Akbaruddin Owaisi in Assembly : శ్వేతప్రతంతో ఏం సందేశం ఇస్తున్నారు..? అక్బరుద్దీన్ సూటి ప్రశ్నలు
Telangana Assembly Sessions: కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై అసెంబ్లీ మాట్లాడారు అక్బరుద్దీన్ ఓవైసీ. ఈ సందర్భంగా పలు తప్పులను ఎత్తిచూపిన ఆయన.. సర్కార్ కు సూటిగా ప్రశ్నలు సంధించారు.
Akbaruddin Owaisi: కాంగ్రెస్ ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నలు సంధించారు అక్బరుద్దీన్ ఓవైసీ. శ్వేతపత్రంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో భాగంగా మాట్లాడిన ఆయన… తెలంగాణ దీవాలా తీసిందని చెప్పడం సరికాదన్నారు. శ్వేతపత్రంలోని అంకెలతో రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలకు తప్పుడు సంకేతాలు ఇవ్వవద్దని కోరారు. శ్వేత పత్రం ద్వారా… రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటోందని ప్రశ్నించారు. కాగ్ లో చెప్పిన లెక్కలు… శ్వేతపత్రంలోని పేర్కొన్న లెక్కలు పూర్తిగా తప్పుగా ఉన్నాయని కామెంట్స్ చేశారు. ఈ విషయంలో ఏ లెక్కలను నమ్మాలని ప్రశ్నించారు.

తెలంగాణ ముమ్మాటికీ ధనిక రాష్ట్రమే అని చెప్పే ప్రయత్నం చేశారు అక్బరుద్దీన్ ఓవైసీ. అప్పులు పెరిగినా అభివృద్ధి కూడా గణనీయంగా జరిగిందని గుర్తు చేశారు అక్బరుద్దీన్. 55 ఏండ్లలో జరగని అభివృద్ధి ఈ పదేండ్ల కాలంలో జరిగిందన్నారు. రాష్ట్రంలోనే కాదు కేంద్రంలోనూ అప్పులు పెరిగాయని… వాటిపై కూడా మాట్లాడాలని సూచించారు. రాజకీయ కోణం ఉండొచ్చు కానీ… కానీ మాకు రాష్ట్ర సమగ్రత, అభివృద్ధిని కాపాడటమే ఎంఐఎం కర్తవ్యమని చెప్పారు.
గత పదేళ్లలో అనేక రంగాల్లో తెలంగాణ ప్రగతిని సాధించిందని చెప్పారు అక్బరుద్దీన్ ఓవైసీ. ఈ విషయాన్ని కాదనలేమని చెప్పారు. వక్ఫ్ బోర్డు అంశాలపై విచారణ జరిపించాలని కోరారు. ఆలేరు ఎన్ కౌంటర్ పై విచారణ నివేదికను బహిర్గతమని చేయాలని డిమాండ్ చేశారు అక్బరుద్దీన్. రైతుబంధుతో పాటు పెన్షన్లను వెంటనే ఇవ్వాలని కోరారు.నగరంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపాలని సూచించారు అక్బరుద్దీన్.