ED questioning MLC Kavitha: ఈడీ ఆఫీసులో కవిత.. బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్
delhi liquor case updates: ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. మరోవైపు ఈడీ ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా మోహరించారు.
ED questioning MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఈడీ దూకుడుగా ముందుకెళ్తోంది. ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను అరెస్ట్ చేసింది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో… శనివారం ఉదయం ఈడీ విచారణకు కవిత హాజరయ్యారు. రామచంద్ర పిళ్లై వాంగ్మూలం, సౌత్ గ్రూపు లావాదేవీలు, ఫోన్లు మార్చడం, ధ్వంసం చేయడం తదితర ఆరోపణలపై లోతుగా ఈడీ విచారించే అకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ట్రెండింగ్ వార్తలు
లిక్కర్ కేసుకు సంబంధించి కవితను... ఈడీ ప్రత్యేక బృందం విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోందని సమాచారం. కవితను మొత్తం ఐదుగురు ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రామచంద్ర పిళ్లైతోపాటు కవితను విచారిస్తున్నట్లు సమాచారం.
కేటీఆర్, హరీశ్ తో సమావేశం..
విచారణకు హాజరయ్యే ముందు కవిత... మంత్రులు కేటీఆర్, హరీశ్ రావ్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ ఏజీ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత... ఈడీ ఆఫీస్ కు చేరుకున్నారు. అందరికీ అభివాదం చేస్తూ కవిత... లోపలికి వెళ్లారు. కవితకు మద్దతు తెలిపేందుకు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు తుగ్లక్రోడ్డులోని నివాసం వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. ఈడీ ఆఫీసుకు బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత కారుతో పాటు మరో వాహనానికి మాత్రమే అనుమతిచ్చారు. ఈ సందర్భంగా ఈడీకి బీఆర్ఎస్ శ్రేణులు, జాగృతి కార్యకర్తలు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మరోవైపు ఈడీ ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ ను అమలు చేశారు ఢిల్లీ పోలీసులు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టారు.
సంబంధిత కథనం