Bandi Sanjay Yatra : ముగిసిన బండి సంజయ్ 5వ విడత పాదయాత్ర
Bandi Sanjay Yatra : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు చేపట్టిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర కరీంనగర్ లో ముగిసింది. ఐదు విడతల్లో 56 అసెంబ్లీ నియోజవర్గాల మీదుగా పాదయాత్ర సాగింది.
Bandi Sanjay Yatra :తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంగనర్ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) చేపట్టిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర (Prajasangrama yatra) ముగిసింది. భైంసా నుంచి ప్రారంభమైన ఐదవ విడత యాత్ర 8 అసెంబ్లీ నియోజవర్గాల మీదుగా 222 కిలోమీటర్లు సాగి.. ఇవాళ కరీంనగర్ లో ముగిసింది. అక్కడి నుంచి బండి సంజయ్ అండ్ టీం... నగరంలోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదాన వేదికగా జరుగుతున్న బహిరంగ సభకు చేరుకున్నారు. ముగింపు సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) హాజరుకానున్నారు.
ట్రెండింగ్ వార్తలు
ఐదు విడతల్లో కలిపి ఇప్పటి వరకు బండి సంజయ్ మొత్తం 1403 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. మొత్తంగా 120 రోజులు.. 56 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర సాగింది. యాత్ర పొడవునా సభలు, రచ్చబండలు నిర్వహించారు. ప్రతి సభలో కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోందని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనే వైరస్ గా మారిందని.. దానికి విరుగుడుగా పనిచేసేది బీజేపీ అనే వ్యాక్సిన్ మాత్రమేనని సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. బీఆర్ఎస్ ఇక వీఆర్ఎస్ తీసుకోవాల్సిందే అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అవినీతి కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న చర్చ సాగుతోన్న నేపథ్యంలో ప్రజల్లోకి వేగంగా వెళ్లేందుకు ఇకపై బస్సు యాత్ర చేపట్టాలని బండి సంజయ్ నిర్ణయించిన విషయం తెలిసిందే. పాదయాత్ర జరగని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికి ముందు.. హైదరాబాద్ జంట నగరాల్లో బండి సంజయ్ పాదయాత్ర చేస్తారని తెలుస్తోంది.