తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. బలగం సినిమా నటుడు జీవీ బాబు ఆదివారం ఉదయం కన్నుమూశారు. కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న జీవీ బాబు.. వరంగల్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయన మృతిపట్ల బలగం దర్శకుడు వేణు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనను వెండితెరకు పరిచయం చేసే అదృష్టం తనకు దక్కిందని చెప్పారు.
బలగం సినిమాలో అంజన్న పాత్ర పోషించిన జీవీ బాబు.. రంగస్థల కళాకారుడు. ఆయనది వరంగల్ జిల్లా. చాలా కాలంపాటు ఆయన నాటకాల్లో రాణించారు. బలగం సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమాలో ఆయన నటన ప్రేక్షకులను కదిలించింది. ఆయన కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడ్డారు. వరంగల్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.
బలగం సినిమాతో గుర్తింపు పొందినప్పటికీ, ఆయనకు పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులు తప్పలేదు. ఇటీవల కనీసం మందులు కొనడానికి కూడా డబ్బులు లేవని.. ఆయనకు మెరుగైన వైద్యం అందించడానికి సహాయం చేయాలని.. జీవీ బాబు కుటుంబ సభ్యులు కోరారు. ఆ సమయంలో కొందరు దాతలు ముందుకొచ్చి.. సాయం చేశారు. కానీ.. చికిత్స పొందుతూ ఆయన మే 25న ఆదివారం ఉదయం మృతిచెందారు.
సంబంధిత కథనం