హెచ్సీయూ భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన 400 ఎకరాల విధ్వంసాన్ని.. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచీ తీవ్రంగా ఖండించిందని.. ఆ పార్టీ ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు. 1965లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. అటవీ భూములే కాకుండా వృక్ష సమృద్ధిగా ఉన్న ప్రాంతాలను కూడా అడవులుగా గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయాన్ని ఇటీవల కేటీఆర్ పదేపదే గుర్తుచేస్తున్నారని వ్యాఖ్యానించారు.
'ఈ బుల్డోజర్ విధ్వంసాన్ని బీజేపీ తరఫున నిరంతరం వ్యతిరేకిస్తూ.. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, భూపేందర్ యాదవ్ను కలిసి ఫిర్యాదు చేశాం. హెచ్సీయూ భూముల విషయంలో ఓ బీజేపీ ఎంపీ పాత్ర ఉందంటూ, కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఇస్తున్నారని ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్న కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. కంచ గచ్చిబౌలి భూముల్లో విధ్వంసంపై 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్రమంత్రులు కలిసి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు వినతిపత్రాలు సమర్పించారు' అని రఘునందన్ గుర్తు చేశారు.
'అటవీ భూముల్లోకి బుల్డోజర్లను పంపడాన్ని వ్యతిరేకిస్తున్నామని, ఈ విషయంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. కేటీఆర్ ప్రధానిగా మోదీ చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది అంటూ ట్వీట్ చేశారు. మోదీ విధేయతకు తెలంగాణ ప్రజలు గౌరవం చూపారు. అందుకే రాష్ట్రంలో బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీని సున్నా సీట్లకే పరిమితం చేశారు. మోదీ పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసానికి ఇది నిదర్శనం. మోదీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని మాట్లాడుతున్న కేటీఆర్.. రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ తప్పుల గురించి మాట్లాడటం లేదు?' అని ప్రశ్నించారు.
'కంచ గచ్చిబౌలి భూముల విషయంలో అన్ని డాక్యుమెంటరీ ఆధారాలతో కేంద్ర పర్యావరణ శాఖ ముందు బీజేపీ ఎంపీలు వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడిన తర్వాత భారత ప్రభుత్వం నూరుశాతం చర్యలు తీసుకుంటుంది. సాధికారత కమిటీ ముందు మా ఎంపీలు హాజరై, అవసరమైన డాక్యుమెంటరీ ఆధారాలను సమర్పించారు. కమిటీ నివేదిక మేరకు వచ్చే తీర్పును బీజేపీ గౌరవిస్తుంది. కంచ గచ్చిబౌలి భూముల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. సాధికారత కమిటీ ఇంకా కొన్ని ఆధారాలు కోరుతోంది' అని మెదక్ ఎంపీ వివరించారు.
'పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడుతున్న కేటీఆర్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.. 111 జీవోను ఎత్తివేసి లక్షలాది ఎకరాల భూములను కాంక్రీట్ జంగిల్గా మార్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో ఎందుకు ప్రయత్నించింది? ఫాం హౌస్లు నిర్మించుకునేందుకు అనుమతులు ఎలా ఇచ్చారు? భాగ్యనగరానికి ‘లంగ్స్ స్పేస్’గా ఉన్న 111 జీవో పరిధిలో చెట్లు నరికివేసి.. నిర్మాణాలు జరిపినప్పుడు ప్రకృతి విధ్వంసం జరగలేదా? 400 ఎకరాల హెచ్సీయూ భూముల విషయంలో కేటీఆర్ మాట్లాడినందుకు స్వాగతిస్తున్నాం. కానీ, లక్షలాది ఎకరాల భూములు ఉన్న 111 జీవో అంశంలో మీ కుటుంబం నిర్మించిన ఫాం హౌస్ల గురించి సమాధానం చెప్పాలి' అని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.
'కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీల మధ్య విడదీయలేని బంధం ఉంది. ఇవి నాణేనికి బొమ్మా-బొరుసులా ఉన్నాయి. పాలసీల పరంగా, వ్యవహారాల్లో రెండూ ఒకేలా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు ఎంఐఎం పార్టీకే ప్రాధాన్యత ఇచ్చింది. అసెంబ్లీలో ఎక్కువ సమయం కేటాయించింది. అదే సమయంలో బీజేపీకి కనీస సమయమూ ఇవ్వలేదు. గతంలో అసెంబ్లీలో "అక్బరుద్దీన్ ఓవైసీ అనుమతిస్తే మాట్లాడతాం" అని బీఆర్ఎస్ నేతలు అన్నట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా "అక్బరుద్దీన్ అనుమతిస్తే తెలుగులో మాట్లాడతా"అంటూ చెబుతున్నారు' అని రఘునందన్ విమర్శించారు.
సంబంధిత కథనం