తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ పార్టీలో తెగువ కనిపించేది. తెలంగాణ రాష్ట్ర సాధన వరకూ ‘‘తగ్గేదే లేదు’’ అనే పట్టుదల పార్టీలో కనిపించేది. తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని తప్పులు చేసినా అదే ధైర్యాన్ని కనబరిచింది. అయితే 2023లో అధికారం కోల్పోయిన తర్వాత పార్టీలో మునపటి దూకుడు కనపడటం లేదు. తన మూలాలను విడిచిపెట్టి నేల విడిచి సాము చేస్తున్నట్టు కనపడుతోంది.
దీనికి తోడు ఇటీవల హన్మకొండలో బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ తర్వాత పార్టీలో మూడు ముక్కలాటతో ముసలం మొదలైందనే చర్చ కూడా ప్రారంభమైంది. కానీ, పార్టీలో ఈ ముసలం వెనుక నాలుగో ముక్క కూడా ఉందనేది ఒక వాదన. పార్టీలో ఆధిపత్యం కోసం జరుగుతున్న ఈ మ్యూజికల్ చైర్స్ గేమ్ అడ్డుకోకపోతే, అది బీఆర్ఎస్ మనునగడకే ప్రమాదంగా మారొచ్చు.
కురుక్షేత్ర యుద్ధం కూడా కుటుంబ కలహాలతోనే మొదలైంది. కుటుంబ కలహాలతో ఎన్నో రాచరిక కుటుంబాలు, రాజకీయ కుటుంబాలు పతనమయ్యాయనే చరిత్రలు వేల పుస్తకాలు చదివిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు తెలియంది కాదు!
ఆంధ్రప్రదేశ్లో షర్మిల, విజయమ్మ, వివేకానంద రెడ్డి కూతురు సునీతలు వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం వల్ల ఆ పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర నష్టం జరిగింది. షర్మిల లాభం పొందకపోయినా, జగన్కు నష్టం కలిగించింది.
ఇదే విధంగా కవిత లేదా హరీశ్ బీఆర్ఎస్ను వీడితే వారికి లాభం కలగకపోయినా బీఆర్ఎస్కు మాత్రం నష్టమే జరుగుతుంది. కాబట్టి, కేసీఆర్ చొరవ తీసుకుని పార్టీలో నెలకొన్న మనస్పర్థలు తగ్గించాలి.
బీఆర్ఎస్లో కేటీఆర్, హరీశ్, కవిత మధ్య పోటీ కొత్తగా పుట్టింది కాదు. వారు ముగ్గురూ నిత్యం ఫస్ట్ ర్యాంక్ కోసం పోటీ పడే విద్యార్థుల్లాగే కనిపిస్తుంటారు. ‘ఎక్స్’లో కేటీఆర్కి 46 లక్షలు, హరీశ్ రావ్కు 14 లక్షలు, కవితకు 13 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.
ఈ ముగ్గురూ రోజూ పోటీ పడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పులపై ట్వీట్స్ చేయడమే కాకుండా, వీడియో సందేశం విడుదల చేయడం, మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడంలో బిజీగా ఉంటారు. ఈ ముగ్గురికీ మద్దతుగా పబ్లిక్ రిలేషన్ సిబ్బంది, యూట్యూబ్ చానెల్స్, జర్నలిస్టు సర్కిళ్లు ఉన్నాయి. పార్టీలో నెలకొన్న ఆధిపత్య వాతావరణాన్ని తట్టుకునేలా వీరు ఈ సోషల్ మీడియా వేదికలను విరివిగా వినియోగిస్తున్నారు కానీ, పార్టీ మీద ప్రేమతో చేస్తున్నట్టుగా ఎక్కడా అనిపించదు.
తెలంగాణ ఉద్యమ సమయంలో గానీ, అధికారంలో ఉన్నప్పుడు గానీ వీరి మధ్య విభేదాలున్నట్లు వార్తలున్నా వాటికి బలం చేకూర్చే సంఘటనలేమీ జరగలేదు. అయితే ఇంతకాలం అంతర్గతంగా ఉన్న వీరి మధ్య విభేదాలు ఇటీవల హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన పార్టీ రజతోత్సవ సభతో వీధికెక్కాయి.
తొలుత రజతోత్సవ సభ నిర్వాహణ బాధ్యతలు హరీష్కు అప్పగించి, తర్వాత కేటీఆర్ను తెరమీదకు తెచ్చారు. ఈ బహిరంగ సభ కోసం ఇచ్చిన ప్రకటనల్లో కేవలం కేసీఆర్, కేటీఆర్ ఫొటోలే పెట్టారు. సభా వేదిక మీద కూడా కేసీఆర్, కేటీఆర్ ఫొటోలు మాత్రమే ప్రదర్శించారు.
ఇక రజతోత్సవ సభ తర్వాత కవిత ప్రసంగాల్లో మార్పు కనిపిస్తోంది. ‘భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది. సామాజిక తెలంగాణ రాలేదు’’ అని చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ మీదకు వదిలిన బాణంగా చూడొచ్చు.
రజతోత్సవ సభలో జరిగిన అవమానం కారణంతోనే ఆమె తిరుగుబాటు వ్యాఖ్యాలు చేసిందని అనుకోలేం. ఎప్పటినుంచో ఆమెలో అసంతృప్తి ఉండొచ్చు. బహుశా లిక్కర్ కేసు ఆరోపణలతో జైలులో ఉన్నప్పుడు ఆమెకు మద్దతుగా కేసీఆర్ చురుగ్గా వ్యవహరించలేదనే అసంతృప్తి కవితలో ఉండొచ్చు.
జైలు నుంచి వచ్చాక కవిత సైలెంట్గా ఉంటారనే అభిప్రాయం పార్టీలో కొందరిలో ఉన్నా, ఆమె దానికి భిన్నంగా రెట్టించిన ఉత్సాహంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు. కవిత కేసీఆర్ కూతురుగానే పరిచయం అయినా ఆమె తెలంగాణ ఉద్యమంలో జాగృతి ద్వారా కీలక పాత్ర పోషించారు.
ఈ నేపథ్యంతోనే ఆమె కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చినప్పుడు అందరికంటే ఎక్కువగా పోరాటం చేశారు. అయితే, దీనికి కేసీఆర్ నుంచి, బీఆర్ఎస్ శ్రేణుల నుంచి ఆశించిన మద్దతు లభించలేదు. ఈ విషయంపై పార్టీ స్టాండ్ తెలియక, బీఆర్ఎస్ కార్యకర్తలు గందరగోళానికి గురయ్యారు.
మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీ ‘‘3ఎం ఫార్ములా’’ తో ‘‘మున్నూరుకాపు, ముదిరాజ్, మాదిగ’’ సామాజిక వర్గాలను ఒక్కతాటి పైకి తెస్తూ రాజకీయ వ్యూహాలను రచిస్తోంది. కాంగ్రెస్ మొదటిసారి బీసీ ఓట్ల కోసం రకరకాల వ్యూహాలు రచిస్తోంది. దీనిపై కవిత ఫూలే పేరుతో బీసీలను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటే, సొంత పార్టీ వాళ్లే ఆమెను వెనకకు లాగుతున్నారు.
కవిత కార్యక్రమాలు పెట్టుకున్న సమయంలోనే ఈ మధ్య కేటీఆర్ కూడా ప్రెస్ మీట్స్ పెట్టడం గమనించవచ్చు. ఇవన్నీ కేసీఆర్ ఆదేశాలతోనే జరుగుతున్నాయని ఆమె అనుకుంటూ ఉండొచ్చు.
తాను ఆరోగ్యంగా ఉన్నానని కేసీఆర్ పదేపదే చెప్పినప్పటికీ, వారసత్వం గురించి చర్చ ఎందుకు లేవనెత్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆయన సీఎంగా ఉన్న సమయంలోనూ పార్టీలో ఈ చర్చ అనవసర గందరగోళాన్ని సృష్టించింది. 2023 ఎన్నికల ముందు కేసీఆర్ ఆరోగ్యం గురించి పుకార్లు, ఆయనను బలహీనంగా చిత్రీకరించే ప్రయత్నాల వల్ల వారసత్వ పోరు తెర మీదకు వచ్చింది.
రజతోత్సవ సభ సమయంలో కూడా ఆయన హెలికాఫ్టర్ ఎక్కేటప్పుడు నీరసంగా ఉన్నట్టు చిత్రించే ప్రయత్నం చేశారు. ఈ నాలుగో ముక్కే పార్టీలో కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ మధ్య గోడ కడుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఎన్టీఆర్ 1994లో భారీ విజయం సాధించిన తర్వాత లక్ష్మీ పార్వతి ఆయనను బలహీనంగా చూపిస్తూ పెత్తనం చెలాయించడం వల్లనే టీడీపీలో తిరుగుబాటుకు దారితీసింది. ఇప్పుడు కేసీఆర్ చుట్టూ ఉన్న కొందరు ఆయనను బలహీనంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ పేరు చెప్పుకుని పెత్తనం చేస్తుండటంతో క్యాడర్లో రోజురోజుకు అసంతృప్తి పెరుగుతోంది.
‘‘బీఆర్ఎస్లో కేసీఆర్ తర్వాత ఎవరు?’’ అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. ఎవరేమనుకున్నా, ఎన్ని లెక్కలు వేసినా కేటీఆర్, హరీశ్, కవిత ముగ్గురూ పార్టీకి కవచకుండలాల్లాంటి వారు. కేటీఆర్ మంత్రిగా ఐటీ, పారిశ్రామిక రంగంలో విజయాలు సాధించి బలమైన ఇమేజ్ నిర్మించుకున్నారు. హరీశ్రావు 2001 నుంచి కేసీఆర్ వెన్నంటే ఉంటూ, ఉద్యమ నాయకులకు చేరువై గ్రామీణ స్థాయిలో మాస్ ఫాలోయింగ్ పెంచుకున్నారు.
కవిత బతుకమ్మను ప్రపంచ వ్యాప్తం చేయడంతో పాటు ఉద్యమ కాలంలో తెలంగాణ జాగృతి ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ఎంపీగా ఎన్నికయ్యాక ఢిల్లీలో రాజకీయ పరిచయాలను పెంచుకున్నారు. ఈ ముగ్గురు నేతలకూ జనాకర్షణతో పాటు ప్రసంగాలతో ఆకట్టుకునే సమ్మోహన శక్తి ఉంది. ఒక్కొక్కరిలో ఒక్కో ప్రత్యేకమైన బలం ఉండడంతో ఈ ముగ్గురు ఐక్యంగా ఉంటే, పార్టీకి బలమే. లేకపోతే నష్టమే.
ఈ ముగ్గురి మధ్య కలహాలకు కారణం కేసీఆర్ వ్యవహార తీరే కారణమని చెప్పడానికి అనేక ఉదంతాలున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 88 సీట్లతో ఘన విజయం సాధించడంతో తనకు తిరుగే లేదని కేసీఆర్ భావించారు. తానే సుప్రీం అన్నట్టుగా ఒక్కరే ప్రమాణ స్వీకారం చేశారు. 2001లో పార్టీ స్థాపించిన నాటి నుంచి తన వెన్నంటే ఉన్న మేనల్లుడు, సీనియర్ నాయకుడు హరీశ్ రావును మంత్రివర్గంలోకి తీసుకోలేదు.
ఇదే సమయంలో ఏకపక్షంగా తనయుడు కేటీఆర్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు. ఈ ఘటనలతో ఆయన తన వారసుడిగా కేటీఆర్ను ప్రమోట్ చేయడమే కాకుండా, పార్టీలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్టు స్పష్టంగా బయట పడింది.
కేసీఆర్ ధోరణిని ప్రజలు ఓర్చుకోలేకపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆరు నెలల వ్యవధిలోనే జరిగిన 2019 పార్లమెంట్ ఎన్నికల్లో తమ కోపాన్ని చూపించడంతో బీఆర్ఎస్ ఎంపీ స్థానాలు 11 నుంచి 9కి పడిపోయాయి. అయినా కేసీఆర్ తన ధోరణీని మార్చుకోకుండా తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి, పార్టీలో కీలక నేతగా ఎదిగిన ఈటెల రాజేందర్ను పార్టీ నుంచి గెంటేయడంతో బీఆర్ఎస్పై వ్యతిరేకత పెరిగింది.
కేసీఆర్ ధోరణీతో బీఆర్ఎస్ కంచుకోటలుగా ఉన్న దుబ్బాక, హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమిని మూటగట్టుకుంది. ఎల్కతుర్తి రజతోత్సవ సభ విజయవంతానికి అంతా తానే కారణమని కేటీఆర్ భావిస్తున్నా, అది పార్టీ సమిష్టి కృషి. స్వయానా కేసీఆరే బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కేటీఆర్ గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో పార్టీ ఓటమి, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో అసెంబ్లీ, పార్టమెంట్ ఎన్నికల్లో ఓటమికి ఆయన బాధ్యత వహించాల్సి ఉంటుంది.
బీఆర్ఎస్లో బలమైన నాయకులుగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, జూపల్లి కృష్ణారావు, వేముల వీరేశం వంటి నేతలను కూడా 2023 ఎన్నికలకు ముందు అవమానకరంగా బయటకు పంపడంతో ఆ పరిణామాలు పార్టీకి భారీ నష్టం కలిగించాయి. ‘‘తెలంగాణ తెచ్చిన కాబట్టి, జీవిత కాలం నేనే సీఎం’’ అన్నట్టు కేసీఆర్ వ్యవహరించి, పార్టీలో ప్రజాస్వామ్యం లేకుండా చేశారు.
ఫలితంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లకు పడిపోగా, 2024 లోక్సభ ఎన్నికల్లో 17 సీట్లలో ఒక్క స్థానం కూడా గెలవకపోవడమే కాకుండా, పార్టీ ఓటు షేర్ 41.29 శాతం నుంచి 16.68 శాతానికి దిగజారింది. కేటీఆర్, హరీశ్ రావు, కవిత విడివిడిగా వ్యవహరించిన పలు సందర్భాల్లో బీఆర్ఎస్కి ఓటమే ఎదురయ్యింది. కేటీఆర్ ఇన్చార్జీగా ఉన్న కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోయారు.
హుజురాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లో హరీశ్కు బాధ్యతలు అప్పగించినప్పుడు కూడా ఓటమి తప్పలేదు. అయితే, మునుగోడు, నాగర్జునసాగర్ ఉపఎన్నికల్లో ఎవరికీ ఇంచార్జీ బాధ్యతలు అప్పగించకపోవడంతో, అందరూ సమిష్టిగా పనిచేయడం వలన ఈ రెండు చోట్లా బీఆర్ఎస్ విజయం సాధించింది.
1983లో ఇండిపెండెంట్గా పోటీ చేసి 877 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిన కేసీఆర్ దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత మళ్లీ 2023లో కామారెడ్డిలో ఓటమి చవిచూశారు. ఆయన కామారెడ్డిలో ఎందుకు పోటీ చేశారో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. అంతేకాక ప్రతిపక్ష పార్టీ పాత్రలో కూడా వ్యూహాత్మక తప్పిదాలు చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో రంజిత్ రెడ్డికి, కడియం కావ్యకు బీఆర్ఎస్ టికెట్లిచ్చినా వాళ్లు పార్టీ వీడి కాంగ్రెస్ నుండి పోటీ చేశారు.
ఇతర స్థానాల్లో కూడా బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టిన పార్టీ ఓటమిని మూటగట్టుకుంది. సొంత జిల్లా మెదక్ ఎంపీ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయారు. కంటోన్మెంట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరణించడంతో జరిగిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ సానుభూతితో గెలవాల్సి ఉన్నా ఓడిపోయింది.
ఇటీవల జరిగిన పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్నా పోటీ చేయకుండా బీజేపీ నెత్తిన పాలు పోశారు. ఉద్యమ సమయంలో ధైర్యంగా పలు ఉప ఎన్నికలను ఎదుర్కొన్న బీఆర్ఎస్ ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడానికే వెనుకంజ వేస్తుంది.
బీఆర్ఎస్ చేస్తున్న తప్పులతో బలపడుతున్న బీజేపీ నుంచి కూడా బీఆర్ఎస్కు ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్కు గట్టి పోటీ ఇవ్వకపోతే, బీఆర్ఎస్ మరింత బలహీనపడడం ఖాయం.
తెలంగాణ సాధకుడిగా, ఉద్యమ నేతగా, పార్టీఅధ్యక్షుడిగా కేసీఆర్ పట్ల ఎవరికీ అభ్యంతరం లేదు. ఉద్యమ కాలంలో, అధికారంలో ఉన్నప్పుడు పార్టీని ధిక్కరించినా కేసీఆర్కు ఏమీ కాలేదు. కేసీఆర్ మొదటి నుంచి ‘‘బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్’’ అనే ధోరణితో పార్టీ నడపుతూ వస్తున్నారు.
కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నారు. ఈ విషయాన్ని గ్రహించకుండా అదే నియంతృత్వ ధోరణితో వెళ్తే బోల్తాపడే ప్రమాదం ఉంది. బీఆర్ఎస్ 2014 నుంచి ఎమ్మెల్యే కేంద్రంగా రాజకీయాలు నడిపింది. దీంతో పార్టీలో కొత్త నాయకత్వం రాకపోవడంతో బీఆర్ఎస్ కార్యకర్తల నెట్వర్క్ బలపడలేదు. ఓడిపోయినా ఇప్పటికీ మాజీ ఎమ్మెల్యేల చుట్టే క్షేత్రస్థాయిలో రాజకీయాలు నడుస్తుండటంతో పార్టీలో రోజురోజుకు అసమ్మతి పెరుగుతోంది.
పార్టీలో కేసీఆరే ఈ ముగ్గురి మధ్య పోటీని ప్రోత్సహిస్తున్నారన్న అనుమానాలు శ్రేణుల్లో బలపడుతున్నాయి. పార్టీలో అంతర్గత కలహాలు పార్టీ ఎదుగుదలకు అడ్డుపడతాయి. కేసీఆర్ పార్టీని తెలంగాణ భవన్ నుంచి నడపకుండా ఫామౌజ్ నుంచి నడుపుతున్నారు. అసెంబ్లీకి రాని ప్రతిపక్షనేతగా తెచ్చుకుంటున్నారు.
పీఏసీ ముందుగా హరీశ్ రావుకి ఇస్తామని చెప్పారు. కానీ దానిమీద సరైన పోరాటం చేయకపోవడంతో బీఆర్ఎస్ నష్ట పోయింది. అసెంబ్లీకి రాకుండా వ్యూహాత్మకంగా తప్పిదం చేస్తున్న కేసీఆర్ పార్టీ రజతోత్సవ సభలో కేటీఆర్, హరీశ్లను పిల్లలంటూ వ్యాఖ్యానించడంతో వాళ్ల స్థాయిని తక్కువ చేసినట్టయింది.
మరోవైపు అసెంబ్లీలో పార్టీ చేసే యుద్ధానికి సైన్యాధికారి రాడు. కమాండర్ ఎవరో తెలియదు. అంతేకాక ఇప్పటికీ బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీకి కార్యవర్గమే లేదు. ఇప్పటిదాక అవసరం రాలేదుగానీ, విప్ ఎవరిస్తారో కూడా తెలియదు. అసెంబ్లీలో పార్టీ పరిస్థితి అంతా గందరగోళమే. 2023 ఎన్నికల తర్వాత రాష్ట్ర జిల్లా కమిటీలు, అనుబంధ సంఘాల కమిటీలను కూడా రద్దు చేశారు. ఇప్పటి వరకూ వాటిని పునరుద్ధరించ లేదు.
పార్టీ రజతోత్సవ బహిరంగ సభ సక్సెస్ అయ్యిందని బీఆర్ఎస్ చంకలు గుద్దుకుంటే సరిపోదు. గతంలో ఏపీలో జగన్ సిద్ధం సభలకు కూడా జనం భారీగా వచ్చారు. సభలకు జనం రావడం ప్రజా మద్దతుకు కొలమానం కాదు.
అధికార కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయంలో కుటుంబ కలహాలతో పార్టీలో విభేదాలు పెరుగుతున్నాయి. అంతర్గత కలహాలతో పార్టీ బలహీనపడితే జాతీయంగా కూడా కేసీఆర్కు నష్టమే. ఈ నాలుగు ముక్కలాట పోరుకు వీలైనంత త్వరగా కేసీఆర్ ముగింపు పలకపోతే పార్టీ ముక్కలయ్యే ప్రమాదం ఉంది!
-జంపాల ప్రవీణ్,
రీసెర్చర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ
(గమనిక: వ్యాసంలో తెలిపిన అభిప్రాయాలు, విశ్లేషణలు, వ్యూహాలు వ్యాసకర్త వ్యక్తిగతం. హిందుస్తాన్ టైమ్స్వి కావు.)