Narsampet Dispute: వరంగల్ జిల్లా నర్సంపేటలో ఓ అసైన్డ్ ల్యాండ్ వివాదం కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య చిచ్చు రేపింది. కొంతకాలంగా ఆ భూమి విషయంలో వివాదం నడుస్తుండగా.. మంగళవారం రెండు పార్టీల నాయకుల మధ్య ఘర్షణకు దారితీసింది. దీంతో ఒక వర్గంపై మరో వర్గం నేతలు పరస్పరం రాళ్లు రువ్వుకోగా.. తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.
విషయం తెలుసుకున్న పోలీసులు ఇరు వర్గాల నేతలను చెదరగొట్టే ప్రయత్నం చేయగా.. రెండు వర్గాల ఘర్షణలో ఓ ఎస్సై కూడా గాయపడ్డారు. దీంతో పోలీస్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
స్థానికులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. నర్సంపేట పట్టణ పరిధిలోని మాదన్నపేట రోడ్డులో ఉన్న 111 సర్వే నెంబర్ లో దాదాపు నాలుగు ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. అది ఓ మాజీ సైనిక అధికారికి చెందిన భూమి కాగా.. దానిని 2019 సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన రియల్టర్ గుగులోతు రామస్వామి నాయక్, తన స్నేహితులు మరికొందరితో కలిసి కొనుగోలు చేశాడు.
నర్సంపేటలో భూమికి ఎకరానికి 50 లక్షలు చొప్పున బేరం కుదుర్చుకొని మొత్తంగా నాలుగు ఎకరాలు కొనుగోలు చేశాడు. ఈ మేరకు ఆ భూమికి ముందస్తుగా రూ.కోటి 50 లక్షలు చెల్లించి, మిగతా రూ.50 లక్షలు రిజిస్ట్రేషన్ అనంతరం చెల్లించేలా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఇంతవరకు బాగానే ఉండగా.. అది అసైన్డ్ భూమి కావడంతో సదరు భూమి రామస్వామి నాయక్ పేరు మీదకు రిజిస్ట్రేషన్ కాలేదు.
ఆ తర్వాత ఇరువురి మధ్య జరిగిన పరిణామాల నేపథ్యంలో రిజిస్ట్రేషన్ విషయమై ఈ భూమి వివాదంలో రామస్వామి కోర్టుకు ఎక్కగా.. ఇప్పటికీ కేసు నడుస్తోంది. కోర్టులో కేసు నడుస్తున్న క్రమంలో రామస్వామి నాయక్ కు ల్యాండ్ అమ్మిన మాజీ సైనిక అధికారి మరణించాడు.
మాజీ సైనిక అధికారి భూమి అమ్మిన అనంతరం కొంతకాలానికి చనిపోగా.. అదే నాలుగెకరాల భూమిని ఆయన కుటుంబ సభ్యులు నర్సంపేట పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు పెండెం రామానంద్ ఆయన స్నేహితులకు అమ్మారు. దీంతో ఇది వరకు వాళ్లు ఆ భూమి తమదేనంటూ అక్కడికి వెళ్లగా.. రామస్వామి నాయక్ తరఫు వ్యక్తులు అడ్డుకున్నారు. దీంతో భూమి విషయమై ఇప్పటికీ పలుమార్లు రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది.
ఇరువర్గాల మధ్య భూ పంచాయితీ నడుస్తుండగా.. మంగళవారం ఒక వర్గానికి చెందిన వ్యక్తులు అదే భూమిలో మట్టిపోసి చదును చేయిస్తున్నట్టుగా తెలుసుకుని మరో వర్గానికి చెందినవాళ్ళు అక్కడికి చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య మొదట వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత అది కాస్త చిలికి చిలికి గాలి వానగా మారింది.
ఇరువర్గాల నడుమ మాటామాటా పెరిగి ఘర్షణ వాతావరణం తలెత్తింది. అప్పటికే రెండు వర్గాల నాయకులు కంట్రోల్ తప్పి ప్రవర్తిస్తుండటంతో స్థానికులు నర్సంపేట పోలీసులకు సమాచారం అందించారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. అప్పటికే పరిస్థితి చేయి దారిపోగా.. ఇరువర్గాల వాళ్లు ఒకరికి ఒకరు రాళ్ల దాడికి దిగారు.
పరస్పర దాడుల్లో ఇద్దరు, ముగ్గురి తలలకు గాయాలయ్యాయి. దీంతో అక్కడ వాతావరణం అంతా రణరంగంగా మారగా.. పోలీసులు లాఠీలకు పని చెప్పే పరిస్థితి తలెత్తింది. అయినా పోలీసులు లాఠీలతో ఇరువర్గాల వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయినా కొంతమంది ఆగకుండా రాళ్లు రువ్వడంతో అక్కడ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్న ఎస్సై రవికుమార్ కాలికి గాయమైంది.
దీంతో ఆయనను గమనించిన పోలీస్ సిబ్బంది అక్కడి నుంచి తీసుకెళ్లారు. దాదాపు గంటన్నర పాటు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగా.. ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, ఏసిపి కిరణ్ కుమార్, రెవెన్యూ ఆఫీసర్లు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. భూ హక్కు పత్రాలతో కోర్టుకు వెళ్లి సమస్యను పరిష్కరించుకోవాలని ఇరువర్గాలను సముదాయించి గొడవను సద్దుమణిగించారు. ఇలా ప్రత్యక్ష దాడులకు పాల్పడి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దీంతో ఇరువర్గాలు సైలెంట్ అవగా.. భూ వివాదంలో తలెత్తిన ఘర్షణకు టెంపరరీగా తెరపడినట్లైంది.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం