రేవంత్ రెడ్డి, కేటీఆర్ ప్రాణ మిత్రులు అని కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రేవంత్, కేటీఆర్ కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. కేటీఆర్ జైలుకు వెళ్లకుండా రేవంత్ కాపాడుతున్నారన్న బండి.. చెన్నైలో అఖిలపక్ష భేటీకి ఇద్దరూ కలిసి వెళ్లారని చెప్పారు. హైదరాబాద్లో సమావేశానికి కూడా ప్లాన్ చేస్తున్నారని వివరించారు.
హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. ఎంఐఎంను గెలిపించేందుకు సిద్ధమయ్యారని బండి సంజయ్ ఆరోపించారు. రేవంత్, కేటీఆర్ కలిసి బీజేపీనిని దెబ్బ తీయాలని చూస్తున్నారని చెప్పారు. కంచ గచ్చిబౌలి భూములపై సీబీఐ విచారణకు సిద్ధమా.. అని సంజయ్ ప్రశ్నించారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మజ్లిస్ అభ్యర్థిని గెలిపించేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు.
గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రేవంత్ను కాపాడేందుకే కేటీఆర్ తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దించలేదని బండి ఆరోపణలు గుప్పించారు. గత ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పినా.. కేటీఆర్ బుద్ధి మాత్రం మారలేదని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి, విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు, ధరణి భూముల కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా-ఈ రేస్, ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు వంటి వాటిలో.. కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని సాక్షాత్తు రేవంత్ రెడ్డే చెప్పారని గుర్తు చేశారు.
'ఆరు గ్యారంటీలతోపాటు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో, బయట నిలదీయకుండా ఉత్తుత్తి డ్రామాలు ఆడుతున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ భూములను తెగనమ్మడానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తుంటే.. పైకి గొడవ చేసినట్లు నటిస్తున్నారు. లోలోపల ఆయనకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. హెచ్సీయూ భూముల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ పెద్దఎత్తున ఆందోళన చేస్తుంటే.. రేవంత్ రెడ్డి, కేటీఆర్ కలిసే బీజేపీపై బురదచల్లేందుకు కుట్రలు చేస్తున్నారు' అని సంజయ్ ఆరోపించారు.
'హెచ్సీయూ భూముల వ్యవహారంపై రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే.. సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలి. కేంద్రంలో ఉన్నది కేసీఆర్, రేవంత్ రెడ్డి పాలన కాదు. నీతి, నిజాయతీకి నిలువెత్తు నిదర్శనమైన నరేంద్రమోదీ సర్కార్. సీబీఐ విచారణకు సిద్ధపడితే.. హెచ్సీయూ భూములను దోచుకునేందుకు ఎవరు కుట్రలు చేస్తున్నారో, వారికి ఎవరు సహకరిస్తున్నారనే విషయాలన్నీ బయటకు వస్తాయి' అని సంజయ్ స్పష్టం చేశారు.
సంబంధిత కథనం