November 26 Telugu News Updates : మర్డర్ ఎఫెక్ట్… ఆ గుత్తికోయల బహిష్కరణ!
తెలంగాణ, ఏపీ వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి. తాజా వార్తల కోసం రిఫ్రెష్ చేస్తూ ఉండండి.
Sat, 26 Nov 202203:50 PM IST
బహిష్కరణ…
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావుపై దాడి.. హత్య ఘటనను తీవ్రంగా ఖండిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు పంచాయతీ ఇవాళ కీలక తీర్మానం చేసింది. గుత్తి కోయలందర్నీ గ్రామం నుంచి బహిష్కరించాలని బెండాలపాడు గ్రామసభ తీర్మానించింది.
Sat, 26 Nov 202203:50 PM IST
షర్మిల ఫైర్…
టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు వైఎస్ షర్మిల.పాదయాత్రలో భాగంగా నర్సంపేటలో పర్యటించిన ఆమె... వర్షాలకు పంట నష్టపోయి ఏడాది కావొస్తున్నా కనీసం పరిహారం అందలేదని దుయ్యబట్టారు. మంత్రులు హెలికాప్టర్ లో తిరిగారు తప్పితే నయాపైసా ఇవ్వలేదన్నారు. తెలంగాణ సంపద మొత్తం కేసీఆర్ ఇంట్లోకే పోయిందని విమర్శించారు. దోచుకున్న డబ్బుతోనే బీఆర్ఎస్... అనే బందిపోట్ల రాష్ట్ర సమితి పెట్టారని ధ్వజమెత్తారు. తెలంగాణను ఆగంజేసి, దేశాన్ని ఏలబోతాడట దొర అంటూ మండిపడ్డారు.
Sat, 26 Nov 202202:15 PM IST
మరో కీలక నిర్ణయం…
TSRTC Latest News: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని విద్యార్థులకు మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్. మెట్రో కాంబినేషన్ టికెట్ ధరను రూ.20 నుండి రూ.10 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల సౌకర్యార్థం కోసం తగ్గించినట్లు ప్రకటించింది. సిటీ బస్ పాస్ కలిగిన విద్యార్థులు మెట్రో సర్వీసుల్లో ప్రయాణించాలంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని వెల్లడించింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు.
Sat, 26 Nov 202201:44 PM IST
టిఫా కేంద్రాలు
Telangana: ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు వేస్తోంది తెలంగాణ సర్కార్. ఇప్పటికే పలు రోగుల సంక్షేమ కోసం పలు పథకాలను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తల్లీబిడ్డల సంరక్షణ కోసం మరో అడుగు ముందుకేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో టిఫా స్కానింగ్ సెంటర్లు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో 44 గవర్నమెంట్ ఆస్పత్రుల్లో 56 అత్యాధునిక టిఫా స్కానింగ్ సెంటర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావ్ ప్రారంభించారు.
Sat, 26 Nov 202212:23 PM IST
కీలక ప్రకటన
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు కీలక ప్రకటన చేశారు. ఈ నెల 28 నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రధాన టెర్మినల్ ద్వారానే విమాన సర్వీసులు ఉంటాయని స్పష్టం చేశారు. మధ్యాహ్నం 1 గంట నుంచే ప్రయాణికులు కొత్త టెరి్మనల్లోని డిపార్చర్ కేంద్రాన్ని వినియోగించుకోవాలని ఎయిర్ పోర్టు అధికారులు ట్వీట్ చేశారు. సాయంత్రం 5.30 గంటలకు సౌదీ ఎయిర్లైన్స్ విమానంతో కార్యకలాపాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని అధికారులు సూచించారు.
Sat, 26 Nov 202211:13 AM IST
విగ్రహావిష్కరణపై సీఎం ప్రకటన…
2023 ఏప్రిల్ లో విజయవాడలో అంబేద్కర్ మహా విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో కలిసి జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా భారతదేశంలో మార్పులు చోటు చేసుకునేందుకు వీలుగా రాజ్యాంగాన్ని రాసిన మహానుభావుడు అంబేడ్కర్ అని కొనియాడారు. 72 ఏళ్లుగా సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యాగతులను, భావజాలాలను రాజ్యాంగం మారుస్తూనే ఉందని చెప్పారు. రాజ్యాంగమే మన సంఘసంస్కర్త అని సీఎం జగన్ అన్నారు.
Sat, 26 Nov 202208:44 AM IST
మరో ప్రయోగం సక్సెస్…
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ)-సి54 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. పీఎస్ఎల్వీ సీ-54 రాకెట్ ద్వారా 9 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించారు.
Sat, 26 Nov 202208:41 AM IST
వివరాలు…
మొత్తం 25 శాఖల్లోని 91 విభాగాల్లో ఖాళీగా ఉన్న 6,859 జూనియర్ అసిస్టెంట్ పోస్టులతో పాటు పురపాలక శాఖలో 1,862 వార్డు అధికారుల పోస్టులు, ఆర్థికశాఖ, పురపాలకశాఖలో 429 జూనియర్ అకౌంటెంట్ పోస్టులు, ఆడిట్శాఖలో 18 మంది జూనియర్ ఆడిటర్ల నియామకానికి తెలంగాణ ఆర్థిక శాఖ అనుమతించింది. సదరు ఉద్యోగాల భర్తీకి వీలుగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Sat, 26 Nov 202207:40 AM IST
డిసెంబర్ 8న బీసీ ప్రజా ప్రతినిధుల సమావేశం
ఆంద్రప్రదేశ్లో ఉన్న బీసీ ప్రజాప్రతినిధులు అందరితో డిసెంబర్8న ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించాలని మంత్రులు, ప్రజా ప్రతినిధులు నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించాలని సిఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు.
Sat, 26 Nov 202207:30 AM IST
సిఎం క్యాంపు కార్యాలయంలో బీసీ నేతల భేటీ
సీఎం క్యాంప్ కార్యాలయంలో బీసీ ముఖ్యనేతలు మరికాసేపట్లో భేటీ అయ్యారు. . ఈ సమావేశానికి మంత్రులు బొత్స, బూడి ముత్యాలనాయుడు, వేణుగోపాలకృష్ణ, జయరాం, జోగి రమేష్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు అనిల్కుమార్ యాదవ్, పార్థసారథి, ఎంపీ మోపిదేవి హాజరయ్యారు. రానున్న రోజులలో బీసీల కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై చర్చించనున్నారు.
Sat, 26 Nov 202207:04 AM IST
వైసీపీ కేంద్ర కార్యాలయంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవం
వైసీపీ కేంద్ర కార్యాలయంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవం ఘనంగా నిర్వహించారు. - అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఆదిమూలపు సురేష్, చెల్లుబోయిన, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, వైసీపీ నేత జూపూడి తదితరులు హాజరయ్యారు.
Sat, 26 Nov 202207:03 AM IST
పార్టీ మారనున్న గంటా శ్రీనివాసరావు
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతున్నారని ప్రచారం మళ్లీ మొదలైంది. డిసెంబర్లో వైసీపీలో చేరేందుకు అవకాశాలున్నాయని ఆయన అనుచరులు ప్రచారం మొదలు పెట్టారు. డిసెంబర్ 1న గంటా బర్త్ డే తర్వాత నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.
Sat, 26 Nov 202206:46 AM IST
నింగిలోకి దూసుకెళ్లిన పిఎస్ఎల్వీ
పిఎస్ఎల్వీ సి-54 ఉపగ్రహం నింగిలోకి దూసుకువెళ్లింది. శ్రీహరికోట నుంచి నిర్వహించిన ప్రయోగం విజయవంతం అయ్యింది. ఈఓఎస్ శాట్-6 ఉపగ్రహంతో పాటు పాటు ఎనిమిది నానో ఉపగ్రహాలను పిఎస్ఎల్వీ సి-54 అంతరిక్షంలోకి మోసుకు వెళ్లింది.
Sat, 26 Nov 202205:43 AM IST
ఏపీ లో 6 గురు ఐఏఎస్ అధికారుల బదిలీ లు
ఏపీలో 6గురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఎన్. తేజ్ భరత్ ను తూర్పు గోదావరి జిల్లా జేసీ గా బదిలీ చేశారు. చామకురి శ్రీధర్ ను సీసిఎల్ఏలో విజిలెన్స్ జాయింట్ సెక్రటరీ గా పోస్టింగ్ ఇచ్చారు. అపరాజిత సింగ్ను కృష్ణా జిల్లా జేసీగా పోస్టింగ్ ఇచ్చారు. మహేష్ కుమార్కు పంచాయితీ రాజ్ శాఖ అదనపు కమిషనర్ గా బదిలీ చేశారు. టి.నిశాంతికి నంద్యాల జిల్లా జేసిగా పోస్టింగ్ ఇచ్చారు. ఎన్. మౌర్య నుు సాధారణ పరిపాలన శాఖ కు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Sat, 26 Nov 202205:07 AM IST
తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ దినోత్సవం
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్ పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి సీఎం జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
Sat, 26 Nov 202205:06 AM IST
అలిపిరి మెట్ల మార్గంలో భక్తుడు మృతి
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో భక్తుడు మృతి చెందాడు. మెట్లు ఎక్కుతుండగా గుండెపోటుతో భక్తుడు మృతి చెందాడు. ఆస్పత్రికి తరలించేలోపే భక్తుడు మృతిచెందాదు. మృతుడిని కరీంనగర్ ఫారెస్ట్ అధికారి శివప్రసాద్గా గుర్తించారు.
Sat, 26 Nov 202205:09 AM IST
ఉద్యోగులకు డిఏ మంజూరుకు సిఎం అమోదం
డీఏ మంజూరుకు సీఎం అంగీకారం తెలిపినట్లు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. 2023 జనవరి నుంచి ఒక డీఏ మంజూరుకు అంగీకారం తెలిపినట్లు ప్రకటించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది గ్రేడ్ల మార్పునకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ప్రకటించింది. గ్రేడ్-3 సర్వేయర్లను గ్రేడ్ 2గా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శులకు చిన్న పంచాయతీల బాధ్యతలు అప్పగించేందుకు సిఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది బదిలీకి సీఎం హామీ ఇచ్చినట్లు ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి తెలిపారు.