వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతుందని బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు. ఈ సభతో తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ వైపు చూస్తున్నారనే విషయం రుజువైందని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపిందన్నారు. ఎల్కతుర్తిలో రజతోత్సవ వేడుకల్ని కొనసాగింపుగా రాబోయే సంవత్సర కాలం పాటు వివిధ దేశాలలో నిర్వహిస్తామని మహేష్ బిగాల తెలిపారు.
ముందుగా అమెరికాలోని డల్లాస్ నగరంలో డీఆర్ పెప్పర్ అరేనాలో జూన్ 1, 2025 నాడు అట్టహాసంగా బీఆర్ఎస్ రజతోత్సవం నిర్వహిస్తున్నారని మహేష్ బిగాల తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఆహ్వానించామని తెలిపారు. రాబోయే రోజుల్లో యూఎస్ఏతో పాటు వివిధ దేశాలలో నిర్వహిస్తారని అన్నారు.
ఈ కార్యక్రమాలకు కేటీఆర్ తో పాటు ప్రముఖ నాయకులూ హాజరుకానున్నారని అన్నారు. పరాయి పాలనలో ప్రజలకు కష్టం వచ్చిన ప్రతిసారీ గులాబీ జెండా అండగా ఉందని తెలిపారు. ఇప్పుడు కూడా పాలకులు తప్పు చేస్తే గాడిలో పెట్టే బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. ఉద్యమం అన్నది గులాబీ జెండా ఊపిరిలోనే ఉన్నదని ఎల్కతుర్తి సభ మరోసారి రుజువు చేసిందన్నారు.
బీఆర్ఎస్ యూఎస్ఏ అడ్వైజరీ బోర్డు చైర్మన్ తన్నీరు మహేష్ మాట్లాడుతూ... 2001 నుంచి బీఆర్ఎస్ వెంట నడుస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ 25వ వసంతంలోకి అడుగుపెట్టడం తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ప్రజలకు గర్వకారణం అన్నారు. ఈ రజతోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున వైభవంగా జరుపుతామన్నారు.
యూఎస్ఏలో ఉన్నా వివిధ సంఘాలను, తెలంగాణ ఎన్ఆర్ఐ ప్రముఖులను సమన్వయం చేసుకొని పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెలిపారు. అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమానికి ఎన్ఆర్ఐలు హాజరవుతారని అన్నారు. అలాగే పార్టీ 25 ఏండ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకొని తెలంగాణ ఆటపాటలతో కళాకారుల బృందం ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు.
దేశ రాజకీయాల్లో అతిపెద్ద బహిరంగ సభల్లో ఒకటిగా రజోత్సవ వేడుక నిలిచిందని అమెరికాలో కూడా దానికి తీసిపోని విధంగా అట్టహాసంగా నిర్వహిస్తామని తన్నీరు మహేష్ తెలిపారు.
సంబంధిత కథనం