ఇందిరమ్మ ఇండ్ల పథకం.. శరవేగంగా రెండో దఫా సర్వే.. 10 ముఖ్యమైన అంశాలు-10 important points regarding the second phase survey of the indiramma housing scheme ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఇందిరమ్మ ఇండ్ల పథకం.. శరవేగంగా రెండో దఫా సర్వే.. 10 ముఖ్యమైన అంశాలు

ఇందిరమ్మ ఇండ్ల పథకం.. శరవేగంగా రెండో దఫా సర్వే.. 10 ముఖ్యమైన అంశాలు

ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా రెండో దఫా గృహాల నిర్మాణాల కోసం లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఓవైపు పైలెట్‌ గ్రామాల్లో పునాది స్థాయి దాటిన ఇళ్లకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసిన సర్కారు.. మిగిలిన ప్రాంతాల్లోనూ నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు చేపడుతోంది.

బేస్‌మెంట్ దశలో ఇందిరమ్మ ఇల్లు (HT Telugu)

ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ఇప్పటికే పైలెట్‌ గ్రామాల్లో ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మిగతా గ్రామాల్లో అర్హులను గుర్తించేందుకు సర్వే బృందాలు రంగంలోకి దిగాయి. ఒక్కో మండలాన్ని జిల్లా స్థాయి అధికారి పర్యవేక్షిస్తున్నారు. ప్రతి గ్రామంలో.. గెజిటెడ్‌ స్థాయి అధికారి సుమారు 200 దరఖాస్తులను సర్వే చేస్తున్నారు. దీనికి సంబంధించిన ముఖ్యమైన 10 అంశాలు ఇలా ఉన్నాయి.

10 ముఖ్యమైన అంశాలు..

1.రెండో దఫా ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపునకు సంబంధించి అర్హతలు ఏంటి, జాబితాలో అనర్హులు ఎంతమంది ఉన్నారో సర్వే ద్వారా తేల్చనున్నారు.

2.దరఖాస్తుదారు వృత్తి, ప్రస్తుత ఇంటి స్థితిగతులు, ఇంటి నిర్మాణానికి సొంత జాగా ఉందా.. ఒకవేళ స్థలం ఉన్నా దానికి సంబంధించిన పట్టా, రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్ ఉన్నాయా పరిశీలిస్తున్నారు.

3.గ్రామీణ ప్రాంతాల్లో అయితే దరఖాస్తు చేసుకున్న వారి ఆదాయం నెలకు రూ.15,000, పురపాలికలు, నగరాల్లో రూ.25,000లోపు ఉందా.. అంతకన్నా ఎక్కువ సంపాదిస్తున్నారా అనే వివరాలను జాబితాలో పొందుపరుస్తున్నారు.

4.గ్రామాల్లో దరఖాస్తుదారు కుటుంబం స్థానికంగానే నివాసముంటుందా, నగరపాలిక/పురపాలికల్లో అయితే ఐదేళ్లుగా నివాసముంటున్నారా లేదా అనే సమాచారం సేకరిస్తున్నారు.

5.ప్రభుత్వ నిబంధనల ప్రకారం లేనివారిని.. ఈ సర్వే ద్వారా అనర్హుల జాబితాలో చేర్చనున్నారు. క్షేత్రస్థాయిలో గెజిటెడ్‌ అధికారి సర్వే చేసి అర్హులుగా గుర్తించి ధ్రువీకరించిన వారికే రెండో దఫాలో ఇందిరమ్మ ఇళ్లు దక్కనున్నాయి.

6.ప్రభుత్వం ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కేటాయించింది. తొలి దఫాలో భాగంగా ప్రతి మండలానికో గ్రామాన్ని పైలెట్‌ ప్రాజెక్టు కింద అధికారులు ఎంపిక చేసి అర్హులైన వారి ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు.

7.ప్రస్తుతం అధికారుల సర్వే పూర్తయ్యాక జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ధ్రువీకరించిన దరఖాస్తుదారులకే.. ఇళ్లు దక్కనున్నాయి. ఈ నెల 30 వరకు అర్హతల పరిశీలన ప్రక్రియ పూర్తికానుంది. మే 2 వరకు లబ్ధిదారుల జాబితాను గ్రామ, పురపాలిక, నగరపాలిక కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు.

8.'రెండో దఫా ఇందిరమ్మ ఇండ్ల కోసం అర్హులను గుర్తించే ప్రక్రియ సాగుతోంది. ఒక్కో గెజిటెడ్‌ అధికారి 150 నుంచి 200 దరఖాస్తులను సర్వే చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక జిల్లాలోని అర్హుల జాబితాను తొలుత కలెక్టర్‌కు అందజేస్తాం. అక్కడి నుంచి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రికి చేరుతుంది. లబ్ధిదారుల తుది జాబితాలను ప్రదర్శించి ఇళ్లు మంజూరు చేస్తాం' అని అధికారులు చెబుతున్నారు.

9.ఈ పథకం కింద అర్హులైన పేద కుటుంబాలకు ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తారు. ఇది పూర్తిగా సబ్సిడీ రూపంలో ఉంటుంది. ఇల్లు లేని వారికి ఉచితంగా స్థలం లేదా స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తారు.

10.ఇంటి నిర్మాణం పూర్తయిన దశలను బట్టి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు నేరుగా నగదు బదిలీ చేస్తారు. సాధారణంగా నిధులు మూడు లేదా నాలుగు విడతలుగా విడుదల చేస్తారు. కొన్ని నివేదికల ప్రకారం.. ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు చెల్లిస్తారని తెలుస్తోంది.

సంబంధిత కథనం