Hyderabad : హయత్ నగర్ శివారులో రోడ్డు ప్రమాదం - అడిషనల్ డీసీపీ మృతి, రోడ్డు దాటుతుండగా ఘటన…!
Road accident at Hayathnagar : హయత్ నగర్ శివారులోని లక్ష్మారెడ్డిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటే క్రమంలో బస్సు ఢీకొట్టిన ఘటనలో అడిషనల్ డీసీపీ నందిశ్వర బాబ్జీ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ శివారులోని హయత్ నగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అడిషనల్ డీసీపీ మృతి చెందాడు. ఇవాళ ఉదయం మార్నింగ్ వాక్ కోసం వెళ్తుండగా… లక్ష్మారెడ్డిపాలెం వద్ద ఘటన జరిగింది.
రోడ్డు దాటే క్రమంలో….!
ప్రాథమిక వివరాల ప్రకారం…. నందీశ్వర బాబ్డీ(అడిషనల్ డీసీపీ) లక్ష్మారెడ్డి పాలెం సమీపంలోని మైత్రీ కుటీర్లో నివాసం ఉంటున్నారు. ఇవాళ ఉదయం మార్నింగ్ వాక్ కోసం ఇంటి నుంచి బయల్దేరారు. హైదరాబాద్-విజయవాడ హైవే రోడ్డును దాటే క్రమంలో లక్ష్మారెడ్డి పాలెం వద్ద ప్రమాదానికి గురయ్యాడు. ఏపీ ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో…. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్ కంట్రోల్ రూంలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. బాబ్జీ మృతితో పోలీస్ శాఖలో విషాదం అలుముకుంది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.