Mlc Kavitha : రాజకీయ కక్షతోనే మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగించడంలేదు - ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Mlc Kavitha : మేడిగడ్డ ప్రాజెక్టును వాడుకోకుండా తెలంగాణను ఎండబెడుతున్నారని ఎమ్మెల్సీ కవిత విమర్శలు చేశారు. తెలంగాణ నీళ్లు మలపాలన్న సోయి లేని సీఎం రేవంత్ రెడ్డికి లేదని విమర్శించారు. రాజకీయ కక్షతోనే మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగించడం లేదన్నారు.

Mlc Kavitha : సాగుకు నీళ్లివ్వక రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి, కాంగ్రెస్ పార్టీకి రైతుల ఉసురు తగులుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. సూర్యాపేట జిల్లా పర్యటనలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టును వాడుకోకుండా తెలంగాణను ఎండబెడుతున్నారన్నారు. తక్షణమే మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగంలో తేవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి జల విధానం లేదన్నారు. తెలంగాణ నీళ్లు మలపాలన్న సోయి లేని సీఎం రేవంత్ రెడ్డికి లేదని విమర్శించారు.
లక్షల ఎకరాల్లో ఎండిపోతున్న పంటలు
"ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 199 టీఎంసీలతో బనకచర్లలో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. కానీ మన సీఎం మాత్రం నాగార్జున సాగర్ ను కూడా మన ఆధీనంలోకి తీసుకురాలేకపోయారు. కాళేశ్వరం ద్వారా సూర్యాపేట జిల్లాలో గోదావరి జలాలను పారించింది కేసీఆర్. కృష్ణా పరివాహక ప్రాంతంలోనూ గోదావరి నుంచి నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ ది. కేసీఆర్ హయాంలో కోదాడ నియోజకవర్గానికి కాళేశ్వరం ద్వారా లక్షా 22 వేల ఎకరాలకు నీళ్లు అందించారు. ఇప్పుడు నీళ్లు ఎందుకు తేవడం లేదని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సవాలు చేస్తున్నాను" - ఎమ్మెల్సీ కవిత
"రాజకీయ కక్షతోనే మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగించడం లేదని ఇంజనీర్లు చెబుతున్నారు. మరో 40 రోజుల పాటు నీళ్లు ఇస్తేనే పంటలు చేతికొచ్చే అవకాశం ఉంటుంది. గతేడాది నీళ్లు ఇవ్వక సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో 4 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది. ఈ మొత్తం వ్యవహారానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యత వహించాలి. సూర్యాపేట జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయంటే ఆ పాపం, ఉసురు మంత్రి ఉత్తమ్ కు తగులుతుంది. జిల్లా మంత్రితో పాటు సాగునీటి శాఖ మంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వని మంత్రి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే" -ఎమ్మెల్సీ కవిత
14 నెలల్లో 30 సార్లు దిల్లీకి
రోజంతా కేసీఆర్ ను తిట్టుకుంటూ తిరిగితే కాంగ్రెస్ నాయకులకు ఒరిగేదేమీ లేదని ఎమ్మెల్సీ కవిత హితవు పలికారు. కేసీఆర్ ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల ప్రేమతో పరిపాలించారన్నారు. 14 నెలల్లో 30 సార్లు దిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి...ఎవరు ఏమనుకున్నా దిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దల కాళ్లు పట్టుకుంటా అన్నట్లుగా సీఎం వ్యవహరిస్తున్నారన్నారు. ఏ ఒక్క అంశంపై సీఎం ఆలోచన చేయకుండా పాలిస్తున్నారని విమర్శించారు. మహిళలకు ఒక్క కార్యక్రమాన్ని కూడా చేయని కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. మహిళల అంశాలపై ముఖ్యమంత్రి కనీసం ఒక సమీక్ష చేయలేదని ఆరోపించారు.
కాకిలెక్కలతో కాలం వెల్లదీస్తున్న కాంగ్రెస్
"కేసీఆర్ హయాంలో మహిళలకు పెద్దపీట వేశాం. బీఆర్ఎస్ హయాంలో మహిళలపై నేరాలు చేయాలంటే వెన్నులో వణుకుపుట్టేది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో మహిళలకు భద్రత లేని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ పాలనలో శాంతి భద్రతల సన్నగిల్లాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు ఏ వర్గానికి కాంగ్రెస్ చేసిందేం లేదు. ఎస్సీ వర్గీకరణ కోసం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎస్సీ, బీసీల జనాభాను తక్కువ చేసి చూపిస్తుంది. కాకిలెక్కలతో కాలం వెల్లదీస్తుంది. బీఆర్ఎస్ పార్టీ గల్లా పట్టుకొని అడిగితే రైతు రుణమాఫీని ప్రభుత్వం ప్రకటించింది.
కానీ ఎవరికీ సంపూర్ణంగా రుణ మాఫీ కాలేదు. రైతుభరోసా ఒక్కో గ్రామంలో సగం మంది రైతులకు కూడా రాలేదు" - ఎమ్మెల్సీ కవిత
సంబంధిత కథనం