Rythu Bandhu : 5వ రోజు రైతుల ఖాతాల్లో రూ. 265.18 కోట్లు జమ
Rythu Bandhu : రైతుబంధు పదో విడత నిధుల జమ కొనసాగుతోంది. 5వ రోజు రూ. 265.18 కోట్లు.. లక్ష 51,468 మంది కర్షకుల ఖాతాల్లో జమయ్యాయి.
Rythu Bandhu : యాసంగి పంట సాయం కింద ఎకరానికి రూ. 5 వేల చొప్పున రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఐదో రోజు లక్షా 51 వేల 468 మంది రైతుల ఖాతాల్లో రూ. 265.18 కోట్ల నగదు జమ అయింది. 5 లక్షల 30 వేల 371 ఎకరాలకు నిధులు అందాయి. రోజుకి ఒక ఎకరం చొప్పున పెంచుతూ.. సంక్రాంతి లోపు రాష్ట్రంలో ప్రతి రైతుకి రైతుబంధు పెట్టుబడి సాయాన్ని అందించాలన్న ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా.. నిధులు జమవుతున్నాయి. పదో విడతలో మొత్తం కోటి 53 లక్షల 53 వేల ఎకరాలకు రైతు బంధు అందనుంది.
ట్రెండింగ్ వార్తలు
డిసెంబర్ 28 నుంచి రైతుబంధు నిధుల జమ ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి రోజు 1 ఎకరం వరకు ఉన్న 22.45 లక్షల మంది రైతులకు వారి ఖాతాల్లో రూ. 758 కోట్లు జమ చేసిన అధికారులు.. రెండో రోజు.. 2 ఎకరాల వరకు ఉన్న 15.96 లక్షల మంది రైతుల అకౌంట్లలో.. రూ. 1,218.38 కోట్లు డిపాజిట్ చేశారు. మూడో రోజు.. రూ. 687.89 కోట్లు కర్షకుల ఖాతాల్లో జమ చేశారు. 3వ రోజు.. 13 లక్షలా 75 వేల 786 ఎకరాలకు గాను.. 5.49 లక్షల మంది రైతులు .. రైతుబంధు నిధులు అందుకున్నారు. 4వ రోజు.. 4.57 లక్షల మంది రైతులకి చెందిన 11.50 లక్షల ఎకరాలకు గాను.. రూ. 575. 09 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఐదో రోజు లక్షా 51 వేల 468 మంది రైతుల ఖాతాల్లో రూ. 265.18 కోట్ల నగదు జమ అయింది. 5 లక్షల 30 వేల 371 ఎకరాలకు నిధులు అందాయి.
రైతుబంధు, రైతుభీమా, ఉచిత కరెంటు పథకాలు చారిత్రాత్మకమైనవి.. రైతుల కళ్లలో ఆనందమే కేసీఆర్ లక్ష్యమని... మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు రాక, సాగునీళ్లు లేక రైతాంగం వ్యవసాయం వదిలేసి వలసబాట పట్టారని..
బోరు బావుల కింద వ్యవసాయం చేయలేక రైతాంగం నష్టాల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో కేవలం ఎనిమిదేళ్లలో తెలంగాణ వ్యవసాయరంగ స్వరూపం మారిపోయిందని అన్నారు. వ్యవసాయరంగం బలపడితేనే దేశం పటిష్టంగా ఉంటుందన్న మంత్రి.... తెలంగాణ పథకాలు చూసి దేశ రైతాంగం బీఆర్ఎస్ వైపు చూస్తున్నదని చెప్పారు. సంపద పెంచాలి .. ప్రజలకు పంచాలి అన్నదే కేసీఆర్ విధానమన్నారు. రాష్ట్రంలో 47.75 లక్షల మందికి ప్రతి నెలా ఫించన్లు ఇస్తున్నామని...11.55 లక్షల మందికి కళ్యాణలక్ష్మి, 12.66 లక్షల మందికి కేసీఆర్ కిట్లు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని... 2014లో 298 గురుకులాలు ఉంటే నేడు 1201 గురుకులాలు ఉన్నాయని వెల్లడించారు. విద్య, వైద్యం, వ్యవసాయ, ఉపాధి రంగాలలో గణనీయమైన వృద్ది సాధించామని... బీఆర్ఎస్ తో దేశ రాజకీయాల్లో కేసీఆర్ తనదైన ముద్ర వేయడం ఖాయమని స్పష్టం చేశారు.