బ్లాక్ హిల్స్.. ఈ ఏరియా మావోయిస్టులకు అత్యంత సురక్షితమైన ప్రాంతంగా భద్రతా బలగాలు భావిస్తాయి. అందుకే 5 రోజులుగా కర్రెగుట్టల్లో ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. 44 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ కర్రెగుట్టల్లోకి దూసుకెళ్తున్నారు. అయితే.. కాస్త చీకటిపడినా.. ఏం కనిపించడం లేదు. ఇలాంటి చోట ఆపరేషన్ నిర్వహించడం బలగాలకు కత్తిమీద సాములా మారిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
1.శుక్రవారం రాత్రి కర్రెగుట్టల ప్రాంతం బాంబుల శబ్దాలు, కాల్పుల మోతతో కల్లోలంగా మారిందని.. చుట్టుపక్కల గిరిజనులు చెబుతున్నారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి హెలికాప్టర్లు నిరంతరం తిరుగుతున్నాయని చెప్పారు.
2.ములుగు జిల్లా వెంకటాపురం సరిహద్దును కేంద్రంగా చేసుకొని.. ఛత్తీస్గఢ్లోని కొత్తపల్లి మొదలుకొని భీమారంపాడు, కస్తూరిపాడు, చినఉట్లపల్లి, పెదఉట్లపల్లి, పూజారికాంకేర్, గుంజపర్తి, నంబి, ఎలిమిడి, నడిపల్లి, గల్గంలో ప్రధానంగా ఆపరేషన్ కొనసాగుతోంది.
3.రుద్రారం వరకు 90 కిలోమీటర్ల పొడవున ఉన్న కర్రెగుట్టలను తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు.. బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దట్టమైన అడవులను జల్లెడ పడుతూ కొండలపైకి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
4.భద్రతా బలగాలు అతి కష్టం మీద శనివారం సాయంత్రం కొంతమేరకు గుట్టలపైకి ఎక్కగలిగాయి. మావోయిస్టులు తలదాచుకున్నట్లు భావిస్తున్న సొరంగాన్ని గుర్తించాయి.
5.ఈ ప్రాంతంలో ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత.. ఇప్పటి వరకు ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతదేహాలను, ఆయుధాలను, పెద్దఎత్తున పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెబుతున్నారు.
6.కూంబింగ్ జరుగుతుండగా.. శనివారం భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతిచెందినట్లుగా ప్రచారం జరిగింది. కానీ.. ఇటు తెలంగాణ, అటు ఛత్తీస్గఢ్ పోలీస్ ఉన్నతాధికారులు నిర్ధారించలేదు.
7.కర్రెగుట్టల అభయారణ్యంలో ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ల ఏర్పాటు వేగంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. నక్సల్స్కు కంచుకోటగా ఉన్న అబూజ్మడ్ను వీటితోనే ఛిన్నాభిన్నం చేశారు. అదే తరహాలో ఇక్కడా ఎఫ్ఓబీలు నెలకొల్పి మావోయిస్టులను నిలువరించాలని ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది.
8.బ్లాక్ హిల్స్ సమీపంలో ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీమారంపాడు, పూజారికాంకేర్, నంబి, గల్గం, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుగుప్పలో బేస్ క్యాంపులు కొనసాగుతున్నాయి.
9.ప్రస్తుతం కర్రెగుట్టల కు అనుబంధంగా ఉన్న పామునూరు, తడపల, పెనుగోలు ప్రాంతాల్లో వాటి ఏర్పాటు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ క్యాంపుల్లో దాని పరిధికి అనుగుణంగా 500 నుంచి 1000 మంది జవాన్లతో భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
10 ఈ ఆపరేషన్లో.రక్షణ దళానికి చెందిన అత్యాధునిక హెలికాప్టర్లు కీలక భూమిక పోషిస్తున్నాయి. నిత్యం గుట్టలపై చక్కర్లు కొడుతున్నాయి. మావోయిస్టులు బంకర్లలో దాక్కున్నారన్న అనుమానంతో వారిని బయటకు రప్పించేందుకు పెద్దఎత్తున బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్లను వినియోగిస్తున్నట్లు సమచారం.
11.డజన్ల సంఖ్యలో అధునాతన డ్రోన్లతో బ్లాక్ హిల్స్ను నిశితంగా పరిశీస్తున్నారు. ఈ ఆపరేషన్ మరో వారంపాటు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. బలగాలకు అందుకు సరిపడా సామాగ్రిని సిద్ధం చేసి పంపారు. ఈ ఆపరేషన్తో సమీప గిరిజన గ్రామాలు వణికిపోతున్నాయి.
సంబంధిత కథనం