ఇటీవల హైదరాబాద్లో ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఓ బాలుడు హైడ్రాకు లేఖ రాశాడు. ఆ లేఖలోని అంశాలను పరిశీలించిన హైడ్రా టీమ్.. వేల కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కాపాడింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
భాగ్యనగరంలోని భూములను కాపాడటానికి హైడ్రా కృషి చేస్తోంది. చాలాచోట్ల నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేసింది. అంతేకాదు.. చెరువులు, కుంటలు ఆక్రమించి నిర్మించిన విల్లాలు, అపార్ట్మెంట్లు, ఇళ్లను నేలమట్టం చేసింది. ఇవన్నీ గమనించిన ఓ బాలుడు.. తాను గమనించిన ఓ విషయాన్ని లేఖ ద్వారా తెలిపాడు.
ఆ బాలుడు చాలా రోజులుగా జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ సమీపంలోని బహిరంగ స్థలంలో క్రికెట్ ఆడుకునేవాడు. సెడెన్గా ఆ ప్రదేశంలోకి ప్రవేశం లేదు అనే బోర్డు దర్శనమిచ్చింది. ప్రాంతం చుట్టూ కంచె వేశారు. నిర్మాణ పనులు కూడా ప్రారంభించారు. వీటన్నింటినీ వివరిస్తూ అతను హైడ్రా సంస్థకు లేఖ రాశాడు. అతని లేఖను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. రంగంలోకి దిగారు.
హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్ ఆ భూమి రాష్ట్ర ప్రభుత్వానికి చెందినదని గుర్తించారు. ప్రస్తుతం చట్టపరమైన వివాదంలో ఉందని ధృవీకరించారు. బాలుడి విజ్ఞప్తి మేరకు ఆ స్థలాన్ని పరిశీలించి.. భూమిని విక్రయించడానికి, అభివృద్ధి చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఆ ప్రాంతం చుట్టూ నిర్మించిన గొడను కూల్చివేయించారు. ఆ స్థలం వివాదంలో ఉంది. అయినా ఓ సంస్థ అక్కడ నిర్మాణ కార్యాకలాపాలు చేపట్టింది. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి అనుమతి లేదు.. అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరించారు.
సదరు స్థలం హైదరాబాద్లోని జూబ్లిహిల్స్ ప్రాంతంలో ఉంది. ఇది అత్యంత ఖరీదైన జోన్లలో ఒకటి. స్థలం 39 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ ఎకరానికి రూ.100 కోట్లకు పైగా మార్కెట్ విలువ ఉంది. అంటే 39 ఎకరాల విలువ దాదాపు రూ.3,900 కోట్లు. ఇంత విలువైన స్థలంలో అక్రమ నిర్మాణాలు బాలుడి లేఖ ద్వారా బయటపడ్డాయి. (బాలుడి భద్రత దృష్ట్యా అతని వివరాలు వెల్లడించడం లేదు)
సంబంధిత కథనం