Murder in Vikarabad: దారుణం..ట్రాలీ ఆటోతో తొక్కించి అన్నను చంపేసిన తమ్ముడు!
vikarabad district crime news: సొంత అన్నను తమ్ముడే హత్య చేసిన ఘటన వికారాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. ఏకంగా వాహనంతో తొక్కించి హత్య చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Man Murdered by Young Brother: వారిద్దరు సొంత అన్నదమ్ములు. గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో అనేకమార్లు దూషించుకున్నారు. మొన్నటివరకు నగరంలో ఉన్న అన్న... మళ్లీ గ్రామానికి వచ్చాడు. విబేధాల కారణంగా భార్య వెళ్లిపోవటంతో తల్లి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో మరోసారి అన్నదమ్ములు గొడవపడ్డారు. అంతేకాదు తీవ్ర ఆవేశానికి లోనైన తమ్ముడు... అన్నను హత్య చేశాడు. నాలుగు చక్రాల ట్రాలీ ఆటోతో తొక్కించాడు. ఈ దారుణ ఘటన వికారాబాద్ జిల్లా పరిధిలో జరిగింది.
ట్రెండింగ్ వార్తలు
పోలీసుల వివరాల ప్రకారం... మర్పల్లి మండల పరిధిలో ఈ దారుణ ఘటన జరిగింది. జెంషద్పూర్ గ్రామానికి చెందిన భాగమ్మకు ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు ఏడాది కిందట చనిపోయాడు. రెండో కుమారుడు అశోక్ (45)కు భార్య చంద్రకళ, ఇద్దరు కుమారులున్నారు. విబేధాలతో కొన్ని ఏళ్లుగా అశోక్... భార్యకు దూరంగా ఉంటున్నాడు. నగరంలో కూలీ పని చేసుకుంటున్నాడు. అయితే ఏడాది కిందటే తిరిగి గ్రామానికి వచ్చాడు. తల్లి వద్ద ఉంటున్నాడు. తమ్ముడు యాదయ్యతో అశోక్ తరచూ గొడవ పడేవాడు. అయితే తల్లి భాగమ్మ అస్వస్థతకు గురి కావటంతో మంగళవారం కుమార్తె,అల్లుడు వచ్చాడు. ఈ సందర్భంగా అన్నదమ్ములు ఇద్దరూ మరోసారి గొడవ పడ్డారు.
ఆటోతో ఎక్కించాడు...
గొడవ కారణంగా ఇద్దరి మధ్య మాటల తీవ్రత పెరిగింది. చంపేస్తానంటూ ఆవేశంతో యాదయ్య ఊగిపోయాడు. అప్పటికే ఇంటిముందు ఉన్న ట్రాలీ ఆటోకు అడ్డంగా నిలబడి ఉన్నాడు అశోక్. ఆవేశంతో ఉన్న యాదయ్య ట్రాలీ అటోను అన్న(అశోక్)పై నుంచి ఎక్కించాడు. రెండుసార్లు అలా చేయటంతో అతని కాలు విరగడంతో పాటు తలకు తీవ్ర గాయాలయ్యాయి. జహీరాబాద్ కు తీసుకెళ్లారు. అక్కడ్నుంచి సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 12 గంటల సమయంలో అశోక్ మృతి చెందాడు. ఈ ఘటనపై తల్లి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇంత దారుణంగా హత్య చేయడానికి కేవలం ఆవేశమే కారణమా..? లేక ఇద్దరి మధ్య ఇతర విబేధాలు ఏమైనా ఉన్నాయా..? అన్న కోణంలో విచారిస్తున్నారు.