TG Ration Card : రేషన్ కార్డుల్లో కొత్త కుటుంబ సభ్యుల పేర్లు, ప్రాసెస్ ప్రారంభించిన పౌరసరఫరాల శాఖ-సన్నబియ్యంపై అప్డేట్
TG Ration Card Update : తెలంగాణలో రేషన్ కార్డుల ప్రక్రియ కొనసాగుతోంది. పాత రేషన్ కార్డుల్లో పేర్లు యాడ్ చేసేందుకు పౌరసరఫరాల శాఖ అవకాశం కల్పించింది. ప్రస్తుతానికి ఒక్కొక్కరిని మాత్రమే పాతకార్డుల్లో చేరుస్తున్నట్లు తెలుస్తోంది. రేషన్ కార్డులపై సన్నబియ్యం అందిచేందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తుంది.

TG Ration Card Update : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ, మార్పుచేర్పుల ప్రక్రియ కొనసాగుతోంది. మీసేవా కేంద్రాల్లో కొత్త కార్డులకు దరఖాస్తులను స్వీకరిస్తుండడంతో...ప్రజలు భారీగా క్యూకడుతున్నారు. రేషన్ కార్డులపై సన్నబియ్యం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు సన్నబియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 4.59 లక్షల టన్నుల సన్నబియ్యం సిద్ధం చేసినట్లు పౌరసరఫరాల శాఖ తెలిపింది. ఉగాది పండుగ సందర్భంగా రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించే అవకాశం ఉంది. రేషన్ కార్డులపై ఒక్కొక్కరికి నెలకు 6 కేజీల బియ్యం అందిస్తారు.
రేషన్ కార్డుల అప్డేట్
రేషన్ కార్డుల అప్డేట్ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. గత పదేళ్లుగా రేషన్ కార్డుల్లో మార్పుచేర్పులకు అవకాశం లేకపోవడం...భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇంట్లో కొత్తగా చేరిన సభ్యుల పేర్లు రేషన్ కార్డుల్లో చేర్చేందుకు అవకాశం లేకపోవడంతో ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలు అందడంలేదు. పెళ్లైన మహిళల పేర్లను పుట్టింటి రేషన్ కార్డుల్లో తొలగించారు కానీ అత్తారింటి కార్డులో జోడించేందుకు అవకాశం లేకపోయింది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు పౌరసరఫరాల శాఖ ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా లబ్ధిదారులను గుర్తించే పని చేపట్టింది. కొత్తగా పెళ్లైన మహిళల పేరును, ఇంట్లో పుట్టిన పిల్లల పేర్లను రేషన్ కార్డుల్లో నమోదు చేసేందుకు అవకాశం కల్పించారు.
రాష్ట్రంలో మొత్తం 18 లక్షల మందికి పైగా పేర్లను రేషన్ కార్డుల్లో చేర్చాలని 12 లక్షలకు పైగా కుటుంబాల నుంచి పౌరసరఫరాల శాఖకు దరఖాస్తులు వచ్చాయి. అధికారుల పరిశీలన అనంతరం 6.68 లక్షల కుటుంబాలు మాత్రమే మార్పులకు అర్హులని ప్రత్యేక సాఫ్ట్వేర్ తో గుర్తించారు. ఈ నెలాఖరు వరకు 1.30 లక్షల లబ్ధిదారుల పేర్లను పాతకార్డుల్లో కొత్తగా నమోదు చేయాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.
ప్రభుత్వంపై ఆర్థిక భారం
ఆధార్ నెంబర్ ఆధారంగా ఎక్కడేనా వారి పేర్లు ఇతర రేషన్ కార్డులో ఉన్నాయా అని విషయాన్ని సివిల్ సప్లై అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే ఒక్కో కుటుంబంలో ఇద్దరు నుంచి ముగ్గురు సభ్యుల పేర్లు చేర్చాలని దరఖాస్తులు వచ్చినా.. తొలి దశలో ఒక్కరినే చేర్చినట్లు తెలుస్తోంది. కొత్తగా చేర్చిన వారికి 6 కిలోల బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వంపై ఏడాదికి రూ.32 కోట్ల ఆర్థిక భారం పడుతుందని పౌరసరఫరాల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
సంబంధిత కథనం