TG Govt Employees : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. త్వరలోనే ఆ డబ్బులు విడుదల!-bhatti vikramarka promises to release pending bills of telangana government employees ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Govt Employees : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. త్వరలోనే ఆ డబ్బులు విడుదల!

TG Govt Employees : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. త్వరలోనే ఆ డబ్బులు విడుదల!

TG Govt Employees : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు శుభవార్త చెప్పింది. ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు త్వరలోనే మోక్షం కలగనుంది. ఉప ముఖ్యమంత్రి భట్టిని కలిసి ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు వినతిపత్రం అందించారు. సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం.. త్వరలోనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

భట్టిని కలిసిన ఉద్యోగ జేఏసీ నేతలు

ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు త్వరలోనే మోక్షం లభిస్తుందని.. ఎంప్లాయీస్ జేఏసీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి వివరించారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ.. శుక్రవారం ఉదయం ప్రజా భవన్‌లో వి.లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జేఏసీ ప్రతినిధులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రం అందజేశారు.

భట్టీ హామీ..

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను లచ్చిరెడ్డి డిప్యూటీ సీఎంకు వివరించారు. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ తోపాటు.. రాష్ట్ర స్థాయిలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ అనివార్యతను వివరించారు. ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్, నాయకుల వినతిపై సానుకూలంగా స్పందించిన భట్టి.. సమస్యలను పరిష్కరిస్తామని, త్వరలోనే పెండింగ్ బిల్లులను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

3.59 లక్షల మంది ఉద్యోగులు..

తెలంగాణలో మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 3.59 లక్షలు. ఇందులో ఉపాధ్యాయులు 1.1 లక్షలు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు భారీగా ఉన్నాయని జేఏసీ నేతలు చెబుతున్నారు. ఉద్యోగుల సంఘాల అంచనా ప్రకారం.. ఈ పెండింగ్ బిల్లుల మొత్తం రూ. 8,000 కోట్ల నుంచి రూ. 10,000 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా.

పెండింగ్‌ బిల్లుల్లో ముఖ్యమైనవి..

1.జీపీఎఫ్ (జనరల్ ప్రావిడెంట్ ఫండ్)

2.లీవ్ సరెండర్ (సెలవు నగదు)

3.లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ (సెలవు నగదు చెల్లింపు)

4.ఆర్జిత సెలవులు (సంపాదించిన సెలవులు)

5.మెడికల్ రీయింబర్స్‌మెంట్ (వైద్య ఖర్చుల తిరిగి చెల్లింపు)

6.టీజీఎల్‌ఐ (తెలంగాణ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్)

7.గ్రూప్ ఇన్సూరెన్స్

8.సీపీఎస్ (కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) బకాయిలు

విడతల వారీగా..

ప్రభుత్వం ఈ పెండింగ్ బిల్లులను విడతలవారీగా చెల్లించడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా ఈ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. నెలకు రూ.300 కోట్లు మాత్రమే చెల్లించాలని పరిమితి విధించినట్టు గతంలో వార్తలు వచ్చాయి. కానీ ప్రభుత్వం ఈ పెండింగ్ బిల్లులను ఏప్రిల్ నుంచి ప్రతి నెల రూ.500 నుంచి రూ.600 కోట్ల చొప్పున చెల్లించడానికి చర్యలు తీసుకుంటుందని ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.