తెలంగాణలో వ్యవసాయ భూముల నిర్వహణకు భూ భారతి పోర్టల్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు మండలాల్లో ఈసేవలు ప్రారంభమయ్యాయి. దీని ఆధారంగానే రిజిస్ట్రేషన్ల ప్రక్రియతో పాటు పలు సేవలు అందుతున్నాయి.
తాజాగా ఈ పోర్టల్ కు సంబంధించి ప్రభుత్వం మరో కొత్త అప్డేట్ ఇచ్చింది. పోర్టల్ లో భూ మిత్ర ఆప్షన్ అందుబాటులోకి వచ్చినట్లు తెలిపింది. ఈ ఆప్షన్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సేవలను పొందవచ్చు.ఆ ఆప్షన్ ద్వారా… భూ భారతిలో యూజర్లు అడిగే ప్రశ్నలకు అప్పటికప్పుడు సమాధానమిచ్చేలా ఈ చాట్ బాట్ పని చేస్తుందని ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.
రైతులు ప్రాథమికంగా ఇచ్చే వివరాలతో సరైన సమాచారం ఇవ్వడానికి ఈ భూ మిత్ర ఉపయోగపడుతుందని ప్రభుత్వం వెల్లడించింది. హెల్ప్ డెస్క్ కింద ఈ చాట్బాట్(భూ మిత్ర)ను వినియోగించనున్నారు.
ఈ సేవలను పొందటానికి ముందుగా https://bhubharati.telangana.gov (తెలంగాణ భూ భారతి) వెబ్ సైట్ లోకి వెళ్లాలి. హోం పేజీలో చివర్లో కనిపించే భూమిత్ర ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ప్రాథమికంగా ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉంటాయి.. అవి కాకుండా ఇంకా ఏమైనా ప్రశ్నలు కూడా అడగొచ్చు. టైప్ చేసి సెండ్ చేస్తే… వెంటనే మీకు రిప్లే వస్తుంది. తద్వారా భూముల వివరాలు, లావాదేవీల నిర్వహణలో వచ్చే సందేహాలను నివృత్తి చేసే అవకాశం ఉంటుంది.
ఇక తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భూ భారతి పోర్టల్ లో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, ఆర్ఓఆర్ కరెక్షన్, నాలా, అప్పీల్, భూముల వివరాలు, భూముల మార్కెట్ విలువ, నిషేధిత భూములు, ఈ చలాన్ అప్లికేషన్ స్టేటస్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వివరాలను తెలుసుకునే సేవలు అందుబాటులో ఉండేలా రూపకల్పన చేశారు. వీటి ఆధారంగా సులభంగా భూ వివరాలను పొందవచ్చు.
భూ భారతి పోర్టల్ సమస్యలు, విచారణ కోసం టోల్ ఫ్రీ నెంబర్ ను తెలంగాణ సర్కార్ అందుబాటులోకి తీసుకువచ్చింది. పోర్టల్ లో తలెత్తే సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు వీలుగా 9140 - 29313999 నెంబర్ ను ప్రారంభించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య భూ భారతి టోల్ ఫ్రీ నెంబర్ సేవలను పొందవచ్చు.