Stray Dog Attacks in Telangana : తెలంగాణలో వీధి కుక్కలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులు,వృద్దులపై వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. ఎక్కువ శాతం ఈ దాడులు హైదరాబాద్ లోనే జరుగుతున్నాయి. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారులపై దాడి చేస్తున్నాయి.
తాజాగా హైదరాబాద్ లోని జవహర్ నగర్ పరిధిలోని ఆదర్శ్ నగర్ కాలనీలో విహాన్ అనే రెండేళ్ల బాలుడు పై వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. అనంతరం బాలుడిని కొంత దూరం వరకు లాకెళ్ళాయి. గమనించిన స్థానికులు కుక్కలను తరిమి....ఇంట్లో వాళ్లకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన బాలుడు విహన్ ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించగా అక్కడ పరిస్థితి విషమించి విహన్ మృతి చెందాడు.
కాగా జవహర్ నగర్లో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి అని స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోవడం లేదని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జగిత్యాల జిల్లా, బీర్పూర్ మండలం,మంగేలా గ్రామానికి చెందిన పెండ్రం మారుతీ కుమారుడు దేవేందర్ (7) తమ ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో ఓ పిచ్చి కుక్క బాలుడిపై దాడి చేసింది.
ఈ దాడిలో దేవేందర్ చేయి,కాలుకి తీవ్రంగా గాయాలయ్యాయి. దాడి చేసిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. గమనించిన స్థానికులు కుక్కను తరిమి హుటాహుటిన బాలుడిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఇదిలా ఉంటే మంగేల గ్రామంలో కూడా పిచ్చి కుక్కల బెడద ఎక్కువగా ఉందని, అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
వీధి కుక్కలు దాడి చేసి రెండేళ్ల బాలుడిని చంపేసిన ఘటనపై సిఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని అయన అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సిఎం అధికారులను ఆదేశించారు. ఇ
లాంటి ఘటనలు అనేకంగా జరుగుతున్న నేపథ్యంలో వీధి కుక్కల బెడదను శాశ్వతంగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సిఎం అధికారులను అప్రమత్తం చేశారు. వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో కాల్ సెంటర్ లేదా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించాలని అధికారులకు సూచించారు.
వీధి కుక్కలకు టీకాలు వేయడం, లేదా ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ లోని అన్నీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వీధి కుక్కలు దాడులు చేస్తే అవసరమైన మందులు అన్నీ అందుబాటులో ఉంచాలని సూచించారు. మున్సిపల్ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని కోరారు.
సంబంధిత కథనం