ఏఐసీసీ కొత్త ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పనితీరుపై సమీక్షలు నిర్వహించనున్నారు. ఒక్కో లోక్సభ నియోజకవర్గ స్థాయిలో పార్టీ పనితీరును తెలుసుకునేందుకు గాంధీభవన్లో 4వ తేదీ నుంచి సమీక్షలు నిర్వహించనున్నారు. తొలుత మంగళవారం మెదక్, మల్కాజిగిరి; బుధవారం కరీంనగర్, ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గాల నేతలందరితో సమీక్షించనున్నారు.
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే సమీక్షలకు.. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలు, ఇతర ముఖ్యనేతలందరూ రావాలని ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లాయి. మీనాక్షి నటరాజన్ ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమితులైన తరవాత.. నిర్వహించబోతున్న తొలి సమీక్ష సమావేశాలు కావడంతో వీటికి ప్రాధాన్యం ఏర్పడింది.
అటు గాంధీభవన్కు చాలామంది నేతలు క్యూకడుతున్నారు. ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీ ఎన్నికలకు నలుగురు అభ్యర్థులను ఈ నెల 10లోగా పార్టీ ప్రకటించాల్సి ఉంది. వీటికి సంబంధించి పెద్దసంఖ్యలో నేతలు టికెట్లు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఇన్ఛార్జిని ప్రసన్నం చేసుకునేందుకు, తమ పనితీరును వివరించేందుకు నేతలు గాంధీభవన్ చుట్టూ తిరుగుతున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఇటీవల ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపింది. ఆ మేరకు కాంగ్రెస్లో పదవుల భర్తీ ఉంటుందని నేతలు చెబుతున్నారు. ప్రధానంగా మాల, మాదిగ వర్గాల నేతలకు ఎమ్మెల్సీ టికెట్లు, నామినేటెడ్, మంత్రి పదవుల భర్తీలో ఎస్సీ వర్గీకరణ ప్రకారం ప్రాధాన్యమిస్తారని ప్రచారం జరుగుతోంది. అటు తమకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని రెండు సామాజిక వర్గాల నేతలు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.
మాల, మాదిగలకు సంబంధించి.. ఒక వర్గానికి అవకాశమిస్తే మరో వర్గానికి ప్రభుత్వ సలహాదారు లేదా రాబోయే మంత్రివర్గ విస్తరణలో సర్దుబాటు చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఇక బీసీలకు ఎమ్మెల్సీ టికెట్లలో రెండు ఇవ్వాలని ఈ వర్గాల నేతలు పట్టుబడుతున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పూర్తయితే ఏయే వర్గాలకు అవకాశం ఇస్తారనేది తేలుతుంది.
ఇటు మిగిలిన సామాజిక వర్గాలకు నామినేటెడ్, మంత్రివర్గ విస్తరణ, పీసీసీ రాష్ట్ర కార్యవర్గ పదవులు ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. పీసీసీ రాష్ట్ర కార్యవర్గ కూర్పు కూడా ఈ నెల 20లోగా పూర్తవుతుందని నేతలు అంచనా వేస్తున్నారు. నామినేటెడ్ పదవుల్లో మిగిలిన వాటిని భర్తీ చేయడానికి జిల్లాల వారీగా ఈ నెల 10లోగా అర్హులను గుర్తించాలని.. ఇన్ఛార్జి మంత్రులకు పీసీసీ ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. వారు ఆ వివరాలు సేకరిస్తున్నారు.