తెలంగాణలో విద్యుత్ శాఖ నూతన సాంకేతికతను వినియోగించుకుంటోంది. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తోంది. తాజాగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లలో వేగం పెంచింది. దళారుల ప్రమేయం లేకుండా రైతులకు మేలు చేస్తోంది. అలాగే తన దరఖాస్తు స్థితిగతులను దరఖాస్తుదారుడే స్వయంగా తెలుసుకునేలా ఆన్లైన్ విధానాన్ని తీసుకువచ్చింది.
ప్రస్తుతం విద్యుత్ శాఖ నూతన సాంకేతికతతో రైతులకు వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లను త్వరగా మంజూరు చేస్తోంది. ఇందుకోసం రైతులు ఎన్పీడీసీఎల్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం రైతు మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. ఆ వెంటనే దరఖాస్తుదారుడి సెల్ ఫోన్కు సమాచారం అందుతుంది. దీని తర్వాత టీజీఎన్పీడీసీఎల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి.
యాప్ను ఓపెన్ చేస్తే అందులో ఎల్టీ న్యూ సర్వీస్ కనెక్షన్ విభాగం ఉంటుంది. దాంట్లో అగ్రికల్చర్ అనే ఆప్షన్ను ఎంచుకోవాలి. మీసేవ ద్వారా ఫోన్కు వచ్చిన నంబరును యాప్లో ఎంటర్ చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా కనెక్షన్ వివరాలు కనిపిస్తాయి. కనెక్షన్ మంజూరైతే ఆ సమాచారం యాప్లో కనిపిస్తుంది. అందులో కనెక్షన్కు అవసరమైన విద్యుత్తు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ఇతర సామాగ్రి వివరాలను పొందుపరుస్తారు.
ప్రస్తుతం ప్రభుత్వం రైతుకు ఒక కనెక్షన్కు రూ.75 వేల రాయితీ ఇస్తుంది. దానికంటే అధికంగా ఖర్చయినట్లయితే.. ఆ డబ్బులను దరఖాస్తుదారుడే భరించాలి. ఆ డబ్బులను 30 రోజుల్లో చెల్లించాలి. దాని తర్వాత దరఖాస్తు చేసుకున్న స్థలానికి అవసరమైన సామాగ్రి పంపిస్తారు. యాప్లో చెప్పిన సామాగ్రి వచ్చిందో రాలేదో దరఖాస్తుదారుడు సరిచూసుకోవచ్చు. తక్కువ సామగ్రి వస్తే అక్కడే సిబ్బందిని ప్రశ్నించవచ్చు. సకాలంలో కనెక్షన్ మంజూరు చేయకుంటే.. 1912 నంబరుకు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
గతంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం రైతులు ఏళ్ల తరబడిగా ఎదురుచూసేవారు. కానీ గడిచిన రెండేళ్ల నుంచి అధికారులు వేగం పెంచారు. ఈ స్టోర్ విధానం ద్వారా స్టోర్లోని మెటీరియల్ను విత్డ్రా చేసేవారు. ఇప్పుడు దరఖాస్తుదారుడికి కూడా తన దరఖాస్తు స్థితిగతులు తెలుస్తున్నాయి. అధికారులు ఎలాంటి సామాగ్రిని ఎంచుకున్నారు.. అదే సామాగ్రి క్షేత్రస్థాయికి వచ్చిందా లేదా అనే విషయాలు కూడా తెలుస్తాయి. దీంతో అంతా పారదర్శకంగా జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
సంబంధిత కథనం