అవినీతి అధికారి ఇంట్లో అక్రమంగా బుల్లెట్లు.. ఖాళీ షెల్స్‌.. సూర్యాపేట డిఎస్పీపై మరో కేసు నమోదు-another case registered against suryapet dsp for storing illegal bullets empty shells in residence ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  అవినీతి అధికారి ఇంట్లో అక్రమంగా బుల్లెట్లు.. ఖాళీ షెల్స్‌.. సూర్యాపేట డిఎస్పీపై మరో కేసు నమోదు

అవినీతి అధికారి ఇంట్లో అక్రమంగా బుల్లెట్లు.. ఖాళీ షెల్స్‌.. సూర్యాపేట డిఎస్పీపై మరో కేసు నమోదు

Sarath Chandra.B HT Telugu

నకిలీ డాక్టర్‌ను రిమాండ్‌కు పంపకుండా ఉండేందుకు లంచం డిమాండ్‌ చేసి ఏసీబీకి చిక్కిన సూర్యాపేట డిఎస్పీపై మరో కేసు నమోదైంది. డిఎస్పీ నివాసంలో జరిపిన సోదాల్లో అక్రమంగా నిల్వ చేసిన బుల్లెట్లు ఖాళీ షెల్స్‌ బయట పడటంతో డిఎస్పీ పార్థసారథిపై మరో కేసు నమోదు చేశారు.

డిఎస్పీ నివాసంలో అనధికారిక బుల్లెట్లు స్వాధీనం

లంచం తీసుకుంటూ తెలంగాణ ఏసీబీకి పట్టుబడిన పోలీసు అధికారిపై అక్రమంగా బుల్లెట్లు ఉన్నాయనే అభియోగంపై మరో కేసు నమోదైంది.

ఏసీబీ అరెస్ట్ చేసిన సూర్యాపేట డిఎస్పీ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ జరిపిన సోదాల్లో 21 బుల్లెట్లు, 69 ఖాళీ బుల్లెట్‌ షెల్స్ లభించాయి. దీంతో ఏసీబీ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

సూర్యాపేట పట్టణంలో నకిలీ డాక్టర్ల నుంచి లంచం డిమాండ్ చేసిన డిప్యూటీ సూపరింటెండెంట్, ఇన్స్పెక్టర్లను ఏసీబీ అధికారులు సోమవారం అరెస్టు చేశారు.

ఫిర్యాదుదారుడి నుంచి తొలుత రూ.25 లక్షలు లంచం డిమాండ్ చేయడంతో సూర్యాపేట సబ్ డివిజన్ డిప్యూటీ సూపరింటెండెంట్, సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్‌లను అరెస్టు చేశామని, ఫిర్యాది అభ్యర్థన మేరకు రూ.16 లక్షలకు దానిని కుదించారని ఏసీబీ ఒక ప్రకటనలో తెలిపింది.

నిందితుడిని అరెస్టు చేయకుండా నోటీసులు జారీ చేయడం, స్కానింగ్ సెంటర్ నిర్వహణలో అనుమతించడం వంటి చర్యలకు డిఎస్పీ పాల్పడ్డారని ఆరోపించింది.

ఏసీబీకి చిక్కిన సూర్యాపేట డిఎస్పీ, సీఐ

ఫేక్ డాక్టర్లను అరెస్ట్‌ చేసి కటకటాల్లోకి పంపాల్సిన పోలీసులు వారితో బేరం కుదుర్చుకున్నారు. లంచం డబ్బుల కోసం ఒత్తిడి చేయడంతో నిందితులు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో వలపన్నిన ఏసీబీ అధికారులు సూర్యాపేట డిఎస్పీ, సీఐలను పట్టుకున్నారు.

సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, సీఐ రాఘవులు లంచం తీసుకుంటూ సోమవారం అవినీతి నిరో ధక శాఖ అధికారులకు చిక్కారు. సూర్యాపేటలోని రెండు ప్రైవేటు హాస్పటల్స్‌తో పాటు ఒక స్కానింగ్ సెంటర్‌ను నకిలీ ధ్రువీకరణ పత్రాలతో ఏర్పాటు చేసినట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు ఏప్రిల్‌ 23న ఫిర్యాదు చేశారు.

ఐఎంఏ ఫిర్యాదుతో సూర్యాపేట టూటౌన్‌లో ముగ్గురు నకిలీ వైద్యులపై కేసు నమోదు చేశారు. స్కానింగ్‌ సెంటర్‌ను సీజ్ చేశారు. ఈ కేసులో నిందితులను రిమాండుకు తరలించకుండా ఉండాలంటే సూర్యాపేట డీఎస్పీ పార్థసారథితో మాట్లాడుకోవాలని ముగ్గురు నిందితుల్లో ఒకరికి సూర్యాపేట సీఐ వీర రాఘవులు సూచించారు.

దీంతో డిఎస్పీని సంప్రదించడంతో రిమాండ్‌ లేకుండా చేయాలంటే రూ. 25 లక్షలు ఇవ్వాలని నకిలీ వైద్యుడిని డీఎస్పీ డిమాండ్ చేశారు. చివరికి రూ.16 లక్షలు ఇచ్చేలా డిఎస్పీతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఈ క్రమంలో డబ్బులు త్వరగా ఇవ్వాలని పోలీసులు ఒత్తిడి పెంచడంతో నల్గొండలోని ఏసీబీ అధికారులను నకిలీ వైద్యుడు ఫిర్యాదు చేశాడు.బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అదనపు ఎస్పీ కమలాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం డిఎస్పీ, సీఐలను అదుపులోకి తీసుకొని విచారించారు.

లంచం డిమాండ్ చేసినట్లు నిర్ధారణ కావడంతో వారిని అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. డిఎస్పీ, సీఐ ఇల్లు , కార్యాలయాలలో సోదాలు చేపట్టారు. డిఎస్పీ నివాసంలో ఏకంగా బుల్లెట్లు, ఖాళీ షెల్స్ లభ్యం కావడంతో వాటిని ఎందుకు నిల్వ చేశారనే దానిపై ఆరా తీస్తున్నారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం