నీటిపారుదల శాఖ గజ్వేల్ ఈఎన్సీ భుక్యా హరిరామ్ను ఏసీబీ అరెస్ట్ చేసింది. భారీగా అక్రమాస్తులు కూడబెట్టారనే అభియోగాలు వచ్చిన నేపథ్యంలో ఏసీబీ టీమ్ రంగంలోకి దిగింది. శనివారం ఉదయం నుంచి సోదాలు చేపట్టింది. ఆ తర్వాత హరి రామ్ ను అరెస్ట్ చేసినట్లు ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.
హరిరామ్ ఆస్తులకు సంబంధించిన ప్రాథమిక వివరాలను ఏసీబీ పేర్కొంది. అక్రమాస్తుల వాస్తవ విలువ భారీగా ఉంటుందని తెలిపింది. ఏసీబీ తెలిపిన కొన్ని వివరాల ప్రకారం… హరిరామ్ నివాసంతో ఆయన బంధువులకు సంబంధంచిన 13 స్థలాల్లో సోదాలు నిర్వహించారు. విలువైన స్థిర, చరాస్తులు ఉన్నట్లు తేలింది.
విలువైన గృహాలు 2, విల్లాలు 2, ఓపెన్ ప్లాట్లు -2, నిర్మాణంలో ఉన్న భవంతి -1, ఓపెన్ ఫ్లాట్స్ 2 ఉన్నాయి. ఇక 28.5 ఎకరాల వ్యవసాయ భూమి, ఒక ఫార్మ్ హౌస్ కలిగిన 6 ఎకరాల మామిడి తోట, ఒక వాణిజ్య స్థలము, రెండు వాహనాలు (ఒక బి.ఎం.డబ్ల్యూ సహా) మరియు బ్యాంకు నిల్వలతో పాటు బంగారు ఆభరణాలను కలిగి ఉన్నట్లు గుర్తించారు. భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించటంతో… నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. న్యాయస్థానం ముందు ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది.
మరోవైపు హరిరామ్ బినామీ ఆస్తుల వివరాలపై కూడా ఏసీబీ కన్నేసింది. మర్కుక్ మండల పరిధిలో వ్యవసాయ భూమి ఉందని గుర్తించగా… ఇందుకు సంబంధించి దస్త్రాలను ఎమ్మార్వో కార్యాలయంలో పరిశీలించినట్లు తెలిసింది. సోదాలు కొనసాగుతుండగా… ఈ కేసులో పలువురిని విచారించే అవకాశం ఉంది. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగానే వంద కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. పూర్తిస్థాయి విచారణ తర్వాత….. అధికారికంగా మరికొన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఈఎన్సీగా హరిరామ్ కీలకంగా వ్యవహరించారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ పై జస్టిస్ పీసీ చంద్రఘోష్ కమిషన్ విచారణ జరుపుతోంది. ఇందులో భాగంగా 2023 సెప్టెంబర్ 27న హరిరామ్ను కమిషన్ కూడా విచారించింది.