'గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయాలి' - సీఎంకు ఎమ్మెల్సీ కవిత లేఖ, ప్రస్తావించిన అంశాలివే-brs mlc kavitha open letter to cm revanth reddy demanded re conduct of the group 1 exam ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  'గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయాలి' - సీఎంకు ఎమ్మెల్సీ కవిత లేఖ, ప్రస్తావించిన అంశాలివే

'గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయాలి' - సీఎంకు ఎమ్మెల్సీ కవిత లేఖ, ప్రస్తావించిన అంశాలివే

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బహిరంగ లేఖ రాశారు. గ్రూప్ 1 పరీక్షలను వెంటనే రద్దు చేసి తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు. గ్రూప్‌ -1 పరీక్ష నిర్వహించిన తీరు, ఫలితాల వెల్లడిపై అభ్యర్థుల్లో అనేక సందేహాలున్నాయని లేఖలో ప్రస్తావించారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. గ్రూప్-1 నిర్వహించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగుల జీవితాలు అగాధంలోకి నెట్టివేయబడ్డాయన్నారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకం లేమి తేటతెల్లమైందని లేఖలో ప్రస్తావించారు.

“ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీ లోపించింది. యువత జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడడం ఆక్షేపనీయం. గ్రూప్‌ -1 పరీక్ష నిర్వహించిన తీరు, ఫలితాల వెల్లడిపై అభ్యర్థుల్లో అనేక సందేహాలు ఉన్నాయి. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు వేర్వేరు హాల్‌టికెట్ నెంబర్ల కేటాయింపుతో గందరగోళం తెరపైకి వచ్చింది” అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.

కవిత లేఖలోని మరిన్ని అంశాలు:

  • "బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేసినా కూడా అభ్యర్థుల హాజరు విషయంలో ఎందుకు వ్యత్యాసాలు ఏర్పడ్డాయి..?
  • 21,075 మంది మెయిన్స్‌ పరీక్షలకు హాజరయ్యారని టీజీపీఎస్సీ ప్రకటించింది. ఫలితాలు ప్రకటించే సరికి ఆ అభ్యర్థుల సంఖ్య 21,085 మందికి చేరింది. ఈ పది మంది అభ్యర్థుల సంఖ్య ఎలా పెరిగింది..?
  • సదరు అభ్యర్థులు నిజంగానే మెయిన్స్‌ పరీక్షలకు అప్పియర్‌ అయ్యారా లేదంటే తర్వాత వారిని తెచ్చి చేర్చారా అనే సందేహం మిగతా అభ్యర్థుల్లో నెలకొంది.
  • జవాబు పత్రాల మూల్యాంకనంపైనా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని ప్రముఖ యూనివర్సిటీల ప్రొఫెసర్లతో వ్యాల్యుయేషన్‌ చేయిస్తామని తొలుత టీజీపీఎస్సీ ప్రకటించింది. కానీ రిటైర్డ్‌ ప్రొఫెసర్లతో మూల్యాంకనం చేయించడంపైనా అభ్యర్థుల్లో అనుమానాలున్నాయి.
  • రాష్ట్రవ్యాప్తంగా 45 సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించిన టీజీపీఎస్సీ తర్వాత ఒక సెంటర్‌ను పెంచింది. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది..?
  • కేవలం రెండు పరీక్ష కేంద్రాల్లో మెయిన్స్‌ పరీక్షలకు హాజరైన రెండు కోచింగ్‌ సెంటర్లకు చెందిన 71 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు అర్హత సాధించడం వెనుక ఏదో జరిగి ఉందని అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
  • అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న ఆందోళన ధర్మబద్దమని హైకోర్టు కూడా గుర్తించి నియామకాల ప్రక్రియకు బ్రేకులు వేసింది''నీళ్లు - నిధులు - నియామకాలు'' తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యమనే విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తించాలి" అని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో కవిత పేర్కొంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం