తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిపోయింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు ఏ క్షణమైనా నగారా మోగే అవకాశం ఉంది. ఇంకోవైపు కారు పుట్టి 25 ఏండ్లు కావొస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. దీంతో కేసీఆర్ భారీ ప్లాన్తో రీ ఎంట్రీ ఇస్తున్నట్టు పొలిటికల్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఈనెల 19వ తేదీన బీఆర్ఎస్ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని.. కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఆదేశించారు. అధినేత ఆదేశాల మేరకు.. ఈనెల 19వ తేదీన మధ్యాహ్నం ఒంటి గంట నుండి హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది.
కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత, మాజీ ఎంపీలు, శాసనమండలి సభ్యులు, శాసన సభ్యులు, కార్పోరేషన్ల మాజీ ఛైర్మన్లు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, డీసీసీబి, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్లను ఆహ్వానించనున్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏండ్లు కావస్తున్న నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణ, సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం.. తదితర అంశాలపై విస్తృత స్థాయిలో చర్చించనున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి.. ఏడాది కాలం గడిచింది. ఈ ఏడాదిలో కేసీఆర్ సైలెంట్గా ఉన్నారు. సంవత్సరం సమయం ఇవ్వాలని వేచి చూశారు. 19న జరగబోయే సమావేశంలో.. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, వైఫల్యాల మీద ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు అనుగుణంగా.. బీఆర్ఎస్ నాయకులు చేపట్టాల్సిన కార్యాచరణపై సమగ్ర చర్చ జరిగే అవకాశం ఉంది.
కీలక అంశాలపై సమగ్ర చర్చ జరిపే ఛాన్స్ ఉంది. అలాగే పార్టీకి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అందుకే ఆహ్వానితులందరూ కచ్చితంగా హాజరుకావాలని కేటీఆర్ స్పష్టం చేశారు. దీనిపై తెలంగాణ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కేసీఆర్ భారీ ప్లాన్తోనే రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఏప్రిల్ 27వ తేదీకి గులాబీ పార్టీ పురుడుపోసుకొని 25 ఏళ్లు అవుతుంది. ఈ నేపథ్యంలో.. సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. 14 ఏళ్లు ఉద్యమంలో.. పదేళ్లు పాలనలో కేసీఆర్ సాధించిన విజయాలు, ఎదుర్కొన్న ఆటుపోట్ల గురించి విస్తృతంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. ఉద్యమ పార్టీగా పుట్టి.. స్వరాష్ట్ర కల సాకారం చేసి.. ఫక్తు రాజకీయ పార్టీగా ఎదిగి.. అధికారం చేపట్టిన తీరును ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది.