలించేలా కార్యాచరణను సిద్ధం చేశారు. మొత్తం 1,213 ఎకరాల్లో రజతోత్సవ సభను నిర్వహించనున్నారు.

నేడు బీఆర్ఎస్ రజతోత్సవ సభ

తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పురుడు పోసుకున్న బీఆర్ఎస్(టీఆర్ఎస్) పార్టీకి 25 సంవత్సరాలు నిండాయి. 2001లో టీఆర్ఎస్ ఏర్పడగా… 14 ఏళ్లపాటు తెలంగాణ రాష్ట్ర సాధనం కోసం పోరాడుతూ వచ్చింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత పదేళ్లపాటు అధికారంలో కొనసాగింది. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంది. అయితే పార్టీ ఏర్పాటై 25 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇవాళ భారీ సభను తలపెట్టింది.

భారీగా ఏర్పాట్లు…

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి వేదికగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగనుంది. ఇందుకోసం బీఆర్ఎస్ పార్టీ ఘనంగా ఏర్పాట్లు చేసింది. మొత్తం 1,213 ఎకరాల్లో రజతోత్సవ సభను నిర్వహించనుంది. అయితే మహాసభ (ప్రధాన వేదిక ) ప్రాంగణాన్ని 154 ఎకరాల్లో సిద్ధం చేసింది. 500 మంది కూర్చునేలా గులాబీ రంగులతో వేదికను తీర్చిదిద్దారు. వేదిక పక్కనే కళాకారుల ఆట-పాట కోసం ప్రత్యేకంగా మరో స్టేజ్ ను ఏర్పాటుచేశారు. ఇక ఎల్కతుర్తికి వచ్చే అన్ని రోడ్డు మార్గాల్లో చెత్తను, ముళ్ళచెట్లను తొలగించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారు. ప్రతి రోడ్డుకు ఇరువైపులా మొరం పోసి చదును చేశారు.

ప్రత్యేక పార్కింగ్, ఎల్‌ఈడీల ఏర్పాటు…

ఇక సభ కోసం రాష్ట్రంలోని నలుమూలల నుంచి దాదాపు 50 వేల వాహనాల వస్తాయని అంచనా వేస్తున్నారు. పార్కింగ్‌ కోసం 1,059 ఎకరాలను కేటాయించారు. వీఐపీ వాహనాల కోసం సభావేదిక ఎడమ భాగం, వెనుక భాగంలో పార్కింగ్‌ను ఏర్పాటుచేశారు.

సభకు వచ్చే ప్రజల కోసం లక్షకు పైగా కుర్చీలను ఏర్పాటు వేశారు. మహిళల కోసం ప్రత్యేక కుర్చీలు వేసి బారికేడ్లు పెట్టారు. లైట్లు, ఎల్‌ఈడీల కోసం 200 భారీ జనరేటర్లను ఏర్పాటుచేశారు. పార్టీ అధినేత కేసీఆర్‌ అందరికీ స్పష్టంగా కనిపించేలా 20/50 సైజుతో కూడిన 23 ఎల్‌ఈడీ భారీ స్క్రీన్లు, భారీ సౌండ్‌ సిస్టంను చుట్టుపక్కల ఏర్పాటుచేశారు.

చాలా రోజుల తర్వాత కేసీఆర్ బహిరంగ సభ వేదిక నుంచి ప్రసంగించనున్నారు. దీంతో ఆయన స్పీచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ పాలనపై ఏ విధంగా స్పందిస్తారు…? పార్టీ నేతలు, శ్రేణులకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారనేది టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది.

బీఆర్ఎస్ రజతోత్సవ సభ - ముఖ్య అంశాలు:

  • మొత్తం 1,213 ఎకరాల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లు
  • 154 ఎకరాల్లో మహాసభ(సభా వేదిక) ప్రాంగణం
  • 500 మంది కూర్చునేలా ప్రధాన వేదికపై ఏర్పాట్లు ఉంటాయి.
  • 1,059 ఎకరాల్లో పార్కింగ్‌ ఏర్పాట్లు చేశారు.
  • సభ కోసం వచ్చే వారి కోసం 10 లక్షల వాటర్‌ బాటిళ్లు అందుబాటులో ఉంచారు. 16 లక్షల మజ్జిగ ప్యాకెట్లు ఉంటాయి.
  • వివిధ రూట్లలో 6 అంబులెన్స్‌లు ఉంటాయి. పరిసరాల్లో 12 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు.
  • 1,200 తాత్కాలిక మరుగు దొడ్లు ఏర్పాటు చేయగా… పార్కింగ్‌ నిర్వహణకు 2,000 మంది వాలంటీర్లు అందుబాటులో ఉంటారు.

హెల్ప్‌లైన్ నంబర్ :

బీఆర్ఎస్ సభకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. సభ వేదిక, పార్కింగ్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను అనుసంధానించారు.

అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైనా సహాయం అవసరమైతే 9014206465 నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. ట్రాఫిక్ సమస్యలు ఎదురు కాకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి మానిటర్ చేస్తారు. ట్రాఫిక్‌లో ఎవరైనా చిక్కుకున్న సమాచారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు లేదా హెల్ప్‌లైన్‌కు అందించితే, అక్కడి నుండి తగిన సూచనలు చేస్తారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.