Amrutha On Pranay Case Verdict : మిర్యాలగూడ పరువు హత్య ప్రణయ్ కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఒకరికి ఉరి శిక్ష, ఆరుగురికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పుపై ప్రణయ్ సతీమణి అమృత తాజాగా స్పందించారు. సోషల్ మీడియాలో ఆమె పోస్టు పెట్టారు.
"నా నిరీక్షణకు తెరపడి న్యాయం జరిగింది. నా హృదయం ఉద్వేగంతో నిండిపోయింది. ఈ తీర్పు గౌరవం పేరుతో జరిగే నేరాలు, దౌర్జన్యాలను తగ్గించగలదని ఆశిస్తున్నాను. నా ప్రయాణంలో అచంచలమైన మద్దతునిచ్చిన మొత్తం పోలీసు శాఖ, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, మీడియా సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా బిడ్డ ఎదుగుతున్నాడు...కాబట్టి నా మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, అతని భవిష్యత్తును కాపాడుకోవడం కోసం నేను మీడియాలో కనిపించడం లేదా ప్రెస్ మీట్లు నిర్వహించడం లేదు. కాబట్టి మా గోప్యతను అర్థం చేసుకుని, గౌరవించవలసిందిగా కోరుతున్నాను. మీరు లేకుండా ఇది సాధ్యం కాదు. RIP ప్రణయ్"- అమృత
అమృత, ప్రణయ్ ల ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి వివాహం ఒప్పుకోని అమృత తండ్రి మారుతీరావు పథకం మేరకు ప్రణయ్ పరువు హత్య జరిగాయి. సెప్టెంబర్ 14, 2018న మిర్యాలగూడలో ప్రణయ్ హత్య జరిగింది. సీసీ కెమెరాల్లో ఈ ఘటన రికార్డు అవ్వడం, పరువు హత్య నేపథ్యంలో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యింది. ఆ సమయంలో అమృత ఐదు నెలల గర్భవతి, ఆసుపత్రికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రణయ్ పై దాడి చేసి హత్య చేశారు. సుమారు ఐదున్నరేళ్ల తర్వాత కోర్టు ఈ హత్య కేసుపై తీర్పు ఇచ్చింది.
ప్రస్తుతం అమృత, ప్రణయ్ దంపతుల కుమారుడికి ఆరు సంవత్సరాలు. కుమారుడితో కలిసి అమృత హైదరాబాద్లో నివసిస్తుంది. తన భర్త హత్య నుంచి క్రమంగా కోలుకున్న అమృత.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆమె ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. తరచుగా తన కొడుకు గురించి వీడియోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంటుంది. అమృత ఆన్లైన్లో చాలా యాక్టివ్గా ఉంటారు. ప్రణయ్ హత్య కేసులో నిందితులకు శిక్ష విధిస్తూ ఇటీవల కోర్టు తీర్పు ఇచ్చిన తరువాత అమృత, ప్రణయ్ కొడుకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సంబంధిత కథనం