Liquor Case : పిళ్లై వాంగ్మూలం ఎందుకు వెనక్కి తీసుకున్నారో అర్థం అవుతోందన్న ఈడీ-arun ramachandra pillai ed custody extended till march 16 in delhi liquor case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Arun Ramachandra Pillai Ed Custody Extended Till March 16 In Delhi Liquor Case

Liquor Case : పిళ్లై వాంగ్మూలం ఎందుకు వెనక్కి తీసుకున్నారో అర్థం అవుతోందన్న ఈడీ

HT Telugu Desk HT Telugu
Mar 13, 2023 05:07 PM IST

Liquor Case : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరుణ్ పిళ్లై ఈడీ కస్టడీని మరో మూడు రోజులు పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. కేసు కీలక దశలో పిళ్లై తన వాంగ్మూలాన్ని ఎందుకు వెనక్కి తీసుకున్నారో అర్థం అవుతోందని ఈడీ వ్యాఖ్యానించింది. మరోవైపు.. బుచ్చిబాబుతో కలిపి పిళ్లైను విచారించేందుకు ఈడీ సిద్ధం అవుతోంది.

అరుణ్ పిళ్లై ఈడీ కస్టడీ పొడిగింపు
అరుణ్ పిళ్లై ఈడీ కస్టడీ పొడిగింపు

Liquor Case : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ కేసులో కీలక వ్యక్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైకి ఈడీ కస్టడీ మరో 3 రోజులు పొడిగించింది న్యాయస్థానం. కస్టడీ మార్చి 16 వరకు పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అనంతరం మద్యం కుంభకోణం కేసు విచారణను మార్చి 16కు వాయిదా వేసింది. ఈ కేసుకి సంబంధించి గతంలో ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొంటూ అరుణ్ పిళ్లై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషన్ పై స్పందించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఈ విషయంపై సోమవారం (మార్చి 13న) విచారణ సందర్భంగా వాదనలు వినిపించిన ఈడీ తరపు న్యాయవాదులు కీలక వ్యాఖ్యలు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

కీలక సమయంలో వాంగ్మూలం ఉపసంహరణకు పిళ్లై పిటిషన్‌ వేశారని ఈడీ పేర్కొంది. బలవంతం చేసి పిళ్లై వాంగ్మూలం రికార్డు చేయలేదని తెలిపింది. పిళ్లై విచారణకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఉందని... వాంగ్మూలం నమోదులో నిబంధనలు పాటించామని స్పష్టం చేసింది. ముడుపుల వ్యవహారంలో పిళ్లై కీలకపాత్ర పోషించారన్న ఈడీ... దిల్లీ లిక్కర్‌ పాలసీ రూపకల్పనలో పిళ్లై, బుచ్చిబాబు భాగస్వాములని వివరించింది. 2022 సెప్టెంబర్ 18న పిళ్లై పూర్తి స్టేట్ మెంట్ ఇచ్చారని.. తదుపరి విచారణలోనూ ఇవే వివరాలను ధృవీకరించారని పేర్కొంది. కేసు కీలక దశకు చేరుకున్న సమయంలో ఆయన స్టేట్ మెంట్ మార్చుకున్నారని... ఇలా ఎందుకు చేశారో అర్థం అవుతోందని ఈడీ వ్యాఖ్యానించింది. ఒక బలమైన వ్యక్తిని విచారించేందుకు నోటీసులు జారీ చేయగానే పిళ్లై వాంగ్మూలం మార్చుకున్నారని ... కనుక కోర్టు అన్ని అంశాలను పరిశీలించాలని ఈడీ తరపు న్యాయవాదులు న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. పిళ్లై నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని.. కస్టడీని పొడిగించాలని కోరారు.

ఈడీ వాదనలపై అభ్యంతరం వ్యక్తం చేసిన పిళ్లై న్యాయవాదులు... ఈడీ ఇప్పటికే 29 సార్లు విచారణకు పిలిచిందని పేర్కొన్నారు. పిళ్లై వాంగ్మూలాన్ని 11 సార్లు నమోదు చేశారని వెల్లడించారు. మొత్తం 36 సార్లు పిళ్లై కేసు విచారణకు హాజరయ్యారన్నారు. విచారణకు అన్ని విధాలా సహకరిస్తున్నామని... ఇతర నిందితులతో కలిపి ప్రశ్నిస్తే న్యాయవాది ఉండాలని కోర్టుని అభ్యర్థించారు. ఇరువురి వాదనలు నమోదు చేసుకున్న కోర్టు... పిళ్లై ఈడీ కస్టడీని మరో 3 రోజులు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు.. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుకి ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. మార్చి 15న విచారణకు రావాలని ఆదేశించింది. ఈ క్రమంలో... అరుణ్ పిళ్లైతో కలిపి బుచ్చిబాబుని విచారించే అవకాశం ఉంది. మార్చి 16న మరోసారి విచారణకు హాజరుకావాలని ఎమ్మెల్సీ కవితను ఈడీ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఆ రోజు అరుణ్ పిళ్లైతో కలిపి కవితను ఈడీ విచారించే అవకాశం ఉంది.

WhatsApp channel