ములుగు జిల్లాలో టెన్షన్.. టెన్షన్.. కర్రెగుట్టల్లోకి మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా దళం! ఎవరీ హిడ్మా?-armed forces searching for maoists in karre gutta forest of mulugu district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ములుగు జిల్లాలో టెన్షన్.. టెన్షన్.. కర్రెగుట్టల్లోకి మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా దళం! ఎవరీ హిడ్మా?

ములుగు జిల్లాలో టెన్షన్.. టెన్షన్.. కర్రెగుట్టల్లోకి మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా దళం! ఎవరీ హిడ్మా?

మావోయిస్టులు అనే పదం వినపడకూడదని కేంద్రం కంకణం కట్టుకుంది. దీంతో ఆపరేషన్ కగార్ పేరుతో.. ఏరివేత ముమ్మరంగా సాగుతోంది. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. తాజాగా.. ములుగు జిల్లాల్లోని కర్రెగుట్టలను సాయుధ బలంగాలు చుట్టుముట్టాయి.

హిడ్మా

ములుగు జిల్లా వెంకటాపురం సమీపంలోని కర్రెగుట్టలను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ వైపుగా విస్తరించి ఉన్న కర్రెగుట్టల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు ఉన్నట్టు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. బచావో కర్రెగుట్టలు పేరుతో.. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ పోలీసుల జాయింట్‌ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. కర్రెగుట్టల వైపు ఆదివాసులు రావద్దు అంటూ.. ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు మావోయిస్టులు.

హిడ్మా దళం ఉందని అనుమానాలు..

ములుగు జిల్లా కర్రెగుట్టల్లోకి మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా దళం వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో కర్రెగుట్టలను సాయుధ బలగాలు జల్లెడ పడుతున్నాయి. కర్రెగుట్టల ప్రాంతంలో సోమవారం అర్థరాత్రి నుండి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. వెంకటాపురం మండలంలో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. అడవుల్లోకి దాదాపు 2 వేల మంది కూబింగ్ కోసం వెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో వెంకటాపురం మండలంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.

హిడ్మా నేపథ్యం..

మాడ్వి హిడ్మా (కొన్నిసార్లు హిడ్మాలు, సంతోష్ అని కూడా పిలుస్తారు). ఛత్తీస్‌గఢ్‌లోని దక్షిణ సుక్మాలోని పుర్వతి గ్రామం హిడ్మా జన్మించారు. ప్రస్తుతం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) కేంద్ర కమిటీలో అతి పిన్న వయస్కుడైన సభ్యుడు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ నెంబర్ 1కి కమాండర్గా కూడా పనిచేస్తున్నాడు. ఫిబ్రవరి 2025 నాటి సమాచారం ప్రకారం.. అతన్ని ఆ బాధ్యతల నుండి తొలగించి, పటిరామ్ మాంఝీకి ఆ బాధ్యతలు అప్పగించారు. అయినప్పటికీ హిడ్మా కేంద్ర కమిటీలో సభ్యునిగా కొనసాగుతున్నాడు.

వ్యూహాల్లో నిష్ణాతుడు..

హిడ్మా 10వ తరగతి వరకు చదువుకున్నాడు. అనంతరం మావోయిస్ట్ పార్టీలో చేరాడు. గెరిల్లా యుద్ధతంత్రంలో, సైనిక వ్యూహాలలో నిష్ణాతుడుగా ఎదిగాడు. ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలపై జరిగిన అనేక దాడులకు హిడ్మా సూత్రధారిగా అనుమానిస్తున్నారు. 2013లో దర్భా లోయలో జరిగిన నక్సల్ దాడి, ఏప్రిల్ 2010లో దంతెవాడలో జరిగిన మావోయిస్ట్ దాడి వంటి ముఖ్యమైన ఘటనలు ఉన్నాయి. మొత్తంగా 26 వేర్వేరు దాడుల్లో అతనికి ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది.

చర్చలు జరపండి..

ఇటు కర్రెగుట్టలను సాయుధ బలగాలు చుట్టుముట్టడంపై తెలంగాణ పౌర హక్కుల సంఘం స్పందించింది. పదివేల మంది పోలీస్ బలగాలు చుట్టుముట్టి.. జరుపుతున్న కాల్పులను నిలిపివేయాలని కోరింది. మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలని డిమాండ్ చేసింది. దీనిపై ఇటు ప్రభుత్వం కానీ.. అటు పోలీస్ బలగాలు కానీ.. స్పందించలేదు.

మావోయిస్టుల లేఖ..

కర్రెగుట్టలోకి ఆదివాసీలు రావొద్దని ఇటీవల మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో.. పోలీసులు డబ్బులు ఇచ్చి, మాయమాటలు చెప్పి అమాయక ఆదివాసీలను ఇన్ఫార్మర్లుగా మారుస్తున్నారని మావోయిస్టులు ఆరోపించారు. పోలీసులు చెప్పే మాటలు నమ్మి కర్రెగుట్ట ప్రాంతానికి రావొద్దని, అలా వస్తే ప్రాణాలు కోల్పోతారని హెచ్చరించారు. కర్రెగుట్ట ప్రాంతంలో పోలీసులు ఆపరేషన్ కగార్ పేరుతో దాడులు చేస్తున్నారని, దీనికి ప్రతిగా తమను తాము రక్షించుకోవడానికి ఆ ప్రాంతంలో బాంబులు అమర్చామని కూడా మావోయిస్టులు స్పష్టం చేశారు.

సంబంధిత కథనం