ఏసీబీ వలలో ఈఎన్సీ హరిరామ్ - 13 చోట్ల సోదాలు, భారీగా అక్రమాస్తులు...!-acb arrests gajwel enc bhookya hari ram in disproportionate assets case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఏసీబీ వలలో ఈఎన్సీ హరిరామ్ - 13 చోట్ల సోదాలు, భారీగా అక్రమాస్తులు...!

ఏసీబీ వలలో ఈఎన్సీ హరిరామ్ - 13 చోట్ల సోదాలు, భారీగా అక్రమాస్తులు...!

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గజ్వేల్‌ ఈఎన్‌సీ భూక్య హరిరామ్‌ను ఏసీబీ అరెస్ట్ చేసింది. దాదాపు 13 ప్రాంతాల్లో సోదాలు జరిపిన ఏసీబీ… ఆయనకు భారీగా ఆస్తులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించింది. ఈ సోదాలకు సంబంధించి ఏసీబీ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.

ఈఎన్‌సీ భూక్య హరిరామ్‌ అరెస్ట్ - భారీగా ఆస్తులు...!

నీటిపారుదల శాఖ గజ్వేల్‌ ఈఎన్‌సీ భుక్యా హరిరామ్‌ను ఏసీబీ అరెస్ట్ చేసింది. భారీగా అక్రమాస్తులు కూడబెట్టారనే అభియోగాలు వచ్చిన నేపథ్యంలో ఏసీబీ టీమ్ రంగంలోకి దిగింది. శనివారం ఉదయం నుంచి సోదాలు చేపట్టింది. ఆ తర్వాత హరి రామ్ ను అరెస్ట్ చేసినట్లు ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

భారీగా ఆస్తులు…!

హరిరామ్‌ ఆస్తులకు సంబంధించిన ప్రాథమిక వివరాలను ఏసీబీ పేర్కొంది. అక్రమాస్తుల వాస్తవ విలువ భారీగా ఉంటుందని తెలిపింది. ఏసీబీ తెలిపిన కొన్ని వివరాల ప్రకారం… హరిరామ్ నివాసంతో ఆయన బంధువులకు సంబంధంచిన 13 స్థలాల్లో సోదాలు నిర్వహించారు. విలువైన స్థిర, చరాస్తులు ఉన్నట్లు తేలింది.

విలువైన గృహాలు 2, విల్లాలు 2, ఓపెన్ ప్లాట్లు -2, నిర్మాణంలో ఉన్న భవంతి -1, ఓపెన్ ఫ్లాట్స్ 2 ఉన్నాయి. ఇక 28.5 ఎకరాల వ్యవసాయ భూమి, ఒక ఫార్మ్ హౌస్ కలిగిన 6 ఎకరాల మామిడి తోట, ఒక వాణిజ్య స్థలము, రెండు వాహనాలు (ఒక బి.ఎం.డబ్ల్యూ సహా) మరియు బ్యాంకు నిల్వలతో పాటు బంగారు ఆభరణాలను కలిగి ఉన్నట్లు గుర్తించారు. భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించటంతో… నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. న్యాయస్థానం ముందు ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది.

ఏసీబీ గుర్తించిన ఆస్తుల వివరాలు….

  • షేక్‌పేట్‌లో విల్లా
  • కొండాపూర్ వద్ద విల్లా
  • శ్రీనగర్‌లో ఫ్లాట్
  • మాదాపూర్‌లో ఫ్లాట్
  • నార్సింగిలో ఫ్లాట్
  • అమరావతిలో వాణిజ్య స్థలం
  • మర్కూక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి
  • పటాన్ చెరువులో 20 గుంటల భూమి
  • హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో 2 స్వతంత్ర గృహాలు
  • బొమ్మల్రామారం వద్ద మామిడి తోటతో 6 ఎకరాల విస్తీర్ణంలో 1 ఫామ్‌హౌస్
  • కొత్తగూడెంలో 1 భవనం నిర్మాణంలో ఉంది
  • కుత్బుల్లాపూర్ వద్ద ఓపెన్ ప్లాట్
  • మిర్యాలగూడలో ఓపెన్ ప్లాట్
  • ఒక BMW కారుతో సహా 2 నాలుగు చక్రాల వాహనాలు
  • బంగారు ఆభరణాలు
  • బ్యాంక్ డిపాజిట్లు

మరోవైపు హరిరామ్ బినామీ ఆస్తుల వివరాలపై కూడా ఏసీబీ కన్నేసింది. మర్కుక్ మండల పరిధిలో వ్యవసాయ భూమి ఉందని గుర్తించగా… ఇందుకు సంబంధించి దస్త్రాలను ఎమ్మార్వో కార్యాలయంలో పరిశీలించినట్లు తెలిసింది. సోదాలు కొనసాగుతుండగా… ఈ కేసులో పలువురిని విచారించే అవకాశం ఉంది. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగానే వంద కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. పూర్తిస్థాయి విచారణ తర్వాత….. అధికారికంగా మరికొన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఈఎన్సీగా హరిరామ్ కీలకంగా వ్యవహరించారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ పై జస్టిస్ పీసీ చంద్రఘోష్ కమిషన్ విచారణ జరుపుతోంది. ఇందులో భాగంగా 2023 సెప్టెంబర్ 27న హరిరామ్‌ను కమిషన్ కూడా విచారించింది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.