రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడానికి.. ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద లబ్ధిదారులకు రాయితీపై రుణాలు ఇవ్వనున్నారు. ఆ రుణాలతో సొంతంగా వ్యాపారాలను ప్రారంభించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ పూర్తయ్యింది. జూన్ 2న మంజూరు పత్రాలు ఇవ్వనున్నారు.
ఈ పథకానికి సంబంధించి తొలుత కేటగిరీ 1, 2 కింద రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కేటగిరీల్లో ఆశించిన దానికంటే తక్కువగా దరఖాస్తులు వచ్చాయి. దీంతో అందరు దరఖాస్తుదారులకు లబ్ధి చేకూరేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. కేటగిరీ-1 కింద వంద శాతం రాయితీతో రూ.50 వేల విలువైన యూనిట్లు, కేటగిరీ-2 కింద 90 శాతం రాయితీతో రూ.లక్ష విలువైన యూనిట్లు మంజూరు కానున్నాయి.
రాజీవ్ యువ వికాసం పథకానికి మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ లబ్ధిదారులు 16.23 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఇందులో 1.32 లక్షల దరఖాస్తులు కేటగిరీ-1, 2 కింద వచ్చాయి. ఈ కేటగిరీల కింద 2.8 లక్షల మందికి సహాయం చేయాలన్నది లక్ష్యం. ఇందుకోసం ప్రభుత్వం అనుమతులు కూడా మంజూరు చేసింది. కానీ దరఖాస్తులు ఆశించిన దాంట్లో సగం కూడా రాలేదు.
ఎస్టీ కార్పొరేషన్ పరిధిలో రెండు కేటగిరీల కింద దాదాపు 62 వేల మందికి లబ్ధి చేకూర్చాలని భావిస్తే.. 4 వేల మంది కూడా దరఖాస్తు చేసుకోలేదు. ఈబీసీ కేటగిరీలోనూ 33 వేల మందికి లక్ష్యంగా పెట్టుకుంటే.. 2,500 దరఖాస్తులు కూడా రాలేదు. మొత్తంగా అన్ని కార్పొరేషన్ల పరిధిలో కేటగిరీ-1, 2 కింద నిర్ణయించిన లక్ష్యంలో సగం దరఖాస్తులు కూడా రాలేదు. ఈ నేపథ్యంలో.. ఈ కేటగిరీల కింద దరఖాస్తు చేసినవారికి రుణాలిచ్చి.. మిగతా నిధుల్ని కేటగిరీ-3, 4 రుణాల కింద సర్దుబాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ పథకం కింద రూ.4 లక్షల విలువైన యూనిట్ల కోసం దరఖాస్తులు అత్యధికంగా వచ్చాయి.
సంబంధిత కథనం