KCR Strategy: ఒకే దెబ్బకి రెండు పిట్టలు..! ఆ నేతకు MLC ఇవ్వటం వెనక ఇంత కథ ఉందా..?
BRS MLCs: తాజాగా ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇందులో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా చెందిన ఓ నేత ఎంపిక మాత్రం ఆసక్తికరంగా మారింది. ఈ మధ్యనే పార్టీలో చేరిన ఆయనకు... ఎమ్మెల్సీ ఖరారు చేయటం వెనక భారీ వ్యూహామే ఉందన్న చర్చ నడుస్తోంది.
BRS MLC Candidates:కేసీఆర్..... వ్యూహాలు రచించటంలో దిట్ట..! ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ... ప్రత్యర్థి పార్టీలను ఈజీగా బోల్తా కొట్టించేస్తారు..! సూటిగానే పదునైన మాటలతో... టార్గెట్ చేసి ఏకిపారేస్తారు.. ! కాస్త సైలెన్స్ గా ఉన్నారంటే... ఏదో మాస్టర్ స్కెచ్ తో ముందుకువస్తారన్నట్లు ఉంటుంది ఆయన తీరు..! ఆయన తీసుకొనే కొన్ని నిర్ణయాలు కూడా ఎవరికీ అర్థం కాకుండా ఉంటాయి..! తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇందులోనూ కేసీఆర్ తనదైన స్టైల్ లో కసరత్తు చేశాకే... ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. అయితే మొత్తం ముగ్గురిని ఖరారు చేయగా... ఇందులోని ఓ అభ్యర్థి విషయంలో మాత్రం... పక్కాగా రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొనే ఫైనల్ చేశారన్న చర్చ జోరుగా నడుస్తోంది.
ట్రెండింగ్ వార్తలు
టీఆర్ఎస్ ను కాస్త బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్... పార్టీని పక్క రాష్ట్రాల్లో కూడా విస్తరించే పనిలో పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఎమ్మెల్సీ ఎంపిక విషయం కూడా ఈ కోణంలోనే ఉందన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే ఏపీలో పార్టీని లైన్ లోకి తీసుకొచ్చిన కేసీఆర్... బలమైన సామాజికవర్గం ఉన్న తోట చంద్రశేఖర్ ను అధ్యక్షుడిగా నియమించి అందరికీ షాక్ ఇచ్చారు. అయితే తాజాగా... ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన చల్లా వెంకట్రామిరెడ్డికి కేసీఆర్ ఎమ్మెల్సీ సీటును ఖరారు చేశారు. నిజానికి గత డిసెంబర్ మాసంలోనే చల్లా గులాబీ గూటికి చేరారు. ఇంతలోనే ఆయన ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం వెనక కేసీఆర్ మరో మాస్టర్ స్కెట్ వేశారని తెలుస్తోంది.
చల్లా వెంకట్రామిరెడ్డి... గద్వాల జిల్లాకు చెందిన నేత..!సీమ జిల్లాలతో సరిహద్దు పంచుకునే ఈ నియోజకవర్గానికి చెందిన చల్లాకు ఎమ్మెల్సీ ఇవ్వటంతో ద్వారా.. పార్టీని విస్తరించాలని కేసీఆర్ భావిస్తున్నారట! దీనికి కారణం లేకపోలేదు చల్లా వెంకట్రామిరెడ్డి తెలంగాణకు చెందిన నేత అయినప్పటికీ సీమలో ఆయనకు ముంచి బంధుత్వాలు ఉన్నాయి. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి ఆయన మనవడు(బిడ్డ కుమారుడు) అవుతారు. అనంతపురం జిల్లాకు చెందిన నీలంసంజీవరెడ్డికి కర్నూలు , కడపతో పాటు మహబూబ్ నగర్ జిల్లాల్లో బంధుత్వాలు ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి కుటుంబంతో కూడా దగ్గరి బంధుత్వం ఉంది. చల్లా వెంకట్రామిరెడ్డి ఎంపికతో సీమ జిల్లాల్లో పార్టీ విస్తరణకు అవకాశాలు ఉంటాయని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సీమ జిల్లాల్లోని రెడ్డి సామాజికవర్గానికి కూడా దగ్గర కావొచ్చని కేసీఆర్ చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కర్నూలు జిల్లాలో చల్లాకు వ్యాపారాలు ఎక్కువగా ఉన్నాయి. పలు అధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలకు కూడా విరాళాలు ఇస్తూ మంచి పేరును సంపాందించారు.
ఇక చల్లాకు ఎమ్మెల్సీ ఇవ్వటంతో కేవలం సీమలో పార్టీ విస్తరణే కాదు... మరో కోణంలో కూడా ఎంపిక చేశారన్న చర్చ నడుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గద్వాల జిల్లా పరిధిలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ జెండాను ఎగరవేయాలని కేసీఆర్ చూస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా చల్లాకు ఫాలోయింగ్ ఉంది. గతంలో ఆయన అలంపూర్ నుంచి ఎమ్మెల్యేగా కూడా పని చేశారు. అయితే ఆయనకు ఉన్న ఇమేజ్ ను పార్టీకి వాడుకోవటంతో ఈ సీట్లను కూడా ఈజీగా మరోసారి కొట్టాలని కేసీఆర్ చూస్తున్నారట..! అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు కేసీఆర్ నిర్ణయం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి…!
సంబంధిత కథనం