Harish vs Revanth : రేవంత్ రెడ్డి ఈ మాట అనడం జోక్ ఆఫ్ ద మిలీనియం.. హరీష్ రావు సెటైర్లు-brs leader harish rao satires on chief minister revanth reddy ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Harish Vs Revanth : రేవంత్ రెడ్డి ఈ మాట అనడం జోక్ ఆఫ్ ద మిలీనియం.. హరీష్ రావు సెటైర్లు

Harish vs Revanth : రేవంత్ రెడ్డి ఈ మాట అనడం జోక్ ఆఫ్ ద మిలీనియం.. హరీష్ రావు సెటైర్లు

Harish vs Revanth : సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మరోసారి పంచ్‌లు పేల్చారు. ముఖ్యమంత్రి ఎక్కడికి పోయినా పాత చింతకాయ పచ్చడి వాగుడే వాగుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను తిట్టడం తప్ప ప్రజలకు పనికొచ్చే విషయం ఒక్కటి కూడా మాట్లాడడం లేదని విమర్శించారు. హరీష్ ఎమన్నారో ఓసారి చూద్దాం.

హరీష్ రావు

కన్నతల్లికి పట్టెడన్నం పెట్టలేనోడు.. పినతల్లికి బంగారు గాజులు కొనిస్తాడట.. వంద రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీల గురించి మాట్లాడటం చేతకాదు కానీ.. మూసీ ప్రక్షాళన లాంటి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు అని సీఎం రేవంత్‌పై బీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావు ఫైర్ అయ్యారు. పదేపదే పాలమూరు బిడ్డను అంటూ శుష్కమైన సెంటిమెంట్‌ను వల్లించడమే తప్ప.. పాలమూరుకు ఒరగబెట్టిందేమీ లేదని హరీష్ విమర్శించారు.

మాటలు ఎక్కువ చేతలు తక్కువ..

'నిజానికి పాలమూరు బిడ్డలు పనిమంతులు, రేవంత్‌కు మాత్రం మాటలు ఎక్కువ చేతలు తక్కువ. రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్‌కు కృష్ణా బేసిన్‌లో ఉన్న ప్రాజెక్టుల గురించే కాదు.. ఏ ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. 68 శాతం కృష్ణ పరివాహక ప్రాంతం ఉన్న తెలంగాణ, 60 ఏండ్ల పాటు కృష్ణా జలాలు దక్కక అలమటించిందంటే అది ఎవరి పాపం? బంగారం పండే నల్లరేగడి భూములుండిన పాలమూరు జిల్లాను.. వలసల జిల్లాగా మార్చిన వంచకులు మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులే' అని హరీష్ రావు ఆరోపించారు.

జోక్ ఆఫ్ ద మిలీనియం..

'తెలంగాణను కరువు కాటకాల పాలు చేసి 60 ఏండ్లు ఘోర కలిని సృష్టించింది కాంగ్రెస్. తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే బాబుకి ఊడిగం చేసిన రేవంత్.. ఇప్పుడు బాబును నొప్పించకుండా కృష్ణా జిల్లాల గురించి మాట్లాడాలనుకుంటున్నారు. కాంగ్రెస్ మంజూరు చేసిన ప్రాజెక్టులను బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందని రేవంత్ అనడం.. జోక్ ఆఫ్ ద మిలీనియం' అని హరీష్ రావు ఎద్దేవా చేశారు.

సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించు..

'మీ రాజకీయ ప్రయోజనాల కోసం సాంకేతిక పరమైన విషయాలు నిర్లక్ష్యం చేసి.. ఆదరబాదరగా ఎస్ఎల్బీసీ పనులు పరిగెత్తించారు. కార్మికులు వద్దని వారిస్తున్నా వినకుండా.. వారిని మృత్యు కుహరంలోకి నెట్టారు. వారి ప్రాణాలు బలితీసుకొని ఇప్పుడు కుహనా ఏడ్పులు ఏడుస్తున్నారు. నీకు నిజాయితీ ఉంటే ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించు! దోషులు ఎవరో తేల్చు! పచ్చి అబద్ధాలు, పిచ్చి సెంటిమెంట్లు నోటికి వచ్చినట్టు కారు పూతలు బంద్ చెయ్. ఒర్రితే పనులు కావు.. ఒళ్లు వంచితే పనులవుతాయి' అని హరీష్ ట్వీట్ చేశారు.

ఇది తెలంగాణ దౌర్భాగ్యం..

'15 నెలలు అయినా నీకు జ్ఞానోదయం కాకపోవడం తెలంగాణ దౌర్భాగ్యం. అసలు వాస్తవాలు మీకు తెలియక కాదు.. అతి తెలివితో జనాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం నీది. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.3900 కోట్లు ఖర్చు చేసి ఎస్ఎల్‌బీసీ సొరంగం 11.48 కిలోమీటర్లు తవ్విన విషయాన్ని ఎందుకు దాచిపెడుతున్నారు? నిధులు ఖర్చు చేయకుండానే 11.48 కిలోమీటర్ల సొరంగం పనులు అయ్యాయా? మీ హయాంలో డిండి ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. అది అసలు నిజం' అని హరీష్ రావు వెల్లడించారు.

కేసీఆర్ అంటే పంటలు..

'కేసీఆర్ హయాంలో ప్రాజెక్టుల పనులు ఆగలేదు కనుకే.. రేవంత్ రెడ్డి అపుడు ఏం మాట్లాడలేదు. కేసిఆర్ అంటే పచ్చని పంటలు, రేవంత్ రెడ్డి అంటే పచ్చి అబద్దాలు అని ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో మర్యాదపూర్వక సంబంధాలను నిర్వహించినం. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తరపున సూట్ కేసులు మోయలేదు. ప్రజాభవన్‌లో కూర్చోబెట్టి పాదసేవ చేయలేదు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టలేదు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు యధేశ్చగా రోజుకు 10వేల క్యూసెక్కులు తరలించుకుపోతున్నడు. ఇదేందని మేము ప్రశ్నిస్తే అడ్డుకోవాల్సింది పోయి.. మా మీద రంకెలు వేస్తున్నరు. నీకు చాతనైతే కృష్ణా నీటి విషయంలో చంద్రబాబుపై యుద్ధం ప్రకటించు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడు' అని హరీష్ హితవు పలికారు.