BRS Leaders Attack: పంచాయితీ ఉద్యోగిపై బిఆర్ఎస్ నాయకుల దాడి..వైరల్గా వీడియో
BRS Leaders Attack: ముఖ్యమంత్రి కేసీఆర్ను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారని ఆరోపిస్తూ పంచాయితీ ఉద్యోగిపై బిఆర్ఎస్ నాయకులు దాడికి పాల్పడ్డారు. కారులో వెళుతున్న వారిని అడ్డగించి దాడి చేయడం కలకలం రేపింది.
BRS Leaders Attack: ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించారని ఆరోపిస్తూ పంచాయితీ ఉద్యోగిపై బిఆర్ఎస్ నాయకులు దాడి చేయడం కలకలం రేపింది. తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం జూనియర్ పంచాయతీ కార్యదర్శి జనార్దన్పై మంగళవారం సాయంత్రం బిఆర్ఎస్ నాయకులు దాడి చేశారు. కారులో డ్రైవింగ్ సీట్లో ఉన్న జనార్థన్ను అడ్డగించి కాళ్లతో తంతూ బయటకు లాగి దాడి చేశారు. ఈ ఘటనలోఅదే వాహనంలో ప్రయాణిస్తున్న ఉద్యోగులు భయభ్రాంతులకు గురయ్యారు.
ట్రెండింగ్ వార్తలు
ములుగు కలెక్టరేట్ వద్ద సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు మద్దతుగా మంగళవారం తీన్మార్ మల్లన్న బృందానికి చెందిన సభ్యుడొకరు ప్రసంగించారు. ఈ క్రమంలో బిఆర్ఎస్ నాయకులపై తీవ్రపదజాలంతో విమర్శలు చేశారు. సమ్మె చేస్తున్న కార్యదర్శులు చప్పట్లతో ఆయన్ను ప్రోత్సహించారు.
విషయం తెలియడంతో ఆగ్రహించిన బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు సమ్మె ముగించుకొని కారులో ఇంటికి వెళుతున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శి జనార్దన్పై దాడికి పాల్పడ్డారు. డ్రైవింగ్ సీటులో ఉన్న జనార్థన్ను కాలర్ పట్టుకుని వాహనం నడపకుండా అడ్డుకున్నారు. కారు నుంచి కిందకు దిగాలంటూ చితకబాదారు. కారు నుంచి కిందకు లాగి అతనిపై పిడిగుద్దులు కురిపించారు.
ముఖ్యమంత్రిని విమర్శిస్తావా అంటూ ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడటం వీడియోలో రికార్డైంది. ఈ ఘటనతో కారులో ఉన్న ఓ మహిళా ఉద్యోగిని కిందకు దిగి పోగా, మరో వ్యక్తిపై కూడా దాడి చేశారు. కేసీఆర్ను విమర్శించే వాళ్లంతా తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నారని ప్రశ్నించిన బిఆర్ఎస్ నాయకులు, తమ నాయకుడిని ఏమైనా అంటే చంపుతామని బెదిరించారు. అసభ్య పదాలతో ధూషిస్తూ పంచాయితీ ఉద్యోగిపై దాడి చేయడం వీడియోల్లో వైరల్గా మారింది. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న పంచాయతీ కార్యదర్శులు, బిఆర్ఎస్ నాయకుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. దాడి జరగానికి ముందే తీన్మార్ మల్లన్న బృందానికి చెందిన సభ్యుడు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
పంచాయితీలో ఔట్ సోర్సింగ్ కార్యదర్శుల సమ్మెకు మద్దతు తెలుపుతున్న తీన్మార్ మల్లన్న బృందాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసినా పంచాయితీ ఉద్యోగిని కొట్టినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ నేతల దాడిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు