మావోయిస్టులకు మరో దెబ్బ.. పోలీసుల ఎదుట లొంగిపోయిన 14 మంది.. ఇదే బాటలో మరికొందరు!-14 maoists surrender before bhadradri kothagudem district police ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  మావోయిస్టులకు మరో దెబ్బ.. పోలీసుల ఎదుట లొంగిపోయిన 14 మంది.. ఇదే బాటలో మరికొందరు!

మావోయిస్టులకు మరో దెబ్బ.. పోలీసుల ఎదుట లొంగిపోయిన 14 మంది.. ఇదే బాటలో మరికొందరు!

మావోయిస్టులకు మరో దెబ్బ తగిలింది. ఏకంగా 14 మంది పోలీసుల ఎదుట లొంగిపోయారు. మరికొంత కూడా లొంగిపోయే అవకాశం ఉందని.. పోలీసులు చెబుతున్నారు. ఆపరేషన్ కగార్, నాయకత్వ సమస్య కారణంగా మావోయిస్టులు లొంగిపోతున్నారని తెలుస్తోంది. జనజీవన స్రవంతిలోకి వచ్చిన వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది.

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ

సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన 14 మంది సభ్యులు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. దీనికి సంబంధించిన వివరాలను మంగళవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు వెల్లడించారు. వివిధ క్యాడర్ లో పనిచేస్తున్న 14మంది సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోయారని వివరించారు. నక్సలిజంలో కాలం చెల్లిన సిద్ధాంతాలు ఉండటం వల్ల.. వీటిని గమనించిన కొంతమంది సభ్యులు లొంగిపోయేందుకు ముందుకు వస్తున్నారని స్పష్టం చేశారు.

సౌకర్యాలకు ఆకర్షితులై..

లొంగిపోయిన సభ్యులకు ప్రభుత్వం తరఫున అనేక సౌకర్యాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్టు ఎస్పీ వివరించారు. లొంగిపోయిన వారికి వెంటనే రూ. 25వేల ఆర్థిక సహాయం ఇస్తున్నట్టు చెప్పారు. ఆ తర్వాత ఉపాధి కొరకు దశలవారీగా ఆర్థిక సహాయం ప్రభుత్వం తరఫున చేస్తున్నట్లు వివరించారు. తెలంగాణ పోలీస్ శాఖ లొంగిపోయిన మావోయిస్టు సభ్యులకు అందిస్తున్న పునరావాస సౌకర్యాలకు ఆకర్షితులై.. వివిధ క్యాడర్ లో ఉన్న వారంతా తమ ఆయుధాలను విడిచిపెట్టి పోలీసుల ఎదుట లొంగిపోతున్నట్లు వివరించారు.

కారణాలు ఏంటి..

తెలంగాణ ప్రభుత్వం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తోంది. 'ఆపరేషన్ చేయూత' వంటి కార్యక్రమాల ద్వారా వారిని సమాజంలో తిరిగి కలిసేలా ప్రోత్సహిస్తోంది. ఈ చర్యలు మావోయిస్టుల్లో మార్పు తెస్తున్నాయి. అటు పోలీసులు మావోయిస్టులపై నిరంతరం ఒత్తిడి పెంచుతున్నారు. కూంబింగ్ ఆపరేషన్లు ముమ్మరం చేయడంతో మావోయిస్టులు అడవుల్లో ఎక్కువ కాలం ఉండలేకపోతున్నారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో చనిపోతామనే భయంతో చాలామంది లొంగిపోతున్నారు.

ఆర్థికంగా బలహీనం..

మావోయిస్టు పార్టీలో సరైన నాయకత్వం లేకపోవడం, సిద్ధాంతపరమైన విభేదాలు కూడా లొంగుబాటులకు కారణమవుతున్నాయి. చాలామంది సీనియర్ నాయకులు పోలీసుల చేతికి చిక్కడం లేదా మరణించడంతో పార్టీ బలహీనపడింది. మావోయిస్టు పార్టీ ఆర్థికంగా బలహీనపడింది. డబ్బు వసూలు చేయడం కష్టంగా మారడంతో కార్యకర్తలకు సరైన సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు. ఇది కూడా వారిని లొంగిపోయేలా చేస్తోంది. మావోయిస్టులు అమాయక ప్రజలను హింసించడం, అభివృద్ధి పనులను అడ్డుకోవడం వంటి చర్యల వల్ల ప్రజల్లో వారిపై వ్యతిరేకత పెరిగింది. ప్రజల మద్దతు కోల్పోవడంతో వారు ఒంటరిగా మారుతున్నారు.

కుటుంబాల ఒత్తిడి..

లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం, ఉద్యోగ అవకాశాలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తోంది. ఈ పునరావాస ప్యాకేజీ చాలామందిని ఆకర్షిస్తోంది. శాంతియుత జీవితం గడపాలని కోరుకునేవారు లొంగిపోవడానికి ఇది ఒక ముఖ్యమైన కారణంగా చెప్పవచ్చు. అడవుల్లో కష్టమైన జీవితం గడుపుతున్న మావోయిస్టులు తమ కుటుంబ సభ్యులను కలవాలని ఆరాటపడుతున్నారు. కుటుంబ సభ్యులు కూడా వారు తిరిగి రావాలని ఒత్తిడి చేస్తుండటంతో చాలామంది లొంగిపోతున్నారు.

బాసాని శివకుమార్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. గతంలో ఈనాడు, ఈటీవీ భారత్, టీవీ9 తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో పని చేశారు. 2025లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం