Ashada Bonalu 2023 : 'ఇక బోనమెత్తుడే'... ఈనెల 22 నుంచి ఆషాడ బోనాలు షురూ-ashada bonalu will start from 22 june 2023 in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ashada Bonalu 2023 : 'ఇక బోనమెత్తుడే'... ఈనెల 22 నుంచి ఆషాడ బోనాలు షురూ

Ashada Bonalu 2023 : 'ఇక బోనమెత్తుడే'... ఈనెల 22 నుంచి ఆషాడ బోనాలు షురూ

Ashada Bonalu in Telangana:ఈనెల 22 వ తేదీ నుండి ఆషాడ బోనాలు షురూ కానున్నాయి. ఈ మేరకు పలు ఆలయాల వద్ద అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.

ఆషాడ బోనాలు (ఫైల్ పండగ)

Ashada Bonalu 2023 in Hyderabad: భాగ్యనగరంలో బోనాల పండగ సందడి మొదలుకాబోతుంది. ఇందుకు సంబంధించిన తేదీలను ఇప్పటికే ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. జూన్ 22 నుండి ఆషాడ బోనాలు ప్రారంభం కానున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించింది. తాజాగా ఏర్పాట్లపై వివిధ శాఖ అధికారులతో మంత్రి సమీక్షలు జరిపారు. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.

గోల్కొండలో ప్రారంభం….

మొట్టమొదటగా గోల్కొండ బోనాలు ప్రారంభం కానున్నాయి. లంగర్ హౌస్ లో నిర్వహించే గోల్కొండ బోనాల తొట్టెల ఊరేగింపు లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. లక్షలాదిగా వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లు చేయటంపై సర్కార్ దృష్టి పెట్టింది. ఆషాడ బోనాల ఉత్సవాలతో జంటనగరాలు... నెల రోజులపాటు సందడిగా మారనున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించారు. ఈ సంవత్సరం బోనాల ఉత్సవాల నిర్వహణకు 15 కోట్ల రూపాయలను సర్కార్ కేటాయించినట్లు మంత్రి తలసాని ప్రకటించారు.

బోనాల నేపథ్యం…?

సంప్రదాయానికి చిహ్నం.. బోనం. స్త్రీమూర్తులే త‌యారు చేస్తారు. గ్రామ దేవ‌త‌ల‌కు ప‌సుపు కుంకుమ‌లు, చీర‌సారెలు, భోజ‌న నైవేద్యాల‌తో మొక్కులు చెల్లిస్తారు. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, ముత్యాల‌మ్మ, పెద్దమ్మ.. గ్రామ దేవతలను తమను చల్లంగా చూడలమ్మా అంటూ.. వేడుకుంటారు. గ్రామానికి, కుటుంబానికి ఎలాంటి.. ఆపద రాకూడదని మెుక్కుకుంటారు. అయితే ఈ బోనాలు.. తెలంగాణతోపాటుగా.. ఏపీలోని రాయలసీమ, కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లోనూ చేసుకుంటారు.

అన్నం, పాలు, పెరుగుతో కూడిన బోనాన్ని అమ్మవారి కోసం మ‌ట్టి లేదా రాగికుండలో వండుతారు. ఆ త‌ర్వాత‌ బోనాల కుండ‌ల‌ను వేప రెమ్మలతో, ప‌సుపు, కుంకుమ‌తో అలంక‌రిస్తారు. కుండపైన ఒక దీపం కనిపిస్తూ ఉంటుంది. వాటిని నెత్తిన పెట్టుకుని.. డ‌ప్పు చ‌ప్పుళ్ల మధ్య మ‌హిళ‌లు ఆల‌యానికి తీసుకెళ్తారు. బోనాల కుండ‌ల‌ను నైవేద్యంగా స‌మ‌ర్పిస్తారు. గ్రామాల్లో దీన్నే పెద్ద పండుగ, ఊర పండుగ అని కూడా పిలుస్తుంటారు. రంగం పేరిట భ‌విష్యవాణి చెప్పే ఆచార‌ం ఈ బోనాల పండుగ‌లో కనిపిస్తుంది. జాన‌ప‌ద క‌ళ‌లు, డ‌ప్పుల చ‌ప్పుళ్లు, శివ‌స‌త్తుల విన్యాసాల‌తో పండగ వాతావరణం ఉంటుంది.

భాగ్యనగరం విషయానికొస్తే.. 1869లో జంట‌న‌గ‌రాల్లో ప్లేగు వ్యాధి మ‌హ‌మ్మారి వ్యాపించింది. వేలాది మంది పిట్టల్లా రాలిపోయారు. దైవాగ్రహాంతో ఇలా జరుగుతుందని.. ప్రజలు భావించారు. గ్రామ దేవ‌త‌ల‌ను శాంత‌ప‌రచ‌డానికి ప్లేగు వ్యాధి నుంచి త‌మ‌ను తాము కాపాడుకోవ‌డానికి చేప‌ట్టిన పండగే బోనాలు అని చెబుతుంటారు. 1675లో గోల్కొండ‌ను పాలించిన ల‌బుల్ హాస‌న్ కుతుబ్ షా ( తానీషా ) కాలంలో బోనం పండుగ హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైన‌ట్టు కూడా చరిత్ర చెబుతోంది. రుతుప‌వ‌నాలు ప్రవేశించి.. వ‌ర్షా కాలం మెుదలుకాగాననే.. మ‌లేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు వస్తాయి. వాటితోపాటుగా సీజ‌న‌ల్ అంటువ్యాధులు బాధిస్తాయి. ఈ వ్యాధుల నివార‌ణ‌కు బోనాల పండుగ‌కు కూడా సంబంధం ఉంది. వేప ఆకు క్రిమినాశినిగా ప‌నిచేస్తుందన్న విషయం తెలిసిందే. అందుకే రోగ నిరోధ‌క‌త కోస‌మే ఇంటికి వేప తోర‌ణాలు క‌డ‌తారు. బోనం కుండ‌కు వేప ఆకులు కడతారు. బోనం ఎత్తుకున్న మ‌హిళలు వేప ఆకులు ప‌ట్టుకుంటారు. ప‌సుపు నీళ్లు చల్లుతారు. ఇలా బోనాలకు వందల ఏళ్ల చరిత్ర ఉంది.