ఖాళీ అయిన కాస్లీ లిక్కర్ బాటిల్స్లో.. చీప్ లిక్కర్ మిక్స్ చేసి అమ్ముతున్న ఇద్దరిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ట్రూప్స్ బార్లో ఈ కల్తీ లిక్కర్ బాగోతం బయటకు వచ్చింది. కల్తీ చేస్తున్న సత్యనారాయణ రెడ్డి, పునీత్ పట్నాయక్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ అధికారుల దాడుల్లో ఈ దందా వెలుగులోకి వచ్చింది.
రూ.2,690 విలువైన జెమిసన్ లిక్కర్ బాటిల్లో.. వెయ్యి రూపాయలకు వచ్చే ఓక్ స్మిత్ లిక్కర్ మిక్స్ చేస్తున్నారు. ఈ సమయంలో ఎక్సైజ్ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. చీప్ లిక్కర్తో నింపిన 75 బాటిళ్లను, 55 ఖాళీ సీసాలను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. బయట వైన్స్, ఇతర ఈవెంట్లలో లభించిన ఖాళీ మద్యం బాటిళ్లను కొనుగోలు చేసి ఈ దందా చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు.
ముందుగా నగరంలోని పలు వైన్స్, బార్ల నుంచి టీచర్స్, బ్లాక్ లేబుల్, జానీవాకర్, బ్లాక్డాగ్ వంటి ఖరీదైన బాటిళ్లను సేకరిస్తున్నారు. వాటిల్లో కొంత మేర మద్యాన్ని తీసేస్తున్నారు. ఆ తర్వాత కర్నాటక నుంచి తెప్పించిన తక్కువ ధర లిక్కర్తో నింపేస్తున్నారు. కలర్లో తేడా రాకుండా వాటర్, స్పిరిట్ మిక్స్ చేస్తున్నారు. ఇందుకోసం ఓ టీమ్ పని చేస్తోంది. బాటిళ్లపై మూతలను తొలగించేందుకు ఇతర రాష్ట్రాలకు చెందిన ఎక్స్పర్ట్స్ను తీసుకొచ్చారు. వారికి రోజుకు 8 గంటల పాటు పని కల్పిస్తున్నారు.
ఈ బాటిళ్ల మూతలు తొలగించినందుకు వారికి భారీ మొత్తంలోనే చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా తయారు చేసిన నకిలీ మద్యాన్ని.. నగర చుట్టుపక్కల ప్రాంతాల్లోని వైన్స్, బెల్ట్షాపులకు సరఫరా చేస్తున్నట్లు తేలింది. రూ.1,200 విలువైన బాటిల్ను రూ. 700కు, రూ. 2 వేలు విలువైన బాటిల్ను రూ.1,200 కే ఇస్తున్నారు. దీంతో మద్యం వ్యాపారులు, బెల్ట్ షాప్ నిర్వాహకులు కొనుగోలు చేసి.. సొమ్ము చేసుకుంటున్నారు.
ఇటీవల హైదరాబాద్ పోలీసులు, టాస్క్ఫోర్స్ టీమ్ తరచుగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న దుకాణాలపై దాడులు చేస్తున్నారు. కుల్సుంపురా, ఛత్రిన్కా, ముషీరాబాద్, కాచిగూడ ప్రాంతాల్లో దాడులు జరిగాయి. వీటిలో పెద్ద మొత్తంలో అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. కొంతమందిని అరెస్టు చేశారు.
నల్గొండ ప్రాంతంలో ఒక పెద్ద అక్రమ మద్యం తయారీ రాకెట్ను పోలీసులు ఛేదించారు. బ్రాండెడ్ సీసాలలో కల్తీ మద్యం నింపి బెల్ట్ షాపులు, వైన్ స్టోర్లకు సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. కల్తీ మద్యం వ్యాపారులు చౌకగా లభించే మద్యం కొనుగోలు చేసి, రాత్రి సమయంలో ఎక్కువ ధరకు అమ్ముకుంటూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారు.
సంబంధిత కథనం