జనగామ జిల్లా కేంద్రంలో పది నెలల చిన్నారి కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపుతోంది. దాదాపు పది రోజుల కిందట చిన్నారి కిడ్నాప్ కాగా.. ఇంతవరకు పోలీసులు దుండగులను గుర్తించలేకపోయారు. దీంతో పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాల నుంచి జనగామకు వచ్చిన ఆ దంపతులు దుఖ:సాగరంలో మునిగిపోయారు. ఓ వైపు కిడ్నాప్ అయిన తమ కూతురి కోసం వెతుకుతూనే మరోవైపు మిగతా పిల్లలను సాకేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి….
చత్తీస్ గడ్ రాష్ట్రం ముంగేలి గ్రామానికి చెందిన పార్వతి, రామ్ జుల్ దంపతులు. పొట్టకూటి కోసం కొద్ది రోజుల కిందట జనగామ జిల్లా కేంద్రానికి వచ్చి.. స్థానిక కళ్లెం రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులు చేస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు సంతానం. పార్వతీ, రామ్ జుల్ తమ పనిని తాము చేసుకుంటుండగా.. దాదాపు 20 రోజుల కిందట ఖమ్మం జిల్లాకు చెందిన సురేష్, ప్రేమలత అనే ఇద్దరు దంపతులు వారి వద్దకు వచ్చారు. వారు కూడా పార్వతీ, రామ్ జుల్ పని చేస్తున్న ప్రదేశంలోనే పనికి కుదిరారు.
వారికి పిల్లలు లేకపోవడంతో పార్వతీ, రామ్ జుల్ చిన్న కూతురు శివాని వయసు పది నెలలు ఉండటంతో ఆ చిన్నారిని ఆడించేవారు. అల్లారుముద్దుగా చూసుకుంటూ ఎక్కడికి వెళ్లినా ఆ చిన్నారిని కూడా తమ వెంట తీసుకెళ్లేవారు. అలా సురేష్, ప్రేమలత దంపతులు పార్వతీ, రామ్ జుల్ కుటుంబంతో కలిసిపోయి ఉండేవారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 25వ తేదీ మంగళవారం రాత్రి సురేష్, ప్రేమలత దంపతులు కూరగాయల మార్కెట్ వెళ్తున్నట్టు చెప్పి, వారి వెంట శివానిని తీసుకుని బయటకు వెళ్లారు.
ఎంత సేపైనా తిరిగి రాకపోవడంతో బాధిత దంపతులు కంగారు పడ్డారు. అనంతరం ఫంక్షన్ హాల్ యజమానితో పాటు అక్కడి కాంట్రాక్టర్ కు విషయాన్ని చెప్పారు. గంటలు గడిచినా చిన్నారిని తీసుకెళ్లిన దంపతులు తిరిగి రాకపోవడం, కనీస సమాచారం కూడా అందించకపోవడంతో తమ కూతురును కిడ్నాప్ చేసినట్టు గుర్తించి, స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఫిబ్రవరి 25న చిన్నారి మిస్సింగ్ కంప్లయింట్ రిసీవ్ చేసుకున్న పోలీసులు రెండు రోజుల పాటు విచారణ పేరున హడావుడి చేశారు. సురేష్ దంపతులను తీసుకొచ్చిన కాంట్రాక్టర్ ద్వారా పూర్తి సమాచారం సేకరించారు. అయినా ఇంతవరకు ఆచూకీ కనిపెట్టలేకపోవడంతో పోలీసులు చిన్నారి కిడ్నాప్ కేసును లైట్ తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతోనే పది రోజులైనా చిన్నారి ఆచూకీ లభ్యం కాలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాగా తమ కూతురు కిడ్నాప్ అయి పది రోజులు అవుతున్నా ఆచూకీ దొరకడం లేదని, తిండి తినాలన్నా మనసొప్పడం లేదని బాధిత పార్వతీ, రామ్ జుల్ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డను తొందరగా వెతికి తీసుకురావాలని వేడుకుంటున్నారు.
జనగామ జిల్లా కేంద్రంలో చిన్నారి అపహరణ పిల్లల కిడ్నాప్ ముఠా పనేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు పది రోజుల పాటు పార్వతీ, రామ్ జుల్ దంపతులతో నమ్మకంగా నటించి, చిన్నారిని ఎత్తుకెళ్లగా.. సురేష్, ప్రేమలత దంపతుల వెనుక చిన్నపిల్లల కిడ్నాప్ గ్యాంగ్ ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పక్కా ప్లాన్ ప్రకారమే చిన్నారిని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తుండగా.. దాదాపు పది రోజులైనా చిన్నారి ఆచూకీ లభ్యం కాకపోవడం, కేసు దర్యాప్తు ముందుకు సాగకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎవర్ విక్టోరియస్ గా పేరున్న వరంగల్ పోలీసులు ఇకనైనా చిన్నారి కిడ్నాప్ కేసును సీరియస్ గా తీసుకుని, దోషులను పట్టుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.