TG Mlc Election Results : తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. కరీంనగర్-నిజామాబాద్-మెదక్-ఆదిలాబాద్ టీచర్ స్థానంతో పాటు పట్టభద్రుల ఎమ్మెల్సీని బీజేపీ కైవసం చేసుకుంది. మూడు రోజుల పాటు సాగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో విజయం బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డిని వరించింది. మొత్తం 53 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అంజిరెడ్డి 97,880 ఓట్లు రాగా, 5 వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. ఎన్నికల ఫలితాలను అధికారులు ఎన్నికల సంఘానికి నివేదించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు విజేతను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
కరీంనగర్-ఆదిలాబాద్- మెదక్- నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాట్లాడారు. బీజేపీ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ రెండు ఎన్నికల్లో బీజేపీ విజయం ప్రధాని మోదీ పాలనకు ప్రజలిచ్చిన గుర్తింపు అన్నారు. మోదీ పాలనా ప్రభావంతోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయన్నారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా బీజేపీ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు.
డబ్బుల సంచులకు దీటుగా ఓట్ల డబ్బాలు విజయం సాధించాయని బండి సంజయ్ అన్నారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు కొన్నాళ్లుగా ఈవీఎం ట్యాంపరింగ్ పై ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇప్పుడు బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించింది, ఇప్పుడేమంటారని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి బీజేపీని ఓడించాలని కుట్ర చేశాయని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు కౌంట్డౌన్ మొదలైందని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. ప్రజల చూపు బీజేపీ వైపు ఉందన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ విజయ దుందుబి మెగిస్తుందని జోస్యం చెప్పారు.
ఆరు గ్యారంటీలు అమలు, ఉద్యోగాల భర్తీలో కాంగ్రెస్ విఫలమైందని బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు.
సంబంధిత కథనం